రంగారెడ్డి, మే 26 (నమస్తే తెలంగాణ) : లోక్సభ ఎన్నికల ఫలితాల వెల్లడికి ఇంకా తొమ్మిది రోజులు మాత్రమే ఉన్నది. బరిలో ఉన్న అభ్యర్థులు, రాజకీయ పార్టీల నాయకులు రిజల్ట్ కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.ఈ నేపథ్యంలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించి పక్కాగా ఫలితాన్ని వెల్లడించేందుకు అధికారయంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నది. చేవెళ్ల లోక్సభ ఓట్ల లెక్కింపును చేవెళ్లలో చేపట్టనుండగా.. కౌంటింగ్కు సంబంధించిన అన్ని ప్రక్రియలను అధికారులు చురుగ్గా పూర్తి చేస్తున్నా రు. కౌంటింగ్ సిబ్బంది నియామకం..శిక్షణా కార్యక్రమాలను ముమ్మరం చేశారు.
చేవెళ్ల లోక్సభ బరిలో 43 మంది అభ్యర్థులు ఉండడంతో ప్రతి పోలింగ్ కేంద్రంలో నూ మూడు ఈవీఎంలను ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో 56.40% పోలింగ్ నమో దైంది. మొత్తం 29,38,370 మంది ఓటర్లకుగాను 16,57,107 మంది ఓటేశారు. ఓట్ల కౌంటింగ్ కోసం 164 టేబుళ్లను ఏర్పాటు చేస్తున్నారు. అత్యధిక పోలింగ్ కేంద్రాలు ఉన్న మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి సెగ్మెంట్ల ఓట్ల లెక్కింపు కోసం 28 చొప్పున టేబుళ్లను ఏర్పాటు చేస్తుండగా..మిగతా నాలుగు నియోజకవర్గా ల్లో 14 చొప్పున టేబుళ్లను ఏర్పాటు చేస్తున్నారు.
పోస్టల్ బ్యాలెట్ లెక్కింపునకు 24 టేబుళ్లను ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి టేబుల్ వద్ద ఓ సూపర్వైజర్, ఇద్దరు సహాయకులు, సూక్ష్మ పరిశీలకుడు ఉంటారు. ఈ లెక్కన చేవెళ్ల లోక్సభ ఓట్ల లెక్కిం పు కోసం 777 మంది ఎన్నికల సిబ్బందిని వినియోగిస్తున్నారు. ఇందులో కౌంటింగ్ సూపర్వైజర్లు 227 మంది, కౌంటింగ్ అసిస్టెంట్లు 273 మంది, మైక్రో అబ్జర్వర్లు 277 మంది ఉన్నారు. సిబ్బంది విధుల కేటాయింపునకు సంబంధించి మొదటి విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను సైతం అధికారులు పూర్తి చేశారు. వీరికి మాస్టర్ ట్రైనర్స్తో శిక్షణా తరగతులను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రౌండ్ల వారీగా ఓట్ల వివరాలను పక్కాగా వెల్లడించేందుకు అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు.
చేవెళ్ల లోక్సభ పార్లమెంట్ పరిధిలోని చేవెళ్ల, మహేశ్వరం, శేరిలింగంపల్లి, రాజేంద్ర నగర్, వికారాబాద్, పరిగి, తాండూరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 2,877 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈనెల 13న పోలింగ్ ముగిసిన వెంటనే అధికారులు పటిష్ట భద్రత మధ్య ఈవీఎంలు, వీవీ ప్యాట్లను డిస్ట్రిబ్యూటరీ సెం టర్లకు.. అక్కడి నుంచి చేవెళ్ల మండలం గొల్లపల్లి గ్రామంలోని బండారి శ్రీనివాస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలోని స్ట్రాంగ్ రూంలకు తరలించారు.
ప్రస్తుతం మూడంచెల భద్రతను కొనసాగుతుండగా..కౌంటింగ్ రోజున కౌంటింగ్ కేంద్రం చుట్టూ పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేయనున్నారు. ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన పోలీసు సిబ్బందితోపాటు వివిధ కంపెనీల పారామిలిటరీ బలగాలను సైతం భద్రత కోసం వినియోగించనున్నారు. కౌంటింగ్ రోజున కేంద్రంలోకి ఫోన్లకు అనుమతి లేదు. ఓట్ల లెక్కింపులో పాల్గొనే సిబ్బంది, అభ్యర్థులు, ఏజెంట్లకు ప్రత్యేక గుర్తింపు కార్డులను అందజేయనున్నారు. గుర్తింపు కార్డు ఉన్నవారిని మాత్రమే కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతించనున్నారు.