తాండూరు, ఏప్రిల్ 18 : ఒకప్పుడు కరువు కోరల్లో చిక్కుకుని అల్లాడిన ప్రాంతం.. నేడు పలు రాష్ర్టాల నుంచి వలసవచ్చేవారికి బతుకుదెరువు చూపుతున్నది. నాడు పొట్ట చేత పట్టుకుని వలసలు వెళ్లిన ఈ ప్రాంతవాసులు.. నేడు వలస వచ్చేవారి కడుపులు నింపుతున్నారు. నాడు దండుగన్న వ్యవసాయం.. నేడు పండుగలా మారింది.. తెలంగాణ రాష్ట్రమొచ్చాక తాండూరు నియోజకవర్గానికి మహర్దశ వచ్చింది. గడిచిన తొమ్మిదేండ్లలో అన్ని రంగాల్లో ప్రగతిని సాధించింది. ప్రాజెక్టులు, చెక్డ్యాంలు, ‘మిషన్ కాకతీయ’తో చెరువుల పునరుద్ధరణతో సాగునీటికి కొదువలేకుండా పోయింది. నాడు బీడువారిన భూముల్లో సైతం బంగారు పంటలు పండుతున్నాయి. దీనికితోడు పరిశ్రమల ఏర్పాటుతో చేతినిండా పని దొరుకుతున్నది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, గుజరాత్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, హర్యానా, పంజాబ్తోపాటు పలు రాష్ర్టాలకు చెందినవారు కుటుంబాలతో సహా తాండూరు నియోజకవర్గానికి వలస వస్తుండడం విశేషం. పరిశ్రమల్లో ఉపాధి పొందడంతో పాటు వ్యవసాయ పనులు చేస్తూ సంతోషంగా బతుకుతున్నారు. నెలకు రూ.25 నుంచి రూ.30 వేల వరకు సంపాదిస్తున్నామని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
దశాబ్దాల పాటు కరువుతో ఆకలికి అల్లాడిన తెలంగాణ ప్రాంతం.. ఇప్పుడు దేశం నలుమూలల నుంచి పొట్ట చేత పట్టుకుని వలస వచ్చిన వారి కడుపు నింపుతున్నది. ఆప్యాయంగా ఆలింగనం చేసుకొని సొంత ఊరిని మరిపిస్తున్నది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, గుజరాత్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, హర్యానా, పంజాబ్ ఇలా దేశంలోని పలు రాష్ర్టాలకు చెందిన అనేక మంది కుటుంబాలతో కలిసి వలసొచ్చి తాండూరు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లోని పరిశ్ర మలు, పొలాల్లో వ్యవసాయ పనులు చేసుకుంటూ సంతోషంగా బతుకుతున్నారు. తొమ్మిదేండ్లలో సీఎం కేసీఆర్ ప్ర భుత్వం తీసుకుంటున్న చర్యలతో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందున్నది. ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయి. వికారాబాద్ జిల్లాలో నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణంతో బంజరు భూముల్లోనూ మంచి పంటలు పండుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలన లో వ్యవసాయం దండుగా అనుకున్న ప్రజలు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో సీఎం కేసీఆర్ రైతు సంక్షేమానికి పలు పథకాలను అమలు చేస్తుండటంతో పంటలను సాగు చేసుకుంటూ ఆనందంగా జీవిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పథకం ద్వారా ఎకరానికి రూ.5 వేల చొప్పున రెండు సీజన్లకు కలిపి రూ.10 వేల పంట పెట్టుబడి సాయాన్ని అన్నదాతకు సకాలంలో అందిస్తున్నది. దీంతో రైతులు విత్తనాలు, ఎరువులను కొనుగోలు చేసి పంటలను సాగు చేసుకుంటున్నారు. విత్తనాలు వేసేప్పటి నుంచి మార్కెట్కు తరలించే వరకు కూలీలకు ఏడాదంతా చేతి నిండా దొరుకుతున్నది.
ఐదేండ్ల నుంచి పెరిగిన వలసలు..
నియోజకవర్గంతోపాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, హర్యా నా, పం జాబ్ తదితర రాష్ర్టాల నుంచి వలసొచ్చిన కూలీలు ఎక్కువగా బతుకుతు న్నారు. వ్యవసాయ పను ల్లో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ర్టాలకు చెందిన కూలీ లు పనుల్లో నిమగ్నమవుతుండగా.. నాపరాతి గనులు, పాలిషింగ్ యూ నిట్లు, హోటళ్లు, రెస్టారెం ట్లు, ఆనకట్టలు, భవన నిర్మాణాలు, ఇటుక బట్టీల్లో వివిధ రాష్ర్టాలకు చెందిన కార్మికులు పనిచేస్తున్నారు. వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యే వారు పంటల సమయంలో ఇక్కడికొచ్చి ఆరు నెలలపాటు ఉండి తిరిగి తమ ప్రాంతాలకు వెళ్తుండగా.. ఇతర పనులు చేసేవారు ఏడాదంతా ఇక్కడే ఉంటున్నారు. ఒక్కో కూలీ రోజుకు రూ. 600 నుంచి రూ.900 వరకు సంపాదిస్తున్నాడు. పక్కాగా నెలకు రూ.25 నుంచి రూ.30 వేల వరకు సంపాదన ఉంటుందని కార్మికులు పేర్కొంటున్నారు. ఐదేండ్ల నుంచి జిల్లాకు వలసలు బాగా పెరిగాయి. రైతులు, వ్యాపారులు ఇతర రాష్ర్టాలకెళ్లి అడ్వాన్సులు ఇచ్చి కూలీలను రప్పిస్తున్నారు. దేశంలోని ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన ప్రజలకు చేతినిండా పని లభిస్తుండటంతో సంతోషంగా బతుకు తున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు వలస వెళ్లే ప్రాంతానికే ఇప్పుడు ఇతర రాష్ర్టాలకు చెందిన కూలీలు వలసలు వస్తున్నారు.
స్థానిక కూలీలు రైతులుగా…
తెలంగాణ రాక ముందు ఎకరం, రెండు ఎకరాల్లో పంట వేసినా గిట్టుబాటు వచ్చేది కాదు.. నీటికి, విద్యుత్ సరఫరాకు ఇబ్బంది అయ్యేది. పెట్టుబడికి ఆర్థిక ఇబ్బందులుండటంతో చిన్న కమతాల రైతులు కూలీ పనులకు వెళ్లేవారు. స్వరాష్ట్రం సిద్ధించాక సీఎం కేసీఆర్ సారథ్యంలో సాగునీటి సమస్య, విద్యుత్ కోతల ఇబ్బందులు తొలగిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడాలేని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తుండటంతో ప్రజలు మెరుగైన జీవనాన్ని గడుపుతున్నారు. ముఖ్యంగా సన్నకారు రైతులకు ఎంతో మేలు జరుగుతున్నది. తమకున్న కొద్దిపాటి భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. కూలీకి పోయే అవసరం తప్పింది. సొంత భూమిలో పని చేసుకుంటున్నామన్న తృప్తి దొరికింది. తెలంగాణలో 24 గంటల విద్యుత్ సరఫరా, మండు వేసవిలోనూ పొలాల్లో పారుతున్న నీళ్లు, రైతులకు పెట్టుబడి సాయం, ప్రమాదవశాత్తు రైతు మరణిస్తే రూ. 5 లక్షల బీమా, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథతో పుష్కలంగా నీరు, ఆడపడుచుల వివాహాల కో సం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు, గర్భిణు లు, బాలింతల కోసం అమ్మఒడి, కేసీఆర్ కిట్, బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి ఆసరా పింఛన్లు, గొర్రెల పం పిణీ, చేనేత లక్ష్మి, నేతన్న బీమా, దళితబంధు ఇలా సీఎం కేసీఆర్ అమలు చేస్తు న్న పథకాలతో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో అగ్రగామిగా నిలిచింది.
స్వగ్రామంలోనే వ్యవసాయం చేసుకుంటున్నా..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సరైన వసతుల్లేక..పంటలు పండకపోవడంతో ఖతర్ దేశానికి వలస వెళ్లా. సీఎం కేసీఆర్ పోరాటంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక్కడ 24 గంటల విద్యుత్ సరఫరా, సాగునీరు, సకాలంలో పెట్టుబడి సాయం అందుతుండటంతో వ్యవసాయం చేసుకుంటూ సంతోషంగా కుటుంబంతో కలిసి జీవిస్తున్నా. పెట్టుబడి సాయంతో అవసరమైన ఎరువులు, విత్తనాలను కొంటు న్నా. దీంతో ఆర్థిక ఇబ్బందులు తప్పాయి. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సం క్షేమ పథకాలు చాలా బాగున్నాయి. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు.
–కుర్వ శ్రీశైలం, ఖాంజాపూర్, తాండూరు
మూడేండ్ల నుంచి వస్తున్నా..
నాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మంత్రాలయం. మా దగ్గర పనులు దొరక్కపోవడంతో గత మూడేండ్ల నుంచి తాండూరుకు కూలీ పనుల కోసం కుటుంబంతో కలిసి వస్తున్నా. పత్తి, మిరప సీజన్లో వచ్చి 6 నుంచి 8 నెలల వరకు ఇక్కడే ఉంటా. ప్రతిరోజూ రూ. 600 నుంచి రూ.800 వరకు సం పాదిస్తా. నా కుటుంబంతోపాటు మా ఊరి నుంచి ఇంకా 33 మంది కు టుంబాలతో కలిసి వచ్చారు. పొలాల నిర్వాహకులే అన్ని వసతులను కల్పిస్తారు. వ్యవసాయ పనులు చివరి దశకు చేరాయి. ఇప్పుడు మా ఊరికెళ్లి మళ్లీ సీజన్లో వస్తాం. వచ్చిన డబ్బులతో ఇంటి అవసరాలతోపాటు చేసిన అప్పులను తీర్చుతాం.
–హనుమంతమ్మ, మంత్రాలయం, ఆంధ్రప్రదేశ్
పనికి తగిన వేతనం వస్తున్నది..
కొన్ని నెలల క్రితం తాండూరుకు వచ్చా. హార్డ్వేర్ షాపులో స్నేహితులతో కలిసి పనిచేస్తూ జీవిస్తున్నా. మా రాష్ట్రంలో సరైన ఉపాధి లేదు. చదువుకోని కూడా నిరుద్యోగులుగా ఉండాల్సి వస్తున్నది. తెలిసిన వారు, స్నేహితులు ఇక్కడ ఉండటంతో తాండూరుకు వచ్చా. ఇక్కడ చాలా బాగున్నది. పనికి తగిన వేతనం వస్తున్నది. ఇక్కడి ప్రజలు మంచిగా ఆదరిస్తున్నారు.
–విశాల్, జైపూర్, రాజస్థాన్
చదువుకుంటూనే కూలీ పనికి వెళ్తున్నా.
తెలంగాణలో పనులకు ఇబ్బందిలేదు. ప్రతి ఏడాది పంటల సీజన్లో తాండూరుకు వస్తా. పత్తి, మిరప, వరి పనులు పూర్తయ్యేదాకా ఇక్కడే ఉంటా. మా ఊరిలో పనుల్లేక చాలా ఇబ్బందిగా ఉంది. నేను డిగ్రీ చదువుకుంటూనే కూలీ పనులు చేస్తున్నా. రోజుకు రూ.800 చొప్పున నెలకు దాదాపుగా రూ.25 వేల వరకు సంపాదిస్తున్నా. దీంతో మా కుటుంబ సంతోషంగా ఉన్నది. పొదుపు చేసిన డబ్బులతో ఉన్నత చదువులు చదువుతా.
–నాగరాజు, మంత్రాలయం, ఆంధ్రప్రదేశ్