పరిగి, మార్చి 10: పట్టణంలో బారు, మద్యం దుకాణాల పక్కనే సిట్టింగ్లకు అవకాశాలు ఉన్న ప్పటికీ కొత్త వెంచర్లు మందుబాబుల అడ్డాగా మారాయి. తద్వారా ఆ పక్కనే నివాస ముంటున్న కాలనీల వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సాయంత్రం అయిందంటే చాలు మందుబాబులు మోటర్సైకిళ్లు, కార్లలో వచ్చి కొత్త వెంచర్లలో పార్టీలు చేసుకోవడం, రచ్చరచ్చ చేయడం నిత్యం కొనసాగుతున్నది. పరిగి పట్టణంలోని శివారు కాలనీలలో ఇది నిత్యకృత్యంగా మారిందని, పోలీసులకు చెప్పినా పెద్దగా ఉపయోగం లేకుండాపోయిందని పలువురు వాపో తున్నారు.
పరిగి పట్టణ శివార్లలో ఉండే తిరుమల, మైత్రి, భవానీ నగర్లతో పాటు కొత్తగా ఏర్ప డుతున్న గంగాసదన్ వెంచర్లలో మందుబాబుల ఆగడాలు కొనసాగుతున్నాయి. సాయంత్రం ఆరు గంటలు దాటితేచాలు కొంతమంది మద్యం ప్రియులు బీరు బాటిల్స్ ఈ ప్రాంతాలకు తీసుకువచ్చి పార్టీలు జరుపుకొంటున్నారు. గతంలో అడపాదడపా జరిగే ఈ మందుపార్టీలు ఇటీవల మరింత పెరిగాయి. రోజు ఇదే తంతు కొనసాగుతుండడంతో మందుబాబుల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆయా కాలనీల వాసులు పేర్కొంటున్నారు.
కనీసం నాలుగైదు మంది ఉండే ఈ మందు పార్టీల వారు గుంపుగుంపులుగా చీకటిలో, సెల్ఫోన్ వెళుతురులో ఎలాంటి అడ్డంకులు లేకుండా పీకలదాకా మద్యం సేవించి నానా హంగామా సృష్టిస్తున్నారు. ఇదేమిటని ఎవరు ప్రశ్నించే పరిస్థితి ఉండదని ఆయా కాలనీలవారు పేర్కొన్నారు.
పట్టణ శివారులో నివాసముండే వారు ఉదయం, సాయంత్రం సమయాల్లో పక్కనే గల కొత్త వెంచర్లలో వాకింగ్కు వెళ్తుండగా ఉదయం సమయంలో ఖాళీ బీరు సీసాలు, పగిలిన సీసాల గాజుపెంకులు, తిని పడేసిన విస్తరాకులు దర్శనమిస్తుండగా సాయంత్రం సమయంలో అటువైపు వాకింగ్కు వెళ్లడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొంటున్నారు. పట్టణ శివారులో, పక్కనే గల పంటపొలాలతో చక్కటి వాతావరణం ఉంటుందని తాము ఇండ్లు నిర్మించుకొని నివసిస్తున్నామని, మంచి వాతావరణంలో ఇలాంటి మందుబాబుల ఆగడాలతో తమకు ఇబ్బం దులు తలెత్తుతున్నాయని తెలిపారు.
సాయంత్రం సమయంలో కుటుంబసభ్యులతో కలిసి వాకింగ్ చేసే పరిస్థితి లేదని వాపోతున్నారు. కొత్తగా వెలుస్తున్న వెంచర్లలో బీటీ రోడ్లు వేసి చదునుగా స్థలాలు ఉండడంతో ఇదే తమకు అనుకూలమైన అడ్డాలుగా మందుబాబులు మందుపార్టీలు చేసుకుంటున్నారు. పట్టణంలో ఒక బారు, మద్యం దుకాణాల పక్కనే గల సిట్టింగ్లలో మద్యం సేవించేందుకు అవకాశం ఉన్నప్పటికీ కొత్తగా వెలుస్తున్న వెంచర్లలో మందుపార్టీలతో ఈ ప్రాంతాలలో ఉండే ప్రశాంత వాతావరణాన్ని చెడగొడుతున్నారని వాపో తున్నారు. మందు తాగడంతోపాటు బిర్యానీలు, నాన్వెజ్ తెచ్చుకొని తిని విస్తరాకులు అక్కడే పడేస్తున్నారు. ఇదే విషయమై ఇటీవల కొందరు పోలీసుల దృష్టికి తీసుకువెళ్లారు.
దీంతో గత వారం ఈ కొత్త వెంచర్లలో మందు సేవిస్తున్న వారిని పోలీసులు పట్టుకోగా అధికార పార్టీ నాయకుల ఫోన్లతో వారిని వదిలిపెట్టినట్లు తెలిసింది. పోలీసులు వారిని వదిలేసి తమకు ఏమి తెలియదన్నట్లుగా వ్యవహరించడం పట్ల తీవ్ర స్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి. మందుబాబుల ఆగడాలకు చెక్ పెట్టాల్సిన పోలీసులు ఇలా పట్టుకొని, అలా వదిలేయడం సరికాదంటున్నారు. పోలీసులే ఇలాంటి చర్యలకు పాల్పడితే తమకు ఎవరు అండగా నిలుస్తారని ఆయా కాలనీల వారు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకొని తమ ప్రాంతంలో మందుబాబుల ఆగడాలకు చెక్ పడేలా చూడాలని ఆయా కాలనీవాసులు కోరుతున్నారు. దీనిపై పరిగి ఎస్ఐ సంతోష్కుమార్ వివరణ కోరగా బహిరంగ ప్రదేశాల్లో మందు సేవించడం నిషేధమన్నారు. గస్తీ పెంచి వెంచర్లు, ఖాళీస్థలాల్లో సిట్టింగ్ వేసే మందుబాబులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.