కడ్తాల్, నవంబర్ 23 : పంటల సాగులో రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించాలని, జీవన ఎరువులతో అధిక దిగుబడులు పొందాలని వ్యవసాయశాఖ సహాయ సంచాలకులు సుజాత అన్నారు. వ్యవసాయ క్షేత దినోత్సవంలో భాగంగా బుధవారం మండల పరిధిలోని కర్కల్పహాడ్ గ్రామంలో పచ్చిరొట్ట, భాస్వరాన్ని కరిగించే జీవన ఎరువుతో సాగు చేసిన వరి పంటను ఏవో శ్రీలతతో కలిసి ఆమె పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పంటల సాగులో అధిక మోతాదులో రసాయన ఎరువులు వాడకంతో భూమి స్వభావం మారుతుందని తెలిపారు. పొలాల్లో పచ్చిరొట్ట, జనుము చల్లడంతో పంట పూత దశలో దున్నిన్నైట్లెతే వరిలో నత్రజని ఎరువును వాడకాన్ని తగ్గించుకోవచ్చన్నారు. కార్యక్రమంలో ఏవో శ్రీలత, ఏఈవోలు రమణ, స్వాతి, రైతులు సర్వేశ్వర్, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.
సాగులో మెళకువలు పాటించాలి
ఆమనగల్లు: రైతులు పంటల సాగులో తగిన మెళకువలు పాటించి అధిక దిగుబడులు పొందాలని మహేశ్వరం ఏడీఏ సుజాత తెలిపారు. కోనాపూర్ గ్రామంలో ఏవో అరుణ కుమారితో కలిసి క్షేత్ర ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భాస్వరాన్ని కరిగించే జీవన ఎరువును ఉపయోగించి లాభాలు పొందాలని తెలిపారు. రైతులు చీడ పీడల నివారణలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూ చించారు. పంటల సాగులో వ్యవసాయ అధికారుల సూచనలు, సలహాలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ మల్లమ్మ, ఎంపీటీసీ సరిత, ఏఈవో నిఖిత, రైతులు గుండమోని నర్సింహ్మ, ఈదయ్య, యాదయ్య, పంతూనాయక్ పాల్గొన్నారు.