సిటీబ్యూరో, జూలై 29 (నమస్తే తెలంగాణ): ఢిల్లీలో కార్లు దొంగిలించి వాటికి నకిలీ పత్రాలు తయారు చేసి హైదరాబాద్లో అమాయకులకు విక్రయిస్తున్న ముఠాను శంషాబాద్ ఎస్ఓటీ, రాజేంద్రనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా నుంచి రూ.2.3 కోట్ల విలువైన 15 కార్లను స్వాధీనం చేసుకున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర శుక్రవారం విలేరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. రాజేంద్రనగర్, అత్తాపూర్కు చెందిన మహ్మద్ అజార్ జావెద్ అలియాస్ మాము ఇంటర్ పూర్తి చేసి, 2016లో ఖాతర్కు వెళ్లాడు. అక్కడ తన సోదరి వద్ద ఉంటూ సూపర్మార్కెట్, రెస్టారెంట్లలో పనిచేసి 2020లో తిరిగి హైదరాబాద్కు వచ్చి ఉద్యోగాల కోసం ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే ఓఎల్ఎక్స్లో తక్కువ ధరకు కారు అమ్ముతున్న ఓ ప్రకటన చూసి, అందులో ఉన్న నంబర్కు ఫోన్ చేశాడు. కారు విక్రయ ప్రకటన పెట్టిన ఢిల్లీకి చెందిన గులాం నబీ, అజార్తో మాట్లాడాడు. ఢిల్లీలో వారి నుంచి ఇన్నోవా కారును రూ.4లక్షలకు కొనుగోలు చేసి నగరానికి తెచ్చి రూ.6.7 లక్షలకు విక్రయించడంతో మంచి లాభాలొచ్చాయి. దీంతో కొన్ని రోజుల పాటు అజార్ కార్ల కోసం గులాంనబీకి ఫోన్ చేస్తూ తక్కువ ధరకు కొనుగోలు చేసి హైదరాబాద్కు తెచ్చి విక్రయిస్తున్నాడు.
ఫార్చునర్ కొన్నంక తెలిసింది..
ఇంతలో గులాంనబీ ఓ ఫార్చునర్ వాహనాన్ని రూ.2 లక్షలకు అజార్కు విక్రయించి, ఎన్ఓసీ వచ్చిన తరువాత మిగతా డబ్బు ఇవ్వాలనే షరతు పెట్టుకున్నాడు. దానికి ఎన్ఓసీ రాకపోవడంతో అజార్, గులాంను నిలదీశాడు. దీంతో తాను కార్లు దొంగిలించి, నకిలీ పత్రాలు తయారుచేసి విక్రయిస్తున్నట్లు అజార్కు చెప్పాడు. అయితే ఎన్ఓసీ లేకుండానే ఫార్చునర్ కారును గులాం, ముంబయిలో ఉండే తన స్నేహితుడి ద్వారా పంజాబ్లో ఎక్కువ ధరకు విక్రయించాడు.
పోలీసుల తనిఖీలో వెలుగులోకి..
ఈ క్రమంలోనే నాలుగు నెలల కిందట అజార్, తన స్నేహితుడు ముజాహిద్ ఢిల్లీకి వెళ్లి బ్రీజా, బెలోన కార్లను తీసుకొని నాగపూర్ మీదుగా హైదరాబాద్కు వస్తున్నారు. నాగపూర్లో పోలీసులు తనిఖీలు చేస్తుండటంతో ఇద్దరు కార్లు వదిలి పరారుకాగా, అందులో ముజాహిద్ను నాగపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదిలాఉండగా సైబరాబాద్ పోలీసులకు ఈ ముఠా దందాపై సమాచారం రావడంతో అజార్, జహీర్, అమన్ఖాన్లను అరెస్ట్ చేశారు. ఢిల్లీకి చెందిన గులాంనబీ కోసం గాలిస్తున్నారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న కార్లలో రెండు ఇన్నోవా క్రిస్టా, నాలుగు హుందాయి క్రిట, ఏడు బెలోన, రెండు బ్రీజా కార్లు ఉన్నాయి. కార్ల దొంగతనాలపై ఢిల్లీలో 16 కేసులు నమోదయ్యాయి. సమావేశంలో శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్రెడ్డి, ఎస్ఓటీ డీసీపీ నారాయణ, రాజేంద్రనగర్ ఏసీపీ గంగాధర్ తదితరులు ఉన్నారు. కేసు ఛేదించిన ఎస్ఓటీ బృందాలను సీపీ అభినందిస్తూ రివార్డులు అందజేశారు.