వికారాబాద్, జనవరి 31 : చదువు అనే ఆయుధాన్ని సక్రమంగా వినియోగించుకోవాలని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి విద్యార్థులకు హితవు పలికారు. బుధవారం వికారాబాద్లోని అంబేద్కర్ భవన్లో షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పదో తరగతి వసతి గృహ విద్యార్థినీ విద్యార్థులకు ప్రేరణ, శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. వారికి వివిధ పాఠ్యాంశాలపై తర్ఫీదు , మనోధైర్యం, వ్యక్తిగత నైపుణ్యాన్ని పెంచేందుకు నిష్ణాతులైన ఉపాధ్యాయులు, ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ డైరెక్టర్లచే తరగతులను నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థినీ విద్యార్థులకు పరీక్షలు సమీపిస్తున్న క్రమంలో భయం, ఉత్సాహం ఉంటుందని, తమ లక్ష్యాన్ని సాధించే దిశగా చదువుపై దృష్టి సారించాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఏవైనప్పటికీ చదువుకోవాలి అనే కోరిక గట్టిగా ఉంటే ఏదైనా సాధ్యమేననన్నారు. విద్యార్థుల్లో లక్ష్యం గొప్పదిగా ఉండాలని, చదువుల్లో డిగ్రీలు ముఖ్యం కాదని నైపుణ్యంతో కూడిన విద్యను నేర్చుకోవాలన్నారు. విద్యార్థులు దొడ్డిదారిలో పరీక్షలు రాసి ఉత్తీర్ణులైతే భవిష్యత్తులో ఎంతో ఇబ్బంది పడాల్సి వస్తుందని కలెక్టర్ వివరించారు.
వసతి గృహాల్లో చదువుకున్న విద్యార్థులందరూ పేదరికం నుంచి వచ్చిన వారేనని, చదువుతో మీ భవిష్యత్తును మార్చుకొని మీ వంశ వృక్షంలో ఒక మలుపు దిశగా అడుగులు వేస్తూ ముందుకు సాగాలని కలెక్టర్ సూచించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి విద్యను అభ్యసించేందుకు వచ్చే విద్యార్థులకు ప్రభుత్వం ఎన్నో సదుపాయాలు కల్పించిందన్నారు. పరీక్షల సమయంలో ప్రత్యేక తరగతులు నిర్వహించి స్టడీ మెటీరియల్ను అందిస్తున్నట్లు తెలిపారు.
అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ డైరెక్టర్లు సలహాలు, సూచనలను తీసుకొని పరీక్షల్లో మంచి మార్కులు సాధించి ఉత్తీర్ణులు కావాలని కలెక్టర్ ఆకాంక్షించారు. అనంతరం కలెక్టర్ విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ అమిత్ నారాయణ, షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ అధికారి మల్లేశం, ఎస్సీ, బీసీ, సంక్షేమ అధికారులు ఉమాపతి, వీరానందం, భీమ్రాజ్, ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ డైరెక్టర్లు రామచంద్రుడు, మాధవి, మహేందర్, శ్రీధర్, పీ.వీ రెడ్డి, వివిధ వసతి గృహాల వార్డెన్లు, సిబ్బంది పాల్గొన్నారు.
మానవ వనరులను సద్వినియోగం చేసుకొని మహిళలు ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. వికారాబాద్లోని బ్లాక్ గ్రౌండ్ సమీపంలోని స్త్రీ శక్తి భవన్లో జిల్లాలో మహిళా సంఘాల ఆర్థిక పురోగతి, సంఘాల పనితీరు, రుణాల సద్వినియోగంపై జిల్లా మహిళా సమాఖ్య సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. స్వయం సహాయక సంఘాల మహిళలు వారి ఆర్థిక ఎదుగుదలతో పాటు సామాజిక సమస్యలపై కూడా దృష్టి సారించాలన్నారు.
గ్రామాల్లో మహిళలు, వితంతువుల సమస్యలు, బాల్య వివాహాలను అరికట్టేందుకు.. ఆడ మగ తేడా లేకుండా వివిధ సమస్యలపై స్పందించి పనిచేయాలని సూచించారు. జిల్లాలో అతివేగంగా అభివృద్ధి దశలో పయనించే క్రమంలో వైద్య కళాశాలతో పాటు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, నైపుణ్యాభివృద్ధి (స్కిల్ డెవలప్మెంట్) యూనివర్సిటీ జిల్లాలో ఏర్పాటు చేయబోతున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వం ముఖ్య ప్రాధాన్యతలో భాగంగా మహిళలు పలు రంగాల్లో శిక్షణ పొందే దిశగా విద్యార్హతల జాబితాలను రూపొందించాలని డీఆర్డీవో కృష్ణన్కు కలెక్టర్ సూచించారు. సమావేశంలోఅదనపు డీఆర్డీవో నర్సింహులు, డీపీఎంలు రాంనాథ్, నర్సింహులు, మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు అలివేలు, కార్యదర్శి లక్ష్మి ఉన్నారు.
గ్రామపంచాయతీలకు ప్రత్యేకాధికారులుగా సర్కారు కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. కలెక్టర్ కార్యాలయం నుంచి గూగుల్ మీట్ ద్వారా కొత్తగా స్పెషల్ ఆఫీసర్లుగా ఎంపికైనవారితో కలెక్టర్ సమావేశం నిర్వహించి వారికి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్పెషల్ ఆఫీసర్లుగా నియామక ఉత్తర్వులు రేపటి వరకు అందించనున్నామని, ఉత్తర్వులు అందిన వెంటనే గ్రామపంచాయతీకి సంబంధించిన రికార్డులు, లాగిన్లతో సహా పూర్తి చార్జిని తీసుకోవాలని సూచించారు. స్పెషల్ ఆఫీసర్లు గ్రామపంచాయతీల్లో ఇంతకుముందు పాలకవర్గం చేపట్టిన పనులన్నీ సక్రమంగా నిర్వహించాలన్నారు.
తీసుకునే ప్రతి నిర్ణయం ప్రజలకుపయోగపడేలా పూర్తి బాధ్యతతో పనిచేయాలని, ప్రభుత్వ ఆస్తులు, నిధులు దుర్వినియోగం చేయకుండా పనులను చేపట్టాలన్నారు. ప్రతిరోజూ నిర్వహించే పారిశుధ్య పనులు, తాగునీరు, విద్యుత్ సరఫరా తదితర పనుల్లో ఆటంకం లేకుండా చేపట్టాలన్నారు. స్పెషల్ ఆఫీసర్లు నిర్వహించాల్సిన పనులు 25 శాతముంటే, కింది స్థాయి సిబ్బందితో 75 శాతం పనులు చేయించాలన్నారు. ఎంపీడీవోలు, ఎంపీవోల సహకారం తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి తరుణ్కుమార్ పాల్గొన్నారు.
రైతులకు మంచి సేవలు అందించేందుకు కృషి చేయాలని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి కోటక్ మహీంద్ర బ్యాంక్ అధికారులకు సూచించారు. బుధవారం వికారాబాద్లో కోటక్ మహీంద్ర బ్యాంక్ నూతన బ్రాంచ్ను జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్శర్మతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ బ్యాంకు అధికారులతో మాట్లాడుతూ.. వికారాబాద్ జిల్లా వ్యవసాయ ఆధారిత ప్రాంతమని, ఇక్కడి రైతులను ప్రోత్సహించేలా బ్యాంకర్ల సేవలు ఉండాలన్నారు.
జిల్లాలో చిన్నచిన్న పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే ఔత్సాహికులను ప్రోత్సహించేలా బ్యాంకు పని చేయాలని కలెక్టర్ కోరారు. ప్రారంభోత్సవంలో లీడ్ బ్యాంకు మేనేజర్ రాంబాబు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాబు మోజెస్, రీజినల్ బిజినెస్ హెడ్ నటరాజ్ డోకే, క్లస్టర్ ఏరియా మేనేజర్ అనిల్, జనరల్ మేనేజర్ రాఘవేంద్రగౌడ్, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.