వర్షాలు కురుస్తుండడంతో సీజనల్ వ్యాధుల ముప్పు పొంచి ఉన్నందున రంగారెడ్డి జిల్లా వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైనది. వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నది. ఆహారం, నీటి పరిశుభ్రత లోపిస్తే కామెర్లు, టైఫాయిడ్, దోమకాటుతో మలేరియా, డెంగీ వంటి వ్యాధులు ప్రబలే అవకాశమున్నందున వాటి నివారణకు అవసరమైన చర్యలు చేపడుతున్నది. మున్సిపాలిటీలు, పంచాయతీల్లో క్రమం తప్పకుండా పారిశుద్ధ్య పనులు చేయించడం, యాంటీ లార్వా ఆపరేషన్, ‘ఫ్రై డే.. డ్రై డే’ వంటి కార్యక్రమాలను అధికారులు చేపడుతున్నారు. ప్రభుత్వ దవాఖానల్లో అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచారు. ప్రభుత్వ చర్యలతో గ్రామాలు, పట్టణాలు పచ్చదనం, పరిశుభ్రతతో కళకళలాడుతుండగా.. వ్యాధుల వ్యాప్తికి అడ్డుకట్ట పడింది.
-రంగారెడ్డి, జూలై 22(నమస్తే తెలంగాణ)
రంగారెడ్డి, జూలై 22 (నమస్తే తెలంగాణ) : గత కొన్నేండ్లుగా చెప్పుకోదగ్గ రీతిలో సీజనల్ కేసులు జిల్లాలో నమోదు కానప్పటికీ.. ఎప్పటిలాగే ఈసారి కూడా జిల్లా వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. ప్రభుత్వ ఆసుపత్రులకు రోగుల తాకిడిని తగ్గించే క్రమంలో వ్యాధుల నియంత్రణకు ముందస్తు ప్రత్యేక ప్రణాళికలను సిద్ధం చేసి ఉంచింది. మున్సిపాలిటీ, పంచాయతీల్లో పారిశుధ్య పనులు చేయించడం.. యాంటీ లార్వా ఆపరేషన్ వంటి కార్యక్రమాలను చేపట్టేందుకు ప్లాన్ చేస్తున్నది. సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ‘ఫ్రై డే.. డ్రై డే’ వంటి కార్యక్రమాలను పకడ్బందీగా చేపడుతున్నది. ఎటువంటి మందుల కొరత లేకుండా సరిపోను మందులను ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంచారు.
సీజనల్ వ్యాధులకు కళ్లెం వేసేందుకు జిల్లా వైద్యశాఖ సన్నద్ధమవుతున్నది. ఆహారం, నీటి పరిశుభ్రత లోపిస్తే కామెర్లు, టైఫాయిడ్, అతిసార, కలరా.. దోమకాటు వల్ల మలేరియా, డెంగ్యూ, మెదడువాపు, చికున్ గున్యా, ఫైలేరియా వంటి వ్యాధులు ప్రబలుతాయి. పౌష్టికాహార లోపం వల్ల కూడా వ్యాధులు వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో వైద్య సిబ్బంది నిత్యం అందుబాటులో ఉండి సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించి ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేసేలా చర్యలు తీసుకుంటున్నారు. వాటర్ ట్యాంక్లు, గుంతలు, ఇతర ప్రదేశాల్లో నీటి నిల్వలతో దోమలు, ఈగలు పెరిగి వ్యాధుల వ్యాప్తికి కారణమవుతుండడంతో ప్రతి శుక్రవారం నిర్వహించే డ్రై డేను పకడ్బందీగా అమలు చేస్తున్నారు.
వ్యాధులు తగ్గుముఖం
గతంతో పోలిస్తే గడచిన నాలుగైదేండ్ల కాలంలో జిల్లాలో రోగాలు చాలావరకు తగ్గుముఖం పట్టాయి. వర్షాకాలం వచ్చిందంటే మలేరియా, స్వైన్ఫ్లూ, డెంగ్యూ, కలరా, డయేరియా, ఫైలేరియా, మెదడు వాపు వంటి వ్యాధులు చుట్టుముట్టేవి. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలతో పాటు ప్రజారోగ్యం కోసం తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న చర్యలతో గత పరిస్థితులు కనుమరుగవుతూ వస్తున్నాయి. 2022లో 711 డెంగ్యూ కేసులు నమోదు కాగా.. 2023లో ఆ సంఖ్య 27కి తగ్గింది. 2020లో ఒక్క మలేరియా కేసు, 2021లో మూడు కేసులు, 2022లో ఒక్క కేసు మాత్రమే నిర్ధారణ అయ్యింది. ఈ ఏడాదిలో 1,74,268 రక్త నమూనాలను పరీక్షిస్తే ఒక్క మలేరియా కేసు కూడా నమోదు కాలేదు. రెండేండ్ల కాలంలో చికున్ గున్యా, మెదడు వాపు వ్యాధులకు సంబంధించి ఒక్క కేసు కూడా లేకపోవడం గమనార్హం. నాలుగేండ్ల కాలంలో వ్యాధుల బారిన పడి మరణించిన దాఖలాలు లేవు.
నిరంతర పర్యవేక్షణ
ప్రతి యేటా ప్రభుత్వం ప్రజా రోగ్యం కోసం ప్రభుత్వం రూ.కోట్ల నిధులను వెచ్చిస్తున్నది. గచ్చిబౌలిలోని టిమ్స్ ఆసుపత్రి, కొండాపూర్లోని వంద పడకల జిల్లా ఆసుపత్రి, వనస్థలిపురంలోని ఏరియా ఆసుపత్రితోపాటు మహేశ్వరం, షాద్ నగర్, చేవెళ్లలోని ప్రభుత్వ ఆసుపత్రులు కార్పొరేట్ స్థాయి వసతులతో వైద్య సేవలను అందిస్తున్నాయి. వీటితోపాటు జిల్లాలోని 35 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 24 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, 2 సామాజిక ఆరోగ్య కేంద్రాలు, 59 బస్తీ దవాఖానలు, 82 పల్లె దవాఖానలు ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందిస్తున్నాయి. సీజనల్ వ్యాధుల నేపథ్యంలో రక్త నమూనాలు సేకరించి వ్యాధులను నిర్ధారించి అవసరమైన చికిత్సను వెంటనే అందిస్తున్నారు. విలేజ్ హెల్త్ రిజిస్టర్ను రూపొందించి ఇప్పటికే 1,78,734 కుటుంబాల ఆరోగ్య సమాచారాన్ని సేకరించిన వైద్యశాఖ ఆయా కుటుంబాలపై నిరంతర పర్యవేక్షణ ఉంచి ఆరోగ్య సేవలను అందిస్తున్నది.
నిర్లక్ష్యం చేయొద్దు : వెంకటేశ్వరరావు, డీఎంహెచ్వో
సీజనల్ వ్యాధులను నిర్లక్ష్యం చేయొద్దు. కలుషితం లేని నీటితోపాటు పరిశుభ్రమైన ఆహారాన్ని తీసుకోవాలి. జిల్లాలో మలేరియా కేసు ఈ ఏడాదిలో ఒక్కటీ లేదు. డెంగ్యూ వంటి కేసులు కూడా చాలావరకు తగ్గుముఖం పట్టాయి. వాతావరణ మార్పుల వల్ల జ్వరాలు వచ్చే అవకాశం ఉంది. ఆరంభంలోనే వైద్యులను సంప్రదించి చికిత్స చేయించుకోవాలి. అన్ని రకాల వ్యాధులకు ప్రభుత్వ ఆసుపత్రులలోనే ఉచితంగా పరీక్షలు చేస్తున్నారు. సీజనల్ వ్యాధులపై సిబ్బందికి అవగాహన కల్పిస్తున్నాం. మందుల కొరత లేదు.
వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి : కలెక్టర్ నారాయణరెడ్డి
వికారాబాద్ : నాలుగు రోజులుగా జిల్లాలో నిరంతరాయంగా వర్షాలు పడి తగ్గుముఖం పట్టినందున వ్యాధులు ప్రబలకుండా అన్ని మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీల్లో పారిశుధ్య పనులు చేపట్టాలని కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. శనివారం టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యాధులు ప్రబలకుండా మురికి కాలువల్లో చెత్తాచెదారం, గుంతలు, రోడ్లపై నీరు నిలువకుండా ఎప్పటికప్పుడు పారిశుధ్య పనులను చేపట్టాలన్నారు. తాగునీరు కలుషితం కాకుండా అన్ని సరఫరా పైప్లైన్లు లీకేజీలు లేకుండా మిషన్ భగీరథ అధికారులు పరిశీలించాలని సూచించారు.
స్వచ్ఛమైన తాగునీరు సరఫరా చేయాలని, వచ్చే మూడు రోజులు పరిశుభ్రతపై దృష్టి సారించి ప్రజలు రోగాల బారినపడకుండా చర్యలు చేపట్టాలన్నారు. జిల్లా వైద్య శాఖ అధికారులు తమ పరిధిలో వర్షాల కారణంగా సంభవించే సీజన్ వ్యాధులు, జ్వరాలు ప్రబలకుండా అన్ని ప్రాథమిక కేంద్రాల్లో అవసరమైన మందులను ఉంచుకోవాలన్నారు. మూడు రోజుల పాటు డ్రై డే పాటించాలన్నారు. ఆశావర్కర్లను అన్ని గ్రామాల్లో ఇంటింటికీ పంపించి దోమలు వృద్ధి చెందకుండా నీరు నిలువున్న చోట ఆయిల్ బాల్స్ వేయడం, దోమల మందు పిచికారీ చేయించాలన్నారు. పాత తొట్లు, టైర్లు, డబ్బాల్లో నీరు నిలువకుండా చూడాలన్నారు. సమావేశంలో ఎంపీడీవోలు, ఎంపీవోలు, మున్సిపల్ కమిషనర్లు, మిషన్ భగీరథ ఇంజినీరింగ్ అధికారులున్నారు.