‘మన ఊరు- మన బడి’తో ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ రానున్నది. ఇందులో భాగంగా ప్రతి స్కూల్లో మౌలిక వసతులు కల్పించేందుకు సర్కార్ చర్యలు తీసుకుంటున్నది. అంతేకాకుండా అన్ని తరగతులకు ఇంగ్లిష్ మీడియంలో బోధన అందుబాటులోకి తేనున్నది. అయితే, ఇప్పటికే పలు ప్రభుత్వ స్కూళ్లలో ప్రవేశపెట్టిన ఇంగ్లిష్ మీడియం బోధన విజయవంతంగా జరుగుతున్నది. అందుకు నిలువెత్తు నిదర్శనం అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని తారామతిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల. ఇక్కడ కొన్నేండ్లుగా 6 నుంచి 10వ తరగతి వరకు ఆంగ్లంలోనే బోధిస్తున్నారు. దీంతో తల్లిదండ్రులు సైతం తమ పిల్లలను ఈ బడికి పంపేందుకు ఆసక్తి చూపుతుండగా.. ఏటేటా విద్యార్థుల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. ప్రస్తుతం 300 పైగా విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఇక్కడ దాతల సహకారంతో అన్ని వసతులు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా నాణ్యమైన విద్య లభిస్తుండడంతో చాలామంది విద్యార్థులు ప్రైవేటు బడులకు స్వస్తి పలికి.. ఈ స్కూల్లో చేరుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం చేపట్టిన ‘మన ఊరు మన బడి’తో మరిన్ని సౌకర్యాలతోపాటు అన్ని తరగతుల్లో ఇంగ్లిష్లో బోధన అందుబాటులోకి రానుండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
-హయత్నగర్ రూరల్, జనవరి 30
ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తున్నది. అందులో భాగంగానే మన ఊరు-మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినది. ఇందులో భాగం గా జిల్లాలోని అన్ని బడుల్లో మౌలిక వసతులు కల్పించేం దుకు చర్యలు తీసుకుంటున్నది. చదువు ఉంటే ఎక్కడై నా గౌరవంగా బతుకొచ్చు. అందులోనూ ఇంగ్లిష్ మీడియంలో చదివితే ఆ దర్జా రెట్టింపే. అందుకే రాష్ట్ర ప్రభు త్వం వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఒకటి నుంచి పదోతరగతి వరకు ఆంగ్ల మాధ్యమాన్ని బోధించేందు కు చర్యలు తీసుకుంటున్నది. అయితే, ఇప్పటికే సక్సెస్ స్కూల్స్ పేరిట ఆంగ్ల మాధ్యమంలో బోధిస్తున్న పలు పాఠశాలలు విజయవంతంగా నడుస్తున్నాయి. విద్యార్థులు, అటు తల్లిదండ్రుల ఆసక్తికి అనుగుణంగా అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని తారామతిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల ‘సక్సెస్’ అవుతున్నది. ఇక్కడ ఆంగ్ల మాధ్యమంలో జరుగుతున్న బోధన తో విద్యార్థుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న ది. ఆరు నుంచి పదో తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో బోధిస్తున్నారు. దీంతో తల్లిదండ్రులు సైతం తమ పిల్లలను సర్కారు బడికే పంపించేందుకు మొగ్గు చూపుతున్నారు. ప్రైవేటు బడుల్లో ఫీజులు చెల్లించే స్థోమత లేక కొందరు, ప్రభుత్వ బడిలోనే మంచి బోధన అందుతున్నదని మరికొందరు ఇక్కడ చేరుతున్నారు.
పెరుగుతున్న విద్యార్థుల సంఖ్య..
పాఠశాలలో విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. మూడేండ్ల కిందట దాదాపు 200 మంది వరకు విద్యార్థులు ఉండగా.. ప్రస్తుతం వారి సంఖ్య 300 పైచిలుకు చేరింది. గత రెండేండ్లలో కొవిడ్ కారణంగా దాదాపు 10 నుంచి 15 శాతం వరకు విద్యార్థులు పెరిగా రు. వారంతా ప్రైవేటు బడులకు స్వస్తి పలికి.. ఇక్కడ చేరారు. ఇక్కడ ఉపాధ్యాయులు విద్యార్థులను సెక్షన్లవారీగా విభజించి పాఠాలను బోధిస్తున్నారు. ఒకప్పుడు ఒక్క పీరియడ్ ఉండే ఆంగ్ల భాషను విని, అర్థం చేసుకునేందుకు పిల్లలు జంకేవారు. కానీ, ఇప్పుడు అర్థం చేసుకోవడమే కాదు, పలు వురు ఇంగ్లిష్ భాషను సులభంగా మాట్లాడేస్థాయికి ఎదిగారు. ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు విద్యార్థుల సామర్థ్యాన్ని అంచనా వేస్తూ వారికి మరింత నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. విద్యార్థులు సైతం కష్టపడుతూ ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారు. 2011-12లో పదోతరగతి పరీక్షల్లో 60 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 2012-13లో 61% మంది ఉత్తీర్ణులు కా గా, 2017-18లో 60%, 2018-19 లో 68% మంది విద్యార్థులు పాస్ అయ్యారు. గత రెండేండ్ల కాలంలో కొవి డ్ కారణంగా వందశాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఆన్లైన్ క్లాసుల కారణంగా మొదట్లో విద్యార్థులు కొంత వెనుకబడ్డారు. ప్రస్తుతం దాదాపు 50 మంది విద్యార్థులు పదోతరగతి చదువుతున్నారు.
మారనున్న రూపురేఖలు
మన ఊరు- మన బడి కార్యక్రమం కింద పాఠశాలలో మరిన్ని వసతులు చేకూరనున్నాయి. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా కొత్త తరగతి గదులు నిర్మాణం, బాలురు, బాలికలకు వేర్వేరుగా మరుగుదొడ్లు ఏర్పాటుకానున్నాయి. తాగునీటి వసతి కూడా అందుబాటులోకి రానుంది. అంతేకాకుండా విద్యార్థులు కూర్చునేందుకు అనువైన డబుల్ డెస్కు బెంచీలు రానున్నాయి. విద్యుద్దీకరణ, ప్రహరీలు, పాత భవనాలకు మరమ్మతులు ఇలా.. సకల వసతులు కలుగనున్నాయి.
బడి బాగుకు.. దాతల సహకారం
పాఠశాల అభివృద్ధికి తారామతిపేట గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు, దాతలు తోచినంత సాయం అందిస్తున్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు తోడ్పాటునందిస్తున్నారు. పాఠశాలకు మౌలికంగా కావాల్సిన వస్తువులను అందజేస్తున్నారు. ఉప సర్పంచ్ గోశిక నర్సింహ రెండు సౌండ్బాక్సులు, 100 ప్లేట్లు అందజేయ గా, వేముల కృష్ణ వాటర్ ట్యాంకును విరాళంగా ఇచ్చారు. మాలకొండయ్య 12 డెస్కు బెంచీలు, వీ వెంకటేశ్వర్లు, పసుపులేటి శంకర్, గోశిక నర్సింహ, సోము శ్రీశైలం మరో 10 డెస్కు బెంచీలు అందజేశారు. మూల కిరణ్కుమార్గౌడ్ మైక్సెట్, వడ్డేపల్లి రాజ్కుమార్ ల్యాప్టాప్, మూల మహేశ్గౌడ్, డీ శ్రీనివాస్ ఇంటర్నెట్ సౌక ర్యం కల్పించారు. బుడిగె బాలరాజ్ ప్రింటర్ అందజేయగా, పీ సుధామాధురి, చేగూరి చిన వెంకటేశ్ పోడియం నిర్మాణానికి విరాళం అందజేశారు.
చాలా బాగుంటుంది
సక్సెస్ పాఠశాలల్లో భాగంగా మా స్కూల్లో ఆంగ్ల మాధ్యమాన్ని బోధిస్తున్నాం. ఇంగ్లిష్ మీడియంలో బోధన ప్రారంభించిన తర్వాత విద్యార్థుల సంఖ్య బాగా పెరిగింది. కొందరు తల్లిదండ్రు లు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు బంద్ చేయించి.. మా దగ్గర చేర్పించారు. మా పాఠ శాలలో 300 మంది విద్యార్థులు ఆంగ్ల మాధ్యమంలో చదువుతున్నారు. వీరిలో ఎక్కువ మంది బాలికలే ఉన్నా రు. గ్రామస్తులు, దాతల సహకారం మరువలేము. సీఎ కేసీఆర్ అమలు చేస్తున్న మన ఊరు- మన బడి కార్యక్రమం ద్వారా పాఠశాలలో మరిన్ని మౌలిక వసతులు పెరుగుతాయి. విద్యార్థులకు ఉత్తమ భవిష్యత్తు లభిస్తుంది. ఇంగ్లిష్పై పట్టు ఉంటే ఉద్యోగ, ఉపాధి సులభంగా లభిస్తుంది. ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తే బాగుంటుంది.
-ఎన్ రామలింగం, తారామతిపేట ఉన్నతపాఠశాల ప్రధానోపాధ్యాయుడు (టీఎస్పీటీఏ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు)
ఆంగ్ల విద్యతో ఉజ్వల భవిష్యత్తు
తల్లిదండ్రులతోపాటు విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియంపై ఆసక్తి పెరిగింది. ఏటేటా పురోగతి సాధిస్తున్నారు. విద్యార్థులకు అర్థమయ్యేరీతిలో బోధిస్తున్నాం. ప్రభుత్వం అన్ని బడుల్లో ఆంగ్ల మాధ్యమాన్ని వచ్చే విద్యాసంవత్సరం నుంచి బోధించేందుకు ముందుకురావడం గొప్ప విషయం. ఇది విద్యార్థులకు బంగారు భవిష్యత్తును అం దిస్తుంది. ఇంగ్లిష్ అంటే భయం పోయి.. నేర్చుకోవాలన్న ఆసక్తి పెరుగుతున్నది. అన్ని బడుల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధన జరిగితే పేదలకు కూడా నాణ్యమైన విద్య అందుతుంది. మన ఊరు- మన బడి కార్యక్రమం తల్లిదండ్రులకు వరంగా నిలుస్తుంది. అన్ని బడుల్లో వసతులు పెరుగుతాయి.