దేవాదాయశాఖ రాష్ట్ర అడిషనల్ కమిషనర్ జ్యోతి.. నందిపర్తిలో సమీక్షా సమావేశం
కౌలు రైతులకు అన్యాయం జరుగనివ్వం
దేవాదాయ శాఖ రాష్ట్ర అడిషనల్ కమిషనర్ జ్యోతి
నందివనపర్తిలో సమీక్షా సమావేశం
యాచారం, జూలై 7 : ఓంకారేశ్వరాలయ భూముల్లో కౌలు చేసుకుంటున్న రైతులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరుగనివ్వబోమని దేవాదాయ శాఖ రాష్ట్ర అడిషనల్ కమిషనర్ జ్యోతి అన్నారు. మండలంలోని నందివనపర్తి గ్రామంలో ఓంకారేశ్వరాలయ భూములపై కౌలు రైతుల సమస్యలపై గురువారం రైతులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఆలయ భూములపై తాటిపర్తి, కుర్మిద్ద, నందివనపర్తి, నజ్దిక్సింగారం గ్రామాలకు చెందిన రైతుల అభిప్రాయాలు, ప్రజాప్రతినిధుల సూచనలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఓంకారేశ్వరుడిని ఆమె దర్శించుకున్నారు. నందివనపర్తి ఓంకారేశ్వాలయానికి చెందిన 1400 ఎకరాల భూమి హక్కు కేవలం దేవుడికే చెందుతుందన్నారు. ఈ భూమిని ఎవరు కబ్జా చేసినా సహించేది లేదన్నారు. ఆలయ భూములను మరోమారు పూర్తిస్థాయిలో సర్వే చేయించి రికార్డుల్లో భద్రపరుస్తామని ఆమె తెలిపారు. అసైన్డ్, టెనెంట్ భూములు ఉంటే సర్వే ద్వారా గుర్తిస్తామన్నారు. కౌలు రైతులు సకాలంలో కౌలు చెల్లించి ఆలయ అభివృద్ధికి సహకరించాలన్నారు. ఆలయ భూములు రైతుల పేరున పట్టా చేయడం కుదరదన్నారు. ఎన్నటికైనా ఆది దేవుడి పేరిట పట్టా ఉంటుందని ఆమె స్పష్టం చేశారు.
ఆలయ భూముల్లో వెంచర్లు, క్వారీలు ఏర్పాటు చేసినట్లు ఫిర్యాదులందితే నిర్వాహకులపై వెంటనే క్రిమినల్ కేసులను నమోదు చేస్తామన్నారు. ఆలయ భూముల పరిరక్షణ బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆమె పేర్కొన్నారు. గుంట భూమి కూడా కబ్జాకు గురికాకుండా సంరక్షించుకోవాలన్నారు. దీనికోసం ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా మేలు చేస్తున్నదని తెలిపారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ నాగరాజు, తహసీల్దార్లు గీత, సంగీత, డివిజన్ తూర్పు విభాగం పర్యవేక్షకుడు పరమేశ్, ఈవో ప్రవీణ్కుమార్, సర్పంచ్లు ఉదయశ్రీ, రమేశ్, రాజశేఖర్రెడ్డి, అరుణపాండు, బీఎన్రెడ్డి ట్రస్టు చైర్మన్ బిలకంటి చంద్రశేఖర్రెడ్డి పాల్గొన్నారు.