కొండాపూర్, డిసెంబర్ 19 : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తెలుగు శాఖలో ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో పరిశోధనలు పూర్తి చేసిన గొంగులూరి కృష్ణవేణి, దారిశెట్టి పుష్పిణిలకు వర్సిటీ పీహెచ్డీ డాక్టరేట్ డిగ్రీలను ప్రకటించింది. సంగారెడ్డిలోని తార ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పార్ట్ టైమ్ తెలుగు అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న జీ కృష్ణవేణి ‘తెలుగు సాహిత్య చరిత్రలు-పరిశీలన’ అనే అంశంపైనా, దారిశెట్టి పుష్పిణి ‘మరుపూరు కోదండరామరెడ్డి జీవితం, రచనలు సమగ్రపరిశీలన’ అనే అంశాలపై పరిశోధనలు పూర్తి చేశారు. ఇరువురూ యూజీసీ రీసెర్చ్ ఫెలోషిప్ పొంది, పరిశోధన చేశారు.
ఇరువురూ ఎంఏ తెలుగు, పిహెచ్డీలను సెంట్రల్ యూనివర్సిటీలోనే పూర్తి చేసి, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక పరిశోధన పత్రాలను సమర్పించారు. అనేక పరిశోధన పత్రికల్లో పరిశోధన పత్రాలను రాశారు. ఇద్దరికి డాక్టరేట్ డిగ్రీకి అర్హత పొందినట్లు హెచ్ సియు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ కార్యాలయం ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. వచ్చే ఏడాది అక్టోబరు నెల జరిగే స్నాతకోత్సవంలో డిగ్రీ పట్టాలను ప్రదానం చేరానున్నారు. ఈ సందర్భంగా తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య పిల్లలమర్రి రాములు, పర్యవేక్షకులు, తెలుగు శాఖ పూర్వ అధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, ఇతర అధ్యాపకులు, కుటుంబ సభ్యులు పరిశోధకులకు శుభాకాంక్షలు తెలియజేశారు.