మొయినాబాద్ : చిలుకూరు సురంగటి భ్రమరాంబ మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రధాన ఘటమైన స్వామి వారి కల్యాణ మహోత్సవం ఆదివారం భ్రమరాంబ మల్లిఖార్జునస్వామి కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. ప్రతి ఏడాది స్వామి వారి గర్భగుడి ముందు ఆలయంలో నిర్వహించే వారు. కల్యాణ వేధికపై స్వామివారి కల్యాణమహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్చరణలు.. భక్తజన సందోహం మద్య సంప్రదాయబద్దంగా కల్యాణోత్సవం నిర్వహించారు. కన్నుల పండువగా కల్యాణ మహోత్సవం నిర్వహించడంతో మండలంలోని వివిధ గ్రామాలతో పాటు జిల్లా నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చి స్వామి వారి కల్యాణాన్ని వీక్షించారు.
ఆలయ కమిటీ చైర్మన్ సంగరి మల్లేష్, గ్రామ పెద్దల చేతుల మీదుగా కల్యాణోత్సవం నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున బోనాలను స్వామివారికి సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాల మధ్య బోనాల ఊరేగింపు నిర్వహించారు. మల్లన్నకు బోనాలు చేసి ఆలయం చుట్టు ప్రదర్షిస్తూ ఊరేగించారు. చిలుకూరు గ్రామంతో పాటు వివిధ గ్రామాల ప్రజలు బోనాలు చేసి స్వామివారికి సమర్పించారు. ఆలయం ముందు భాగంలో ఏర్పాటు చేసిన అగ్నిగుండాలను శివసత్తులు పూనకాలతో తొక్కారు. హైదరాబాద్తో పాటు జిల్లాలోని వివిధ మండలాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.
భక్తులతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండ నిర్వాహకులు అన్ని విధాలుగా ఏర్పాట్లు చేశారు. మొయినాబాద్ ఇన్స్పెక్టర్ రాజు సమక్షంలో పోలీసులు గట్టిబందోబస్తు నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. బ్రహ్మోత్సవాల్లో స్థానిక సర్పంచ్ గునుగుర్తి స్వరూప, ఉపసర్పంచ్ సుధాకర్రెడ్డి, ఎంపీపీ గునుగుర్తి నక్షత్రం, జడ్పీటీసీ కాలె శ్రీకాంత్, మాజీ జడ్పీటీసీ కోంపల్లి అనంతరెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ సంగరి మల్లేష్, సర్పంచ్ల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మంజుల, టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు జయంత్ స్వామి వారిని దర్శించుకున్నారు.