పరిగి, ఫిబ్రవరి 16 : ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు మద్దతు ధర లభించక అన్నదాతలకు నిరాశే మిగులుతున్నది. పరిగి మార్కెట్లో వ్యాపారులు చెప్పిందే ధర, అధికారులు సైతం వ్యాపారులకు వత్తాసుగా పలుకుతుండడంతో రైతులకు నష్టం జరుగుతున్నది. జనవరి 27వ తేదీన వేరుశనగకు మద్దతు ధర ఇవ్వాలని రైతులు ఆందోళన చేయగా, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి పరిగి మార్కెట్ను సందర్శించినా వ్యాపారుల తీరు మారడం లేదు. 20 రోజుల క్రితం అధికారులు ఇచ్చిన హామీలేవీ అమలు కాకపోవడం గమనార్హం.
పరిగి వ్యవసాయ మార్కెట్లో మొత్తం 58 మందికి కమీషన్ ఏజెంట్ల లైసెన్స్లు ఉండగా, 56 మంది లావాదేవీలు కొనసాగిస్తున్నారు. మార్కెట్లో 14 మంది ఖరీద్దారులు ఉండగా, కేవలం నలుగురే వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేస్తారు. పరిగిలో శుక్రవారం వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు జరుగుతాయి. జనవరి 26వ తేదీన సెలవు రోజు కావడంతో 27న పరిగి మార్కెట్కు పెద్ద ఎత్తున వేరుశనగను తీసుకురాగా అంతకుముందు వారం కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయాలని వ్యాపారులు నిర్ణయించడంతో రైతాంగం ఆందోళన చేసింది. జనవరి 27వ తేదీన 340 మంది రైతులు 4,118 క్వింటాళ్ల వేరుశనగ తీసుకొచ్చారు. ఫిబ్రవరి 2న 1,365 క్వింటాళ్లు, 9వ తేదీన 1,776 క్వింటాళ్ల వేరుశనగను రైతులు తీసుకొచ్చారు.
పరిగి, దోమ మండలాలతోపాటు పక్కనే ఉన్న కొడంగల్ నియోజకవర్గంలోని బొంరాస్పేట మండలంలోని పలు గ్రామాల రైతులు సైతం పరిగి మార్కెట్కు వేరుశనగ తీసుకొచ్చారు. కొనుగోలుదారులు నలుగురే కావడంతో ఒకరితో ఒకరు మాట్లాడుకొని ‘కన్ను కొట్టి కచ్చా మాల్’ పేరిట తక్కువ ధర నిర్ణయిస్తున్నారు. మరోవైపు తరుగు పేరిట ఒక బస్తా(30 కిలోల) వేరుశనగకు కిలో 300 గ్రాముల వరకు తీస్తుండడం విడ్డూరం. టెండర్ సమయంలో నిర్ణయించిన ధర కంటే క్వింటాలుకు సుమారు రూ.100 తక్కువగా చెల్లిస్తున్నారని రైతులు మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. తక్పట్టీల స్థానంలో బుక్కచిట్టీలపై వివరాలు రాసి ఇస్తూ ద్వారా రైతులను మోసం చేస్తున్నారు. మరోవైపు ఏజెంట్లు 5శాతం కమీషన్ వసూలు చేస్తున్నా అధికారుల చర్యలు శూన్యం.
పరిగి మార్కెట్లో పని చేస్తున్న కార్యదర్శి, సూపర్వైజర్ సైతం నాలుగేండ్లకుపైగా ఇక్కడే కొనసాగుతుండడంతో వారు రైతుల సంక్షేమం కంటే వ్యాపారులు బాగుంటే చాలనే విధంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. వికారాబాద్ ఆర్డీవో విజయకుమారి మార్కెట్ను సందర్శించి రైతులతో మాట్లాడుతున్న సందర్భంలో మార్కెట్ కార్యదర్శి మాట్లాడిన తీరుకు ఆర్డీవో ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి, డిప్యూటీ డైరెక్టర్ పద్మహర్ష మార్కెట్ను సందర్శించి మార్కెట్ కార్యదర్శి తీరుపై అసహనం వ్యక్తం చేశారు.
పరిగి మార్కెట్ యార్డులో వే బ్రిడ్జి ఏర్పాటు చేయడంతో తూకాల విషయంలో తమకు జరుగుతున్న అన్యాయానికి తెర పడుతుందని రైతాంగం భావించారు. కానీ నాలుగున్నర ఏండ్లుగా వే బ్రిడ్జి ఉపయోగంలో లేకపోవడం గమనార్హం.
వేరుశనగ రైతుల ఆందోళన నేపథ్యంలో పరిగి మార్కెట్ను మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి, డిప్యూటీ డైరెక్టర్ పద్మహర్షలు కమీషన్ ఏజెంట్లతో సమావేశం నిర్వహించారు. వే బ్రిడ్జిని మరమ్మతు చేయించి ఉపయోగంలోకి తీసుకొస్తామని హామీ ఇచ్చి 20 రోజులు దాటినా ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేదు. తక్పట్టీలు తప్పనిసరిగా ఇవ్వాలని, వారానికి రెండు రోజులు శుక్రవారం, మంగళవారం బీట్లు నిర్వహించి వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేయాలని ఆదేశించారు. తూకాలు సాయంత్రం లోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వ్యవసాయ ఉత్పత్తులు ప్లాట్ఫారంపై పోస్తే తరుగు తీయరాదని, కమీషన్ 2 శాతం కంటే అధికంగా తీసుకోరాదని పేర్కొన్నారు. ఉన్నతాధికారులు ఇచ్చిన హామీలలో ఏవీ అమలు కాకపోవడం గమనార్హం.