వికారాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ) : సీఎం కేసీఆర్ ప్రభుత్వ పాఠశాలల్లో సమూల మార్పులను తీసుకువచ్చేందుకు చేపట్టిన మన ఊరు-మన బడి కార్యక్రమంతో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోతున్నాయి. సర్కారు స్కూళ్లలో సకల వసతులు కల్పించడంతో కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు రూపుదిద్దుకుంటున్నాయి. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మొదటి విడుతలో ఎంపిక చేసిన స్కూళ్లలో మండలానికి, మున్సిపాలిటీకి రెండు చొప్పున ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేసి సంబంధిత స్కూళ్లలో అవసరమైన మౌలిక సదుపాయాలను గుర్తించి పనులు పూర్తి చేశారు. మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా మొదటి విడుతలో ఎంపిక చేసిన స్కూళ్లలో జిల్లావ్యాప్తంగా పైలట్ ప్రాజెక్టు కింద 37 స్కూళ్లలో మౌలిక సదుపాయాల కల్పన పనులు పూర్తయ్యాయి. మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా పనులు పూర్తైన స్కూళ్లలో 10 స్కూళ్లను మంత్రి సబితారెడ్డి ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ప్రారంభించారు.
జిల్లావ్యాప్తంగా 1054 ప్రభుత్వ పాఠశాలలుండగా వీటిలో మొదటి విడుతలో 371 స్కూళ్లలో అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మొదటి విడుతలో ఎంపిక చేసిన స్కూళ్లలో ఉన్నత పాఠశాలలు-111, ప్రాథమికోన్నత పాఠశాలలు-40, ప్రాథమిక పాఠశాలలు-220 ఉన్నాయి. ఇప్పటివరకు పైలట్ ప్రాజెక్టు కింద 37 స్కూళ్లలో రూ.9.81 కోట్లతో పనులన్నీ పూర్తి చేశారు. మన ఊరు- మన బడి కార్యక్రమంలో భాగంగా 12 అంశాలను పరిగణనలోకి తీసుకొని పనులు నిర్వహిస్తున్నారు. మన ఊరు-మన బడిలో భాగంగా ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలల్లో తాగునీరు, ఫర్నీచర్, మరుగుదొడ్లు, విద్యుత్తు, గ్రీన్ చాక్బోర్డులు, పెయింటింగ్, ప్రహరీల నిర్మాణం, కిచెన్ షెడ్ల నిర్మాణం, శిథిలమైన తరగతి గదుల నిర్మాణం, మరమ్మతులు, డిజిటల్ విద్యకు అవసరమైన ఏర్పాట్లు, ఉన్నత పాఠశాలల్లో డైనింగ్ హాళ్లను సంబంధిత ప్రభుత్వ పాఠశాలల్లోకి అందుబాటులోకి తీసుకువచ్చారు.
మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా మొదటి విడుతలో చేపట్టిన స్కూళ్లలో మౌలిక సదుపాయాల కల్పన పనులను జూన్లోగా పూర్తి చేసేందుకు జిల్లా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. పనుల్లో నిర్లక్ష్యం చేయకుండా వేగవంతం చేసేలా వారంలో రెండు రోజులు మన ఊరు-మన బడి కార్యక్రమంతో ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి విద్యాశాఖతోపాటు పంచాయతీరాజ్ తదితర శాఖల అధికారులతో సమావేశాలను నిర్వహిస్తున్నారు. జిల్లాలో మొదటి విడతలో చేపట్టిన 371 స్కూళ్లలో ఇప్పటికే 37 స్కూళ్లలో పనులు పూర్తికాగా, మిగతా 334 స్కూళ్లలో పనులు పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టారు. ఇంకా పనులు ప్రారంభంకాని 53 స్కూళ్లలో వారం, పది రోజుల్లో పనులు ప్రారంభించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఇప్పటికే పనులు ప్రారంభించిన మరో 281 స్కూళ్లలో పనులు వేగవంతం చేశారు. సంబంధిత స్కూళ్లలోని మెజార్టీ స్కూళ్లలో 80 శాతానికిపైగా పనులు పూర్తయ్యాయి. జిల్లాలోని ప్రభుత్వ స్కూళ్లకు నైట్ వాచ్మెన్లను నియమించేందుకు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. మన ఊరు-మన బడిలో భాగంగా పనులు జరుగుతున్న స్కూళ్లలో నైట్ వాచ్మన్లను నియమించనున్నారు. నెలరోజుల నిమిత్తం నైట్ వాచ్మన్లను తీసుకోనున్నారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నైట్ వాచ్మెన్లను ఎంపిక చేసి ఏర్పాటు చేయనున్నారు. జిల్లావ్యాప్తంగా 160 స్కూళ్లకు నైట్ వాచ్మన్లను నియమించుకునేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది.
జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కింద మండలానికి రెండు స్కూళ్ల చొప్పున ఎంపిక చేసిన 37 స్కూళ్లలో ఇప్పటికే పనులు పూర్తయ్యాయి. వీటిలో పది స్కూళ్లను ప్రారంభించగా, మిగతా స్కూళ్లను స్కూళ్లను తెరిచేలోగా ప్రారంభించనున్నారు. జిల్లాలో పనులు పూర్తైన స్కూళ్లకు సంబంధించి.. బంట్వారం(ఎంపీపీఎస్ తొర్మామిడి), బషీరాబాద్(ఎంపీపీఎస్ మంతటి), బషీరాబాద్(ఎంపీయూపీఎస్ పర్వతపల్లి), బొంరాస్పేట్(ఎంపీపీఎస్ దీప్లానాయక్తండా), బొంరాస్పేట్(ఎంపీపీఎస్ చెట్టుపల్లితండా), చౌడాపూర్(జడ్పీహెచ్ఎస్ చౌడాపూర్), చౌడాపూర్(జడ్పీహెచ్ఎస్ కొత్తపల్లి), ధారూరు(ఎంపీపీఎస్ ధారూర్), ధారూరు(ఎంపీపీఎస్ రాజాపూర్), దోమ(ఎంపీయూపీఎస్ శివారెడ్డిపల్లి), దోమ(ఎంపీపీఎస్ మోత్కూర్), దౌల్తాబాద్(ఎంపీపీఎస్ నర్సాపూర్), దౌల్తాబాద్(ఎంపీపీఎస్ నందారం), కొడంగల్(ఎంపీపీఎస్ హస్నాబాద్), కొడంగల్(ఎంపీపీఎస్ అంగడిరాయిచూర్), కోట్పల్లి(ఎంపీపీఎస్ మల్శెట్టిపల్లితండా), కోట్పల్లి(ఎంపీపీఎస్ అన్నాసాగర్), కులకచర్ల(ఎంపీపీఎస్ సాల్విడ్), కులకచర్ల(ఎంపీపీఎస్ ముజాహిద్పూర్), మర్పల్లి(ఎంపీపీఎస్ బుచాన్పల్లి), మర్పల్లి(ఎంపీపీఎస్ సిరిపురం), మోమిన్పేట్(ఎంపీయూపీఎస్ అమ్రాదికుర్దు), మోమిన్పేట్(ఎంపీపీఎస్ చంద్రాయన్పల్లి), నవాబుపేట్(ఎంపీపీఎస్ మాదారం), నవాబుపేట్(ఎంపీపీఎస్ నవాబుపేట్), పరిగి(ఎంపీయూపీఎస్ కడ్లాపూర్), పరిగి(ఎంపీయూపీఎస్ మిట్టకోడూర్), పెద్దేముల్(ఎంపీపీఎస్ కందనెల్లి), పెద్దేముల్(ఎంపీపీఎస్ మంబాపూర్), పూడూరు(ఎంపీపీఎస్ మన్నెగూడ), పూడూరు(ఎంపీపీఎస్ మేడిపల్లికలాన్), తాండూరు(ఎంపీపీఎస్ ఎస్సీ కాలనీ), తాండూరు(ఎంపీపీఎస్ గౌతాపూర్), వికారాబాద్(ఎంపీపీఎస్ పుల్మామిడి(ఉర్దూ మీడియం), వికారాబాద్(ఎంపీపీఎస్ పుల్మామిడి), యాలాల(ఎంపీపీఎస్ రాస్నం), యాలాల(ఎంపీపీఎస్ దేవనూరు) స్కూళ్లలో పనులు పూర్తయ్యాయి.