చేవెళ్లటౌన్, జూలై 3 : తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిప్రదాత, పోరాట యోధుడు, తొలి అమరుడు దొడ్డి కొమురయ్య అని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. సోమవారం చేవెళ్లలోని శంకర్పల్లి చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు చేసిన దొడ్డి కొమురయ్య విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బండారు దత్తాత్రేయ, చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి, ఎమ్మెల్సీ, కురుమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎగ్గే మల్లేశం, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి హాజరై విగ్రహాన్ని అవిష్కరించారు. అనంతరం కేజీఆర్ గార్డెన్లో ఏర్పాటు చేసిన కురుమ సంఘం ఆత్మీయ సమ్మేళన మహాసభలో పాల్గొని మాట్లాడారు.
హర్యానా గవర్నర్ దత్తాత్రేయ మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, తొలి అమరుడు అనగానే మొదటగా గుర్తుకు వచ్చే వ్యక్తి దొడ్డి కొమురయ్య అని పేర్కొన్నారు. నిజాం దురాగతాలు, అరాచకాలకు వ్యతిరేకంగా పోరాడి రజాకార్ల తుపాకులకు బలైన యోధుడని తెలిపారు. ఆయన ఆశయ సాధనలో ప్రతిఒక్కరూ ముందుకు సాగాలన్నారు. కురుమ సమాజం అభివృద్ధి చెందాలంటే విద్య తప్ప వేరే మార్గం లేదన్నారు. మన వృత్తిని మనం కాపాడుకోవాలని సూచించారు. ప్రతి జిల్లాలో పేద కురుమ పిల్లల చదువు కోసం హాస్టల్ నిర్మాణం కావాలని.. అందుకు తన సంపూర్ణ సహాయ సహకారాలు ఉంటాయని దత్తాత్రేయ పేర్కొన్నారు. నిరుద్యోగ సమస్య పరిష్కారానికి సాంకేతిక పరిజ్ఞానం అవసరమన్నారు. ఒగ్గు కళాకారులను రక్షించుకోవాలన్నారు. కురుమలందరూ సంఘటితంగా ఉండాలని దత్తాత్రేయ సూచించారు.
గొల్ల కురుమల అభివృద్ధికి గొర్రెలు పంపిణీ
ఎంపీ రంజిత్రెడ్డి మాట్లాడుతూ.. భూమి కోసం, విముక్తి కోసం అంటూ గళమెత్తి.. సాయుధ పోరాటం చేసిన కొమురయ్య కురుమ సంఘానికే కాకుండా తెలంగాణ రాష్ర్టానికే ఆదర్శమన్నారు. ఆయన వర్ధంతి రోజు విగ్రహావిష్కరణ చేసుకోవడం మన అదృష్టమన్నారు. అన్ని కులాలు బాగుంటేనే బంగారు తెలంగాణ సాధ్యమని నమ్మిన కేసీఆర్.. గొల్లకురుమల అభివృద్ధికి రూ.11వేల కోట్లతో రెండు విడుతలుగా గొర్రెలు పంపిణీ చేశారని ఎంపీ తెలిపారు.
భవన నిర్మాణానికి రూ.25 లక్షలు
ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి మాట్లాడుతూ.. దొడ్డి కొమురయ్య లాంటి మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. కొమురయ్య భవన నిర్మాణం కోసం ఎమ్మెల్సీ నిధుల నుంచి రూ.25లక్షలు మంజూరు చేస్తున్నట్లు మహేందర్రెడ్డి తెలిపారు.
ఉద్యమం ఎప్పటికైనా లక్ష్యాన్ని ముద్దాడుతుంది
ఎమ్మెల్యే యాదయ్య మాట్లాడుతూ.. ఉద్యమం ఎప్పటికైనా లక్ష్యాన్ని ముద్దాడుతుందని, వెనుకడుగు వేయని పోరాటం విజయ తీరాలకు తాకి తీరుతుందని తెలిపారు. భూమి కోసం.. విముక్తి కోసం పోరాటం అసువులు బాసిన గొప్ప యోధుడు కొమురయ్య అని కొనియాడారు. చేవెళ్లలో కురుమ సంఘం భవన నిర్మాణానికి కట్టుబడి ఉన్నామని.. ఇందుకోసం 600 గజాల స్థలం ఇస్తామని తెలిపారు. హైదరాబాద్లో కురుమ సంఘానికి సీఎం కేసీఆర్ ఐదేకరాల స్థలం ఇచ్చారని పేర్కొన్నారు. ప్రభుత్వం అన్ని విధాలుగా కురుమలను ఆదుకుంటున్నదన్నారు. తెలంగాణ వచ్చినంక దొడ్డి కొమురయ్య వర్ధంతి, జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నదని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, కురుమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సదానందం, శుభప్రతాప్ పటేల్, విమలక్క, పాశం యాదగిరి, చేవెళ్ల ఎంపీపీ విజయలక్ష్మి, జడ్పీటీసీ మాలతి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ప్రభాకర్, సర్పంచ్ శైలజ, ఎంపీటీసీ రాములు, కురుమ సంఘం చేవెళ్ల మండల అధ్యక్షుడు వెంకటేశం, ఉపాధ్యక్షులు, సభ్యులు పాల్గొన్నారు.