కడ్తాల్ : మండల పరిధిలోని బాలాజీనగర్ తండాలోని రాధాకృష్ణ ఆలయంలో మంగళవారం శ్రీకృష్ణాష్టమి వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ఉదయం స్వామి వారికి అభిషేకాలు, హారతీ, అర్చనలు, ప్రత్యేక పూజలు చేశారు. కృష్ణాష్టమి సందర్భంగా ఆలయాన్ని వివిధ రకాల పూలతో అందంగా ముస్తాబు చేశారు. ఎమ్మెల్యే జైపాల్యాదవ్ స్వామి వారిని దర్శించుకోని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా ఉట్టి కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్గుప్తా, సర్పంచ్ కమ్లీబీచ్చానాయక్, ఎంపీటీసీ లచ్చిరాంనాయక్, రైతుబంధు సమితి మండల కో-ఆర్డినేటర్ వీరయ్య, నాయకులు గంప శ్రీను, వెంకట్రెడ్డి, చంద్రమౌలి, జంగయ్యగౌడ్, మోత్యానాయక్, శివయాదవ్, ప్రజాప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.