ఆకాశమంత పందిరి.. భూదేవి అంత పీట వేసి.. మామిడి తోరణాలు.. మేళతాళాలు.. మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్ఛారణ మధ్య యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. ఏకశిఖరవాసుడైన నారసింహుడు ఏకపత్నీవ్రతుడైన శ్రీరామచంద్రుడి అలంకరణలో గజవాహనంపై మండపానికి ఊరేగింపుగా రాగా.. భక్తకోటికి సకల సంపదలను ప్రసాదించే మహాలక్ష్మి అమ్మవారు పుష్పాల పల్లకిలో కల్యాణ వేదికకు చేరుకున్నారు. అభిజిత్ లగ్న సుముహూర్తంలో శుక్రవారం ఉదయం 11 గంటలకు సంప్రదాయబద్ధంగా కల్యాణోత్సవం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి దంపతులు పట్టువస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. స్వామివారి కల్యాణాన్ని భక్త జనులు కనులారా వీక్షించి తరించారు. బాలాలయంలో ఇదే చివరి కల్యాణోత్సవం కాగా, అర్చక బృందం, పారాయణికుల వేదఘోష, భక్తుల గోవింద నామస్మరణతో ప్రాంగణమంతా ఆధ్యాత్మిక వైభవం నెలకొంది. కల్యాణ మహోత్సవంలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్రెడ్డి దంపతులు, ఎమ్మెల్సీ వెంకటరామిరెడ్డి, సీఎంఓ ప్రత్యేక కార్యదర్శి భూపాల్ రెడ్డి, అసెంబ్లీ వ్యవహారాల కార్యదర్శి నరసింగరావు, కలెక్టర్ పమేలా సత్పతి, ఆలయ ఈఓ గీత, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్ రావు,
ఆలయ అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి పాల్గొన్నారు.
వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం నిర్వహించే రథోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. గతంలో కొండపై బాలాలయంలో రాత్రి 7 గంటలకు.. 8 గంటలకు భక్తులు, పురజనుల కోసం పట్టణ వీధుల్లో స్వామి, అమ్మవార్లను ఊరేగించేందుకు రథయాత్ర నిర్వహించేవారు. ప్రస్తుతం పట్టణంలో నిర్వహించే రథ యాత్రను రద్దు చేశారు. బాలాలయంలోనే రథోత్సవం నిర్వహించనున్నారు. ఈ సారి దాతల సహకారంతో బంగారు రథం సిద్ధమైంది.
ఉదయం 10.30 గంటలకు : స్వామి వారికి శ్రీరామ అలంకార సేవ
ఉదయం 10.45 గంటలకు : గజవాహనంపై ఊరేగింపుగా మండపానికి లక్ష్మీనరసింహుడు
ఉదయం 11.05 గంటలకు : స్వామి వారి సేవకు హారతి
ఉదయం 11.07 గంటలకు : స్వస్తివాచనంతో కల్యాణోత్సవం ప్రారంభం
ఉదయం 11.51 గంటలకు : రక్షా బంధనం
మధ్యాహ్నం 12.50 గంటలకు : జీలకర్ర బెల్లం సమర్పణ
మధ్యాహ్నం 12.57 గంటలకు : మాంగల్యధారణ
మధ్యాహ్నం 1.10 గంటలకు : ముగిసిన కల్యాణోత్సవం.