కొత్తూరు రూరల్ : కొత్తూరు మండల పరిధిలోని ఇన్ముల్నర్వ గ్రామంలో సయ్యద్ హజరత్ జహంగీర్పీర్ దర్గాను బుధవారం వక్స్బోర్డు డీఎస్పీ ఖాజామైనొద్దీన్, ఆర్డీవో రాజేశ్వరి పరిశీలించారు. దర్గా అభివృద్ధి పనులపై రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదేశించిన నేపథ్యంలో బుధవారం వక్ప్బోర్డు ఉన్నతాధికారులు దర్గాను సందర్శించారు. ఈ సందర్భంగా దర్గాలోని పరిసరాలను, స్థలాన్ని పరిశీలించి, దర్గా అభివృద్ధి, దర్గా అభివృద్ధికి కావాల్సిన స్థలం, దర్గాలో గల మసీదు మరమ్మతులు, షాపింగ్మాల్స్, పార్కింగ్ వంటి వాటికి స్థలాన్ని పరిశీలించారు. అనంతరం స్థానికులతో చర్చించారు. స్థానికులు దర్గా అభివృద్ధితో తమకు తలెత్తె సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.
అలాగే దర్గాలో 36మంది స్వీపర్లు పని చేయాల్సింది ఉండగా అందులో కేవలం నలుగురు మాత్రమే పని చేస్తున్నట్లు స్థానికులు వక్ఫ్బోర్డు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. దీంతో దర్గాలో పారిశుధ్య పనులు మూలనపడ్డాయన్నారు. దర్గాలో అండర్ డ్రైనేజీ సమస్య ఉందని, వచ్చేనెలలో దర్గాలో నిర్వహించనున్న ఉర్సు ఉత్సవాల నేపథ్యంలో దర్గాలో సమస్యలను పరిష్కరించాలని స్థానికులు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. కార్యక్రమంలో తాసిల్దార్ రాములు, సర్పంచ్ అజయ్నాయక్, టీఆర్ఎస్ సినియర్ నాయకులు ఎమ్మె సత్యనారాయణ, గోపాల్నాయక్, సీరాజ్ పాల్గొన్నారు.