ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 12 : ఆరుతడి పంటల్లో పల్లి పంట ప్రధానమైనది. నూనె గింజల పంటల్లో వేరుశనగకు ప్రత్యేక స్థానముంది. ప్రస్తుతం పల్లి నూనెకు ఉన్న గిరాకీ అంతా.. ఇంతా కాదు. మార్కెట్లో పల్లి నూనెకు ఉన్న గిరాకీని దృష్టిలో ఉంచుకుని రైతులు ఈ యాసంగిలో పల్లిని సాగు చేస్తే మంచి ఆదాయం పొందవచ్చునని వ్యవసాయధికారులు, వ్యవసాయ నిపుణులు అంటున్నారు. రంగారెడ్డిజిల్లాలో పల్లి సాగు చేసేందుకు అనువైన భూములున్నాయి. ఇసుకతో కలిసి ఉన్న భూములతో పాటు ఎర్రచెల్క భూములు ఎక్కువగా ఉన్నందున వరికి ప్రత్యామ్నాయంగా పల్లి మంచిదనేది నిపుణుల అభిప్రాయం. ఆరుతడి పంటలను సాగుచేయాలని ప్రభుత్వాలు సూచిస్తున్న తరుణంలో రైతులు ఈ పంటను సాగుచేసేందుకు ముందుకొస్తున్నారు. ఈ యాసంగిలో పల్లి సాగు చేసి, వరి కంటే ఎక్కువ లాభాలను పొందే అవకాశముంది.
యాసంగి సీజన్లో పల్లి సాగుకు మొదట నాణ్యమైన విత్తన రకాలను రైతులు ఎంచుకోవాలి. ఇందులో స్పానిష్ గుత్తి, వర్ణీనియా గుత్తి అనే రెండు రకాలుంటాయి. స్పానిష్ రకాల్లో కదిరి -6, కదిరి-9, అనంత, కదిరి హరితాంధ్ర, ఐసీజీవి-91114 ధరణి, టీఏజీ 24 రకాల విత్తనాలు ఉన్నాయి. వర్జీనియా రకాల్లో కదిరి-7, కదిరి-8 బోల్డ్ రకాల విత్తనాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇసుకతో కూడిన గరప నేలలు, నీరు త్వరగా ఇంకే ఎర్ర చెల్క నేలలు ఈ పంటకు అనువుగా ఉంటాయి. బంకమన్ను, నల్లరేగడి భూములు ఈ పంటకు అనుకూలంకాదు. విత్తుకనే సమయంలో ఒక చదరపు మీటరుకు 44 మొక్కలు ఉండేలా చూసుకోవాలి. విత్తనాలను 5 సెంటీమీటర్ల లోతు కంటే ఎక్కువ లోతులో వేయకూడదని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు.
పల్లి విత్తన రకాలను బట్టి దిగుబడులు వస్తాయని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. కదిరి-6 విత్తన రకంతో యాసంగిలో ఎకరాకు 12 నుంచి 14 క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. కదిరి -9 విత్తనం సాగుచేస్తే ఎకరాకు 10-12 క్వింటాళ్లు, కదిరి హరితాంధ్రతో 10-12, ధరణి ద్వారా 9-10, టీఏజీ-24 ద్వారా 8-10, జేఎల్-24 ద్వారా 10-11, ఐసీజీవీ-91114 ద్వారా 10-12, కదిరి 7, 8 ద్వారా 12-14 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు. ఇటీవల కొత్తగా వచ్చిన కదిరి లేపాక్షి – 1812 రకం విత్తనంతో ఎకరానికి 15-18 క్వింటాళ్ల దిగుబడి కూడా వస్తున్నట్లు వ్యవసాయాధికారులు చెబుతున్నారు.
పల్లి వేసే ముందు భూసార పరీక్ష చేయించుకుంటే.. అందుకనుగుణంగా ఎరువులను వాడుకోవచ్చును. దుక్కిలో 3 నుంచి 4 టన్నుల పశువుల ఎరువును వేసుకోవాలి. ఎకరానికి 100 కిలోల సూపర్ ఫాస్పేట్, 33 కిలోల పొటాష్, 18 కిలోల యూరియాను విత్తనాలు వేసే సమయంలోనే వాడాలి. 30 రోజుల తర్వాత తొలి పూత దశలో మరో 10 నుంచి 15 కిలోల యూరియా వేసుకోవాలి. ఊడలు దిగే సమయంలో ఎకరానికి 200 కిలోల జిప్సమ్కు మొక్క మొదళ్ల దగ్గర వేసి మట్టితో పూడ్చాలి.
జింక్ లోపంతో ఆకులు చిన్నవిగా మారతాయి. ఇందుకు ఎకరాకు 400 గ్రాముల జింక్ సల్ఫేట్ను 200 లీటర్ల నీటితో కలిపి వారం రోజుల్లో రెండుసార్లు పంటపై పిచికారీ చేయాలి. ధాతు లోపంతో ఆకులు పసుపు పచ్చగా, ఆ తర్వాత తెలుపు రంగుకు మారే ప్రమాదం ఉన్నందున ఎకరాకు ఒక కిలో అన్నభేది, 200 గ్రాముల సెట్రిక్ ఆమ్లం 200 లీటర్ల నీటితో కలిపి వారం వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి. కలుపు గడ్డి నివారణకు విత్తనాలు విత్తిన వెంటనే లేదా 48 గంటల్లోపు అలాక్లోర్ 50 శాతం ఈసీ 1.5 నుంచి 2 లీటర్ల మందును 200 లీటర్ల నీటితో కలిపి దుక్కిపై పిచికారీ చేయాలి.
ఒక ఎకరంలో వరి సాగు చేసే కంటే పల్లి వేస్తే ఎంతో లాభం. ఎకరం పల్లి సాగుకు సుమారు రూ.15వేలు ఖర్చవుతుంది. ఎకరానికి సగటున 10 క్వింటాళ్ల పల్లి పండుతుంది. ప్రభుత్వం క్వింటాల్ పల్లికి రూ.5500 మద్దతు ధర ఇస్తున్నప్పటికీ ప్రస్తుతం మార్కెట్లో రూ.7వేల నుంచి రూ.9వేల వరకు ధర పలుకుతున్నది. సగటున క్వింటాలు ధర రూ.6500 వచ్చినా రైతుకు ఎకరాకు రూ.65వేల ఆదాయం వస్తుంది. పెట్టుబడి పోనూ రైతుకు ఎకరాకు రూ.50వేలు మిగిలే అవకాశం ఉంది.
ఎకరం వరి పంట సాగు చేసేందుకు కనీసం రూ.20వేల పెట్టుబడి అవుతుంది. సగటున ఎకరాకు 26 క్వింటాళ్ల వడ్లు పండుతాయి. ప్రభుత్వ మద్ధతు ధర ప్రకారం క్వింటాల్కు రూ.1940 ఉంది. ఎకరం వరి సాగు చేసిన రైతుకు రూ.50 వేల ఆదాయం వస్తుంది. పెట్టుబడి రూ.20 వేలు పోనూ ఎకరాకు రైతుకు మిగిలేది సుమారు 30వేలు మాత్రమే. ఒక ఎకరం వరి సాగు చేసేందుకు వినియోగించే నీటితో మూడెకరాల పల్లి సాగు చేసుకోవచ్చు. రైతులు ఈ యాసంగిలో పల్లి సాగు చేయాలని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.
పల్లి సోకే తెగుళ్లలో ముఖ్యమైనవి వేరుపురుగు, ఆకుముడత పురుగు, పొగాకు లద్దె, శనగపచ్చ, తామర, పచ్చదీవపు, మొగ్గతొలుచు పురుగు, తాక్కా ఆకుపచ్చ తెగులు, మొదలు కుళ్లు, వేరు కుళ్లు, కాండం కుళ్లు, మొవ్వ కుళ్లు, కుంకుమ తెగులు. తెగులు లక్షణాలను ఎప్పటికప్పుడు వ్యవసాయ అధికారులకు చెబితే, తగిన సస్యరక్షణ చర్యలను వివరిస్తారు.
ఇటీవల దిగుమతి చేసుకున్న కొత్త రకం విత్తనం కదిరి లేపాక్షి-1812సాగు చేసిన రైతులకు దిగుబడులు పెరిగాయి. ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది రైతులు ఇదే విత్తన రకాన్ని వాడుతున్నారు. ఇంతకు ముందున్న విత్తన రకాలతో కూడా మంచి దిగుబడులు పొందొచ్చు. యాసంగిలో వరికంటే వేరుశనగ సాగుచేసుకోవడం ఎంతో ఉత్తమం. చివరి దశలో నీరందక వరి ఎండిపోయే ప్రమాదం ఉంటుంది. రైతులు వేరుశనగ సాగు చేసుకుని ఆదాయాన్ని పెంచుకోవాలి.
– సత్యనారాయణ, ఏడీఏ, వ్యవసాయశాఖ, ఇబ్రహీంపట్నం