రంగారెడ్డి, జూన్ 9 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో భూముల ధరలు పెరగటంతో సర్వేయర్లకు డిమాండ్ పెరిగింది. సర్వే కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చేయి తడపనిదే సర్వే చేసేందుకు రావడంలేదని పలువురు రైతులు ఆరోపిస్తున్నా రు. భూముల ధరలు పెరగడం.. స్తిరాస్తులను తమ వారసులకు పంచిచ్చే క్రమంలో పట్టాల మార్పిడికి సర్వే మ్యాప్ తప్పనిసరి.
అలాగే, భూ ముల క్రయవిక్రయాలు, మ్యుటేషన్ కోసమూ సర్వే మ్యాప్లు అవసరం కావడంతో భూములను కొలిచేందుకు సర్వేయర్లు అందుబాటులో ఉండటంలేదు. ఉన్న కొందిమందిని ప్రభుత్వం వివిధ పనులకు వినియోగిస్తుండడంతో వారి కొ రత ఏర్పడింది. జిల్లాలో ఫ్యూచర్సిటీలో భూసేకరణ, ఫార్మాసిటీ భూముల సర్వే, గ్రీన్ఫీల్డ్ రోడ్డు భూముల సర్వేతోపాటు పండ్ల మార్కెట్ వంటి పనుల భూసర్వేకు సర్వేయర్లు వారాల తరబడి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. మండలాల్లో సర్వేయర్లు అందుబాటులో ఉండకపోవటంతో రైతు లు తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ కొన్ని నెలలుగా తిరుగుతున్నారు.
27 మండలాలు.. 12 మందే..
జిల్లాలో 27 మండలాలకు 12 మంది సర్వేయర్లే ఉన్నారు. దీంతో ఒక్కో సర్వేయర్ రెండు నుంచి మూడు మండలాల అదనపు బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. భూసమస్యలు అధికంగా ఉన్న శివారుల్లోని మండలాల్లో సర్వేయర్లకు ఫుల్ డిమాండ్ ఉన్నది. సర్వేయర్లకు ఎకరానికి రూ. ఐదు నుంచి రూ. పది వేలు ముట్టజెప్పితేనే వస్తున్నారన్న ఆరోపణలున్నాయి. డబ్బులు ముట్టచెప్పకపోతే రావడంలేదని..వెళ్లిపోతున్నారని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సర్వేకోసం రెండేండ్లుగా రైతు నిరీక్షణ
ఇబ్రహీంపట్నం మండలంలోని నెర్రపల్లి గ్రా మంలో తనకున్న భూమిని సర్వే చేయాలని ఓ రైతు 22మే 2024లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నాడు. ఆ దరఖాస్తును తీసుకుని సర్వేయర్ వద్దకు సుమారు రెండేండ్లుగా తిరుగుతూ నే ఉన్నా రావడంలేదు. సర్వేయర్లు మారుతున్నారు కానీ.. ఆ రైతు భూమి మాత్రం కొలత కావడంలేదు.
జిల్లాలో 5వేలకు పైగానే..
జిల్లాలో భూముల సర్వే కోసం సుమారు 5 వే లకు పైగానే దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. భూముల సర్వేకోసం ఆన్లైన్లో రైతులు దరఖాస్తు పెట్టుకున్నారు. తమ భూములను కొలవాలంటూ సర్వేయర్ల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడంలేదని పేర్కొంటు న్నారు. సర్వేయర్ల నిర్లక్ష్యంతో గ్రామాల్లో భూతగాదాలు పెరిగిపోతున్నాయని మండిపడుతున్నారు.
అసిస్టెంట్లదే హవా..
జిల్లాలో సర్వేయర్ల కొరతతో ఒక్కో సర్వేయర్ రెండు నుంచి మూడు మండలాలకు ఇన్చార్జిగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కాగా, పని ఒత్తిడి కారణంగా పలువురు ఇన్చార్జి సర్వేయర్లు ఆయా మండలాల్లో ప్రైవేట్ సర్వేయర్లను అసిస్టెంట్లుగా నియమించుకున్నారు. వారితోనే భూములను సర్వే చేయిస్తున్నారు. దీంతో సర్వేయర్ల అసిస్టెంట్లు డబ్బులు ఎవరు ముట్టజెప్పితే వారికి అనుకూలంగా సర్వే చేస్తున్నారని రైతులు మండిపడుతున్నారు. అసిస్టెంట్లు ఇచ్చిన రిపో ర్టు ఆధారంగానే సర్వేయర్లు పంచనామా రాసి సంతకాలు చేసి ఇస్తున్నారు. గ్రామాల్లో విలువైన భూములను సర్వేయర్ల అసిస్టెంట్లు ఇతరులకు అనుకూలంగా సర్వే చేస్తున్నారనే ఆరోపణలున్నాయి.