ఇబ్రహీంపట్నం, మార్చి 10 : భానుడు భగభగ మండుతున్నాడు. గతనెల చివరి వారం నుంచే తన ప్రతాపాన్ని చూపిస్తున్నా.. కొన్ని రోజులుగా మరింతగా సెగలు కక్కుతూ జనాలకు చెమటలు పట్టిస్తున్నాడు. మార్చి నెల ఆరంభంలోనే ఇలా ఉంటే మున్ముందు మరెంత తీవ్రంగా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వడగాల్పులు, ఉక్కబోతతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉదయం 8 గంటల నుంచే సూర్య ప్రతాపం మొదలవుతున్నది.
దీంతో ప్రజలు బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు పెద్ద ఎత్తున నమోదవుతున్నాయి. సాధారణంగా ఈ సమయంలో గరిష్ఠ ఉష్ణోగ్రత 34 డిగ్రీల లోపు ఉండాలి. కానీ ప్రస్తుతం అంతకుమించి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే రానున్న రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు బెంబేలెత్తుతున్నారు. వారం కిందట 30 డిగ్రీలున్న గరిష్ఠ ఉష్టోగ్రత.. ఆదివారం ఏకంగా 38.8 డిగ్రీలు నమోదైంది. ప్రజలు ఎండ తాపాన్ని తల్టుకోలేక శీతలపానీయాల కోసం పరుగులు పెడుతున్నారు.
వేసవిలో ప్రధానంగా వడదెబ్బ బారిన పడకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వీలైనంత వరకు మధ్యాహ్నం 12గంటల నుంచి 3గంటల సమయంలో ఎండలో తిరుగవద్దని సూచిస్తున్నారు. తప్పనిసరి అయినప్పుడు టోపీలు, రుమాలు నెత్తిన ధరించాలని చెబుతున్నారు. కండ్లకు నాణ్యమైన కూలింగ్ గ్లాసెస్ వాడాలని, బైక్లపై తిరిగే వారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచిస్తున్నారు. చెవుల్లోకి వేడిగాలి వెళ్ల్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. సహజ సిద్ధ్దమైన కొబ్బరినీరు, లస్సీ, మజ్జిగ, అంబలి, తాజా పండ్లరసాలు తీసుకోవాలని, తరుచుగా ఓఆర్ఎస్ ద్రావణాన్ని తాగుతూ ఉండాలని వైద్యనిఫుణులు సూచిస్తున్నారు.