కొత్తూరు, ఫిబ్రవరి 1: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కనీసం ప్రొటోకాల్ పాటించలేదని కొత్తూరు జడ్పీటీసీ శ్రీలత అన్నారు. బుధవారం ఎస్బీపల్లిలో జడ్పీ నిధులతో నిర్మిస్తున్న అంగన్ వాడీ భవన శంకుస్థాపనకు తనను పిలువకపోపడంపై బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మెండె కృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. సర్పంచ్ల పదవీకాలం ముగుస్తున్నందున్నే ఎస్బీపల్లి కాంగ్రెస్ నాయకులు హడావుడిగా ఎమ్మెల్యే శంకర్ను తీసుకొచ్చి అంగన్వాడీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయించారని విమర్శంచారు.
ఆ కా ర్యక్రమానికి తనను ఆహ్వానించకపోవడంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానన్నారు. పడిపోయే స్థితిలో ఉన్న ఆ భవనానికి జడ్పీ నుంచి ఎంతో కష్టపడి నిధులు తీసుకొచ్చానని.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో టెండర్ కూడా అయిందన్నారు. అంజయ్యయాదవ్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇలాంటివి ఎప్పడూ జరుగలేదన్నారు. ఏ ఊరిలో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ఉన్నా సర్పంచ్, ఎంపీటీసీని ఆహ్వానించేవారిని గుర్తు చేశారు.
బీఆర్ఎస్ హయాంలో ఎస్బీపల్లిలో సీసీ రోడ్లకోసం హెచ్ఎండీఏ నుంచి రూ.45 లక్షలు ప్రొసీడింగ్స్ కూడా ఇప్పించామని.. ఇంతలోనే ఎన్నికలు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందన్నారు. అయినా సీసీ రోడ్ల పనుల ప్రారంభోత్సవానికి పిలిస్తే హాజరయ్యానని చెప్పారు. సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ రవీందర్, రైతు సమన్యయ సంఘం మండలాధ్యక్షుడు నర్సింహారెడ్డి, సర్పంచ్లు సత్తయ్య, తులసమ్మ, బాలయ్య, శ్రీశైలం, మధుసూదన్రావు, పాండు, జంగయ్యతదితరులు పాల్గొన్నారు.