మొయినాబాద్, జనవరి 5 : ప్రతి ఏటా సంక్రాంతి పండుగకు ముందు ఆదివారం చిలుకూరు భ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. నాలుగు రోజులు ఉత్సవాలు జరుగనున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ కమిటీ ఏర్పాట్లను పూర్తి చేసింది. శనివారం స్వామి వారికి సాయంత్రం 6 గంటలకు గంగస్నానం, అభిషేకం, ఆదివారం ఉదయం 9 గంటలకు ధ్వజారోహణం, మల్లికార్జునస్వామికి అభిషేకం, 10 గంటలకు ఎల్లమ్మ లగ్నం, మధ్యాహ్నం ఎల్లమ్మ బోనాలు, మల్లికార్జున స్వామి కల్యాణ మహోత్సవం మధ్యాహ్నం 1.30 గంటలకు కనుల పండువగా నిర్వహించడానికి ఆలయ కమిటీ ఏర్పాట్లు చేసింది.
సాయంత్రం 4 గంటలకు భక్తులు బోనాలను సమర్పించనున్నారు. ఆలయం ముందు భాగంలో ఏర్పాటు చేసిన అగ్ని గుండాలను సాయంత్రం 5.30 గంటలకు శివసత్తులు, పోతురాజులతో తొక్కిస్తారు. సాయంత్రం 5.30 గంటలకు ఒగ్గువారు ఉక్కు గొలుసు తెంపుట కార్యక్రమం నిర్వహిస్తారు. రాత్రి ఒగ్గు కథలు, సోమవారం సాయంత్రం 3 గంటలకు ఆలయం ముందు భాగంలో పసుపు, కుంకుమ, రంగులతో వేసే సదరు పటంను తొక్కె కార్యక్రమం, సాయంత్రం 5 గంటలకు చిలుకూరు గ్రామంలో హనుమాన్ దేవాలయం నంచి చిలుకూరు గ్రామంలో స్వామి వారి ఉత్సవ విగ్రహాలతో ఊరేగింపు కార్యక్రమం, మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు నల్లపోచమ్మ బోనాలు అమ్మవారికి సమర్పించనున్నారు.
బ్రహ్మోత్సవాలకు జిల్లాతో పాటు హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించనున్నారు. నాలుగు రోజుల పాటు నిర్వహించే బ్రహ్మోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకోవాలని, అందరూ సహకరించి విజయవంతం చేయాలని ఆలయ కమిటీ చైర్మన్ సంగరి మల్లేశ్ కోరారు.