ఆదిబట్ల, మార్చి 19 : ఆదిబట్ల పోలీస్స్టేషన్ పరిధిలో భారీ దొంగతనం జరిగింది. ఇంటికి తాళం వేసి కుటుంబసభ్యులతో కలిసి తమ బంధువుల ఇంటికి 11వ రోజు వేడుకకు వెళ్లి వచ్చేసరికి ఇంటి తాళాలు పగులగొట్టి ఇంట్లో ఉన్న బంగారం, నగదును దొంగలు ఎత్తుకెళ్లడంతో బాధితులు ఆదిబట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదిబట్ల సీఐ రఘువీర్రెడ్డి కథనం ప్రకారం.. ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధి బొంగులూరు గేట్ సమీపంలోని రాఘవేంద్ర గృహాల వద్ద గంజి యాదగిరి తన కుటుంబసభ్యులతో ఇంటిని నిర్మించుకుని నివాసం ఉంటున్నారు. ఈ నెల 16న తన కుటుంబసభ్యులు భార్య, ముగ్గురు కుమారులు, ఇద్దరు కోడళ్లతో కలిసి నల్లగొండ జిల్లా పీఏ పల్లిలో తమ బందువుల ఇంటిలో 11వ రోజు వేడుకకు ఇంటికి తాళం వేసి వెళ్లారు. వేడుకను ముగించుకుని యాదగిరి కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం 18న రాత్రి 8 గంటలకు బొంగులూరులోని తన ఇంటికి వచ్చాడు. మెయిన్డోర్ తాళం పగులగొట్టి ఉండడంతో లోపలికి వెళ్లి చూడగా గ్రౌండ్ ఫ్లోర్లోని ఒక అల్మారా, మొదటి అంతస్తులోని 2 అల్మారాలను పగులగొట్టి ఉన్నాయి. అందులో ఉన్న 16 తులాల బంగారు ఆభరణాలు, 2 లక్షల నగదు అపహరణకు గురైనట్లు గుర్తించాడు. వెంటనే బాధితులు ఆదిబట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. క్లూస్టీంతో పాటు క్రైం డీసీపీ కరుణాకర్ ఆదిబట్ల సీఐ రాఘవేందర్రెడ్డి, సీసీఎస్ సీఐ విజయ్, ఎస్ఐ వెంకటేశ్తో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. చోరీకి పాల్పడినవారి వేలిముద్రలను సేకరించారు. చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. త్వరలో దొంగలను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.