గ్రామీణ క్రీడాకారులకు ఆటపై ఆసక్తి కల్పించడంతోపాటు వారిలోని ప్రతిభను వెలికి తీసే దిశగా తెలంగాణ సర్కార్ చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఊరూరా క్రీడా మైదానాలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. ప్రస్తుతం సీఎం కప్ పేరిట వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, ఫుట్బాల్ తదితర ఆటల పోటీలు నిర్వహించాలని నిర్ణయించింది. సర్కార్ ఆదేశాల మేరకు రంగారెడ్డి జిల్లా యువజన, క్రీడల శాఖ షెడ్యూల్ను విడుదల చేసింది. ఈ నెల 15 తేదీ నుంచి 17 వరకు మండలస్థాయి క్రీడా పోటీలు, 22 నుంచి 24 వరకు జిల్లా స్థాయి పోటీలు నిర్వహించనున్నది.
జిల్లా స్థాయిలో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులు ఈ నెల 28వ తేదీ నుంచి 31 వరకు జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొననున్నారు. అందుకోసం సంబంధిత అధికారులు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 15 నుంచి 36 ఏండ్ల వయస్సు కలిగిన యువతీయువకులకు క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు అవకాశం కల్పించారు. క్రీడల నిర్వహణపై గ్రామాల ప్రజాప్రతినిధులకు ఇప్పటికే సమాచారం అందించారు. ఆటలపోటీలను విజయవంతంగా నిర్వహించేందుకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. గ్రామీణ యువతలో క్రీడాస్ఫూర్తిని పెంచే దిశగా ప్రభుత్వం చొరవ చూపడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
– షాబాద్, మే 12
షాబాద్, మే 12 : గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. పల్లెప్రగతి కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామంలో ఒక తెలంగాణ క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేసింది. దీంతో గ్రామీణ యువతకు అదే గ్రామంలో వివిధ రకాల ఆటలు ఆడుకునేలా అవకాశం కల్పించింది. తాజాగా గ్రామాల్లో ప్రతిభ కలిగిన ప్రతి క్రీడాకారుడిని ప్రోత్సహించేందుకు సీఎం కప్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా క్రీడలకు శ్రీకారం చుట్టింది.
క్రీడలతోనే దేహదారుఢ్యం, మానసికోల్లాసం, మంచి భవిష్యత్ ఉంటుందనే సందేశంతో విద్యార్థులు, యువతను సన్నద్ధం చేస్తుంది. ఈ నెల 15వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి ఆటలు నిర్వహించాలని అధికార యంత్రానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రంగారెడ్డిజిల్లా యంత్రాంగం, జిల్లా యువజన, క్రీడల శాఖ ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. ఆయా మండలాల అధికారులు క్రీడల నిర్వహణపై గ్రామాల ప్రజాప్రతినిధులకు సమాచారం అందించారు. ఎక్కువ మొత్తంలో యువత పాల్గొనేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు.
రంగారెడ్డిజిల్లాలో క్రీడల షెడ్యూల్ విడుదల
రంగారెడ్డిజిల్లా వ్యాప్తంగా చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల పరిధిలోని 27 మండలాల్లో సీఎం కప్కు సంబంధించిన క్రీడల షెడ్యూల్ను అధికారులు విడుదల చేశారు. ఈ నెల 15 నుంచి 17వరకు మండల స్థాయి పోటీలు జరుగుతాయి. వాటిల్లో 15 నుంచి 36 ఏండ్ల వయస్సు కలిగిన యువతీ, యువకులు పాల్గొంటారు. మండల స్థాయిలో అథ్లెటిక్స్ (100-400 మీటర్లు), వాలీబాల్(పురుషులు, మహిళలు), కబడ్డీ (పురుషులు, మహిళలు), ఖోఖో (పురుషులు, మహిళలు), ఫుట్బాల్(పురుషులు)ఆటలు ఆడాల్సి ఉంటుంది. ఆయా పోటీల్లో గెలుపొందిన జట్లు, క్రీడాకారులను ఈ నెల 22వ తేదీ నుంచి 24వ తేదీ వరకు జిల్లా స్థాయిలో జరిగే పోటీలకు పంపిస్తారు.
జిల్లా స్థాయిలో మరికొన్ని అదనపు క్రీడలు కబడ్డీ (పురుషులు, మహిళలు), వాలీబాల్ (పురుషులు, మహిళలు),స్విమ్మింగ్ (పురుషులు, మహిళలు), అథ్లెటిక్స్ లాంగ్ జంప్, షాట్పుట్ (పురుషులు, మహిళలు), ఖోఖో (పురుషులు, మహిళలు), బాస్కెల్ బాల్(పురుషులు, మహిళలు), పుట్బాల్(పురుషులు), బ్యాట్మింటన్(పురుషులు, మహిళలు), బాక్సింగ్(పురుషులు), హ్యాండ్ బాల్ పోటీలు నిర్వహించనున్నారు. వీటిల్లో గెలుపొందిన క్రీడాకారులు, జట్లను రాష్ట్ర స్థాయిలో ఈ నెల 28 నుంచి 31వరకు నిర్వహించే సీఎం కప్లో పాల్గొనేందుకు పంపిస్తారు. కాగా జిల్లా స్థాయిలో అదనంగా జరిగే పోటీల్లో పాల్గొనే క్రీడాకారులను మండల స్థాయిలో ఎంపికలు నిర్వహించనున్నారు.
క్రీడలు సక్సెస్ కోసం ప్రత్యేక కమిటీలు
మండల, జిల్లా స్థాయి ఆటలపోటీలను విజయవంతంగా నిర్వహించేందుకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. మండల స్థాయి కమిటీ చైర్మన్గా ఎంపీపీ, మెంబర్గా జడ్పీటీసీ, కన్వీనర్గా ఎంపీడీవో, సభ్యులుగా తహసీల్దార్, ఎంఈవో, ఎస్ఐ, పీడీలు, పీఈటీలు, మున్సిపల్ కమిషనర్లు ఉంటారు. ఆసక్తి కలిగిన సీనియర్ క్రీడాకారులను కమిటీల్లోకి తీసుకుని ఆటలను విజయవంతం చేయాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వం దిశానిర్దేశం చేసింది.
అన్ని రకాల పోటీలకు క్రీడా మైదానాలను సిద్ధం చేయాలని ఇప్పటికే సంబంధిత అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్ర స్ధాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్ ఆటల షెడ్యూల్ను ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్రంలోని ప్రతి గ్రామం నుంచి క్రీడాకారులు పాల్గొనేలా చర్యలు తీసుకుంటున్నది. మండల స్థాయిలో ఐదు రకాల క్రీడాపోటీలు నిర్వహించగా, జిల్లా స్థాయిలో 11 రకాలు, రాష్ట్ర స్థాయిలో 18 రకాల క్రీడా పోటీలు నిర్వహించి విజేతలకు సీఎం కప్ పేరుతో నగదు బహుమతులు అందజేయనున్నారు.