మర్పల్లి : విధులకు గైర్హాజరైన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని తాసీల్దార్ కార్యాలయం, ఐకేపీ, మండల వ్యవసాయ శాఖ కార్యాలయాన్ని, మీసేవ సెంటర్ను ఎమ్మెల్యే తనిఖీ చేశారు. తాసిల్దార్ కార్యాలయంలో రిజీస్టర్ను పరిశీలించారు. ధరణి రిజిస్ట్రేషన్ల గురించి తాసిల్దార్ తులసీరామ్ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల్లో విధులకు సమయానికి రానటువంటి సిబ్బందిపై, ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా గైర్హాజరు అయిన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఆయన వెంట ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు ఉన్నారు.