పెద్దఅంబర్పేట, మార్చి 15 : కంటికి రెప్పలా చూసుకుంటానని ఏడడుగులు నడిచిన భర్తే కాల యముడిగా మారాడు. కొడుకు పుట్టాడన్న సంతోషాన్ని ఇంకా ఆస్వాదించకముందే ఊపిరి తీశాడు. బాలింత అనే కనికరం లేకుండా గొడ్డలి వేటుకు బలిచ్చాడు. నెలన్నర వయసున్న కన్న కొడుకును సైతం సంపులో పడేసి చంపేశాడు. ఓ తండ్రి కిరాతకానికి భార్యా, పసికందు ప్రాణాలు కోల్పోగా.. ఓ రెండేండ్ల ఆడ బిడ్డ అనాథగా మారింది. ఈ దారుణ ఘటన అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని అనాజ్పూర్ గ్రామంలో బుధవారం జరిగింది. అబ్దుల్లాపూర్మెట్ సీఐ వాసం స్వామి, స్థానికుల కథనం ప్రకారం.. బండరావిరాల గ్రామానికి చెందిన లావణ్య(28)కు అనాజ్పూర్ గ్రామానికి చెందిన ఏర్పుల ధన్రాజ్తో ఐదేండ్ల కిందట వివాహం జరిగింది. వీరికి రెండేండ్ల కూతురు ఆద్య, నెలన్నర వయసు కుమారుడు క్రియాన్స్ ఉన్నారు. లావణ్య బాలింత కావడంతో ఇద్దరు పిల్లలతో కలిసి పుట్టిల్లు బండరావిరాలలోని తల్లి దగ్గర ఉంటున్నది.
బాబుకు వ్యాక్సిన్ ఇప్పించాల్సి ఉన్నదని బుధవారం మధ్యాహ్నం లావణ్యతోపాటు ఇద్దరు పిల్లలను ధన్రాజ్ బండరావిరాల నుంచి అనాజ్పూర్లోని ఇంటికి తీసుకొచ్చాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే లావణ్యతో గొడవపడ్డాడు. బీరు సీసాతో కొట్టి గొడ్డలితో నరికి చంపేశాడు. నెలన్నర పసికందును ఇంటి ఆవరణలోని నీటి సంపులో పడేసి హతమార్చాడు. కూతురు ఆద్య ఏడుస్తూ బయటకు పరుగులు తీయడంతో ప్రాణాలు దక్కించుకున్నట్టు స్థానికులు తెలిపారు. ఆపై ధన్రాజ్ బండిపై పరారయ్యాడు. స్థానికుల సమాచారంతో అబ్దుల్లాపూర్మెట్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. పెండ్లి సమయంలో కట్నకానుకలు ఇచ్చామని, మళ్లీ వరకట్నం కోసం తన కూతురును ధన్రాజ్ వేధించాడని లావణ్య తల్లిదండ్రులు తెలిపారు. ఈ విషయంలో చాలాసార్లు అల్లుడిని సముదాయించి, నచ్చచెప్పినా మారలేదని చెప్పారు. వరకట్నం కోసమే హత్య చేశాడని లావణ్య తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ స్వామి తెలిపారు. నిందితుడి కోసం గాలిస్తున్నట్టు చెప్పారు.
అనాథగా మారిన ఆద్య
ఓ కిరాతక తండ్రి అనాలోచిత చర్యకు ఓ రెండేండ్ల ఆడబిడ్డ అనాథగా మారింది. రక్తపు మడుగులో విగతజీవిగా పడిఉన్న తల్లిని, కదలకుండా పడి ఉన్న తమ్ముడిని అమాయకంగా చూస్తూ ఉండిపోయింది. ఏడిస్తే ఊకోబెట్టి తల్లి ఇక కనిపించదని, కలిసి ఆడుకునే తమ్ముడు ఇక ఎప్పటికీ ఉండడనే విషయాన్ని అర్థం చేసుకోలేని ఆ పసి హృదయం కదలకుండా నిమ్మకుండిపోయింది. లావణ్య దంపతులు బాగానే ఉండేవారని స్థానికులు చెబుతున్నారు. మరి హత్య ఎందుకు చేయాల్సి వచ్చిందనే కోణంలోనూ పోలీసులు ఆరా తీస్తున్నారు. కుటుంబ సమస్యలు ఏమైనా ఉన్నాయా? మనస్పర్థలు ఏమైనా కారణమా అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.