ఆదిబట్ల, డిసెంబర్ 2 : ఫ్రెండ్లీ పోలీస్ విధానంతో ప్రజలకు మరింత చేరువ అవ్వాలని ఎల్బీ నగర్ డీసీపీ సన్ప్రీత్ సింగ్ అన్నారు. శుక్రవారం వార్షిక తనిఖీలో భాగంగా ఆదిబట్ల పోలీస్స్టేషన్ ను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్స్టేషన్ ఆవరణలో మొక్కలను నాటి నీరు పోశారు. అనంతరం సిబ్బంది పరేడ్ రిజిస్ట్టరును పరిశీలించారు. పోలీస్స్టేషన్లో ఉన్న రికార్డులు, వివిధ కేసులపై వస్తున్న ప్రజలను రిసెప్షన్లో ఏ విధంగా అందుబాటులో ఉంటున్నారో అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా పోలీస్స్టేషన్ పరిధిలో గతంలో కంటే క్రైం రేట్ తగ్గిందా పెరిగిందా అడిగి తెలుసుకున్నారు. పెట్రోలింగ్ వాహనాలు ఆపదలో ఉన్నవారికి సరైన సమయంలో అందుబాటులో ఉంటున్నాయా అని అడిగితెలుసుకున్నారు. పెండింగ్ కేసులపై పూర్తిస్థాయిలో విచారించారు.
పాత నేరస్తుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం డీసీపీ మాట్లాడుతూ పోలీస్స్టేషన్ పరిధిలోని ప్రతి గ్రామంలో వార్డులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఆదిబట్ల పోలీసుల పనితీరు, రికార్డుల నిర్వహణ బాగుందని కితాబిచ్చారు. పోలీస్స్టేషన్లో విధుల్లో ప్రతిభ కనబర్చిన నలుగురు సిబ్బంది సందీప్, పూజిత, అర్చన, రజిత లకు డీసీపీ నగదు రివార్డును ప్రకటించారు. త్వరలోనే వారికి రివార్డు అందజేస్తామన్నారు. కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఏసీపీ ఉమామహేశ్వర రావు, సీఐ నరేందర్, ఎస్ఐలు వై లక్ష్మీనారాయణ, లక్ష్మీనారాయణ, కృష్ణయ్య, సురేశ్, సిబ్బంది పాల్గొన్నారు.