కొడంగల్ : పట్టణంలో నిర్మాణం అవుతున్న 50 పడకల ఆసుపత్రి నిర్మాణం పనులు త్వరగా పూర్తి అయితే నియోజకవర్గ ప్రజలకు కార్పొరేట్ తరహాలో వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. గురువారం ఎమ్మెల్యే నిర్మాణంలో ఉన్న 50పడకల ఆసుపత్రి భవనాన్ని పరిశీలించి పనులు త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. ఆసుపత్రి నిర్మాణం పనులు చాలా నిధానంగా కొనసాగతున్నాయని, ప్రస్తుతం పనులు చివరి దశకు చేరుకున్నాయి కాబట్టి మరింత వేగవంతంగా పనులు చేపట్టి వెంటనే పూర్తి చేయాలని తెలిపారు. ప్రస్తుత సీహెచ్సీ ఆసుపత్రి వైద్యవిధాన పరిషత్లో అనుసంధానం కాబడిందని, భవన నిర్మాణం పూర్తి అయితే ఆసుపత్రికి అధునాతన పరికరాలు మంజూరు అవుతాయని తెలిపారు. దీంతో కార్పొరేట్ తరహాలో వైద్యసేవలు అందుతాయని తెలిపారు.
అత్యవసర పరిస్థితులో ప్రజలు దూర ప్రాంతాల్లోని ఆసుపత్రులకు పరుగులు తీయాల్సి వస్తుందని, కాబట్టి వెంటనే భవన నిర్మాణం పనులు పూర్తి చేయాలని సూచించారు. అదే విధంగా ఆసుపత్రి పరిసర ప్రాంతంలో పచ్చటి వాతావరణం నెలకొనే విధంగా చుట్టు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఆసుపత్రి సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో డా. శ్రావణి, మున్సిపల్ కౌన్సిలర్ మధుసూదన్యాదవ్, సర్పంచ్ సయ్యద్ అంజద్, పకీరప్ప, మాజీ సర్పంచ్ రమేశ్బాబు, మాజీ మండల అధ్యక్షుడు గోడల రాంరెడ్డి పాల్గొన్నారు.