షాద్నగర్రూరల్, మే 4 : ప్రజా సంక్షేమ పథకాలకు, ఎమ్మెల్యే ఆంజయ్యయాదవ్ నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి పనులకు అకర్షితులై వివిధ పార్టీల నాయకుల బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. బీఆర్ఎస్ పార్టీలోకి వలసల జోరు కొనసాగుతుండటంతో ఇప్పటికే నియోజకవర్గం మొత్తం గులాబీమయంగా మారింది. షాద్నగర్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గురువారం ఫరూఖ్నగర్ మండలంలోని వివధ గ్రామాల్లో గల వివిధ పార్టీల నాయకులు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలను కప్పి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే పార్టీకి శ్రీరామరక్షగా నిలుస్తున్నాయన్నారు. గత ప్రభుత్వాల హయాంలో జరగని అభివృద్ధి కేవలం తొమ్మిది సంవత్సరాల్లో జరిగిందన్నారు. ఆర్థిక అసమానతలను తొలగించడం కోసం సర్కార్ అన్ని వర్గాల ఆర్థిక ఎదుగుదలకు ఎన్నో సంక్షేమ పథకాలను ఆమలు చేసిందన్నారు. మారుమూల గ్రామీణ ప్రాంతాలకు రోడ్డు సౌక ర్యం కల్పించడంతోపాటు ప్రతి గ్రామాన్ని పట్టణం మాదిరి తీర్చిదిద్దేలా పక్కా ప్రణాళికతో ముందుకు సాగడంతో నేడు ప్రతి పల్లె పట్టణాలను తలపిస్తున్నాయన్నారు.
ప్రతి రైతును శ్రీమంతుడిగా మార్చేలా దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతు బంధు, రైతు బీమా, సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు, ఉచిత విద్యుత్ బ్యాంకు రుణాలు ఇలా ఎన్నో పథకాలను అమలు చేసి ప్రతి రైతుకు ఆండగా నిలిచిన ఏకైక పార్టీ బీఆర్ఎస్ అని ఎమ్మెల్యే తెలిపారు. 24 గంటల విద్యుత్, ఇంటింటికీ మిషన్ భగీరథ నీరు, ప్రతి వార్డులో సీసీ రోడ్లు, వైకుంఠధామాలు, డంపింగ్ యార్డు, హరితహారం, పల్లెప్రకృతి వనాలు ఇలా ఎన్నో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టి దేశానికే తెలంగాణ దిక్సూచిలా మారిందన్నారు.
పింఛన్లు, మహిళా సంక్షేమ కోసం ప్రత్యేక నిధులు, అన్ని వర్గాల ప్రజలకు వివిధ సంక్షేమ పథకాలను అందజేసి సర్కార్ దేశంలోనే ప్రత్యేక గుర్తింపు సాధించిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి అభివృద్ధి వైపు అడుగులు వేస్తామని వివిధ పార్టీల నాయకులు బీఆర్ఎస్ పార్టీలోకి రావడం చాలా సంతోషంగా ఉందని ఎమ్మెల్యే తెలిపారు.