కొడంగల్ : గంజాయి మహామ్మారి యువకుల, చిన్నారుల జీవితాలను చిద్రం చేస్తుందని, గంజాయిని సమూలంగా నిర్మూలించే విధంగా ప్రతిజ్ఞ చెద్దాం.. సమాజాన్ని కాపాడుదామని పరిగి డీఎస్పీ శ్రీనివాస్ పోలీసులను ఆదేశించారు. శనివారం పట్టణంలోని కేఎస్వీ ఫంక్షన్ హాల్లో గంజాయి నిర్మూలనపై నియోజవకర్గ పరిధిలోని కొడంగల్, బొంరాస్పేట, దౌల్తాబాద్ మండలాల పరిధిలోని పోలీస్టేషన్ సిబ్బందితో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంజాయి చాలా ప్రమాదకరమని, సాగు చేయండం, అమ్మడం, కొనడం నేరంగా పేర్కొన్నారు. గంజాయి నిర్మూలనపై ప్రభుత్వం చాలా సీరియస్గా ఉందని, పూర్తి బాధ్యత పోలీసులపై ఉంచినట్లు తెలిపారు.
గంజాయి మహామ్మారికి వయస్సుతో ప్రమేయం లేకుండా దాసోహం కాబడుతున్నారని, ఎస్సీ ఆదేశాల మేరకు సమావేశాన్ని ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. పోలీసులు ప్రత్యేక దృష్టి సారిస్తే దేనినైన ఇట్టే నిర్మూలించే సత్తా పోలీసులు శాఖకు ఉన్నట్లు తెలిపారు. కాబట్టి పోలీసు సిబ్బంది గ్రామ గ్రామాన పర్యటించి ప్రత్యేకంగా కొందరితో పరిచయాలు ఏర్పాటు చేసుకోవాలని, ప్రజల న్యాయపరమైన సమస్యలను తీరుస్తూ వారితో కలుపుగోలుగా ఉంటే ఏదేని సమాచారాన్ని ఇట్టే రాబట్టుకోవచ్చని తెలిపారు. పోలీసు మెస్సేజ్ సిస్టమ్ అందుబాటులో ఉందని, అందులో గ్రామస్తుల ఫోన్ నంబర్లను జతచేస్తే ఏదేని సంఘటన జరిగిన సమాచారాన్ని వెంటనే తెలుసుకోవచ్చన్నారు. అంతే కాకుండా గుట్టు చప్పుడు కాకుండా సమాచారాన్ని అందుకోవచ్చని, సంఘటన అప్రమత్తం చేసే అవకాశం కూడా ఉంటుందని తెలిపారు.
గంజాయి సాగు, అమ్మకాలు, రవాణ వంటి సమాచారం ఏదైనా తెలిస్తే వెంటనే పోలీసులకు చేరవేయాలని, సమాచారం అందించిన వ్యక్తి వివరాలు గోప్యంగా ఉంచబడుతుందని స్పష్టం చేశారు. గంజాయితో ప్రాణాపాయం ఉందని గుర్తించినప్పటికీ వాడుతున్నట్లు తెలిపారు. ఆయా ప్రాంతాల్లో ఇతరాత్ర రాష్ట్రాల ఉపాది కోసం వచ్చే యువకులు ఓ ప్రత్యేకమైన ట్యాబ్లెట్స్ను వాడుతున్నారని, నిద్ర లేకుండా ఎక్కువ సమయం పనిచేయడానికి వాటిని వాడుతున్నట్లు సమాచారం ఉన్నట్లు తెలిపారు. నిద్రలేకుండా మేల్కోవడం ఆరోగ్యానికి ప్రమాదమని పేర్కొన్నారు. అదే విధంగా పోలీసు సిబ్బంది కూడా గంజాయి కేసులను పట్టుకుంటే వారికి రివార్డులు, ప్రమోషన్లను అందుకునే ఆస్కారం ఉందన్నారు.
గంజాయి నిర్మూలనలో పోలీసులు పాత్ర ప్రధానంగా ఉందని, యువత కూడా బాధ్యత వహిస్తే పూర్తి స్థాయిలో గంజాయి నిర్మూలన కాబడుతుందని తెలిపారు. అనంతరం పట్టణ బస్టాండ్ ప్రదేశంలో పలు దుకాణాల్లో ఆకస్మికంగా సోదాలు నిర్వహించి నిషేధిత గుట్కాలను స్వాదీనం చేసుకున్నారు. బస్టాండ్లో కార్యక్రమంలో సీఐ అప్పయ్య, కొడంగల్, బొంరాస్పేట, దౌల్తాబాద్ మండలాల ఎస్ఐలు సమ్యానాయక్, వెంకటనారాయణ, రమేశ్, ట్రైనీ ఎస్ఐలతో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.