సిటీబ్యూరో, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ) : ఏడాదంతా పుస్తకాలతో కుస్తీ పట్టే చిన్నారులు సమ్మర్లో తెగ ఎంజాయ్ చేయాలనుకుంటారు.. పల్లెటూర్లకు వెళ్లేవాళ్లు కొందరైతే.. నగరంలోనే స్విమ్మింగ్, స్కేటింగ్, బ్యాట్మింటన్, క్యారం, చెస్, బాస్కెట్ బాల్, టేబుల్ టెన్నిస్ తదితర స్పోర్ట్స్లో మెలకువలు నేర్చుకోవాలని కొందరు ఆరాటపడుతుంటారు. ఇందుకు మెజార్టీగా జీహెచ్ఎంసీ సమ్మర్ క్యాంపులను ఎంచుకుంటారు. ఇక్కడ నామమాత్రపు ఫీజులతో ఔట్డోర్, ఇండోర్ స్పోర్ట్స్తో పాటు పెయింటింగ్ తదితర 44 రకాల ఆటలలో మనోవికాసాన్ని పెంచేలా శిక్షణ ఇస్తుంటారు. ఐతే రేవంత్ సర్కార్ ఆయా క్రీడలను ఖరీదుగా మార్చేసింది. గుట్టుచప్పుడు కాకుండా యూజర్ చార్జీల పేరిట ప్రతి కీడపై సరాసరిగా రూ.200 మేర భారం మోపారు. పురపాలక శాఖ ప్రత్యేక శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ అధ్యక్షతన సోమవారం జరిగిన స్టాండింగ్ కమిటీలో యూజర్ చార్జీల భారం మోపుతూ నిర్ణయం తీసుకున్నారు. పిల్లలను ఆటపాటల్లో బిజీగా ఉంచుదామనుకునే తల్లిదండ్రులకు జీహెచ్ఎంసీ నిర్ణయం ఒక్కసారిగా షాక్కు గురిచేసింది. కనీస సౌకర్యాలు కల్పించడంలో విఫలమైన బల్దియా.. ఫీజుల పెంపులో మాత్రం ‘ఒలింపిక్’ వేగాన్ని ప్రదర్శిస్తున్న తీరుపై తీవ్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి..ఇప్పటికే చాలా స్పోర్ట్స్ కాంప్లెక్స్లను ప్రైవేట్ పరం చేసిన అధికారులు…వేసవి శిక్షణ తరగతుల ఫీజులను పెంచడంపై నగరవాసులు మండిపడుతున్నారు.
బల్దియా క్రీడల నుంచి ఏటా దాదాపు రూ.3 కోట్లకు పైగా ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నది. మంత్లీ మెంబర్ షిప్ రూపంలో రూ.1.63 కోట్లు, స్విమ్మింగ్ఫూల్, టెంపర్వరీ ప్లే గ్రౌండ్, స్కూల్ రిజిస్ట్రేషన్స్, సమ్మర్ కోచింగ్ క్యాంపుల పేరిట ఆదాయాన్ని ఆర్జిస్తున్నది. దీనికి తోడు ప్రతి ఏటా నిర్వహించే వేసవి క్రీడాశిబిరాల (సమ్మర్ కోచింగ్ క్యాంప్స్) ద్వారా కూడా బల్దియా ఇప్పుడు కాసుల వేట మొదలుపెట్టింది. గతంలో నామమాత్రపు ఫీజులతో సాగే శిక్షణకు ఇప్పుడు ‘కార్పొరేట్’ రంగు అద్దుతోంది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఫీజులు భారీగా పెంచేశారు. షటిల్, బ్యాడ్మింటన్, టెన్నిస్ వంటి ఇండోర్ క్రీడలకే కాకుండా.. కనీసం గ్రౌండ్ కూడా సరిగ్గా లేని క్రికెట్, ఫుట్బాల్ వంటి ఆటలకు కూడా వసూళ్లు పెంచడం గమనార్హం. గతంలో రూ.1000 ఉంటే.. ప్రస్తుతం రూ.1200 దాటించేశారు.
ఫీజులు పెంచిన అధికారులు.. మరి మైదానాల్లో వసతులపై దృష్టి పెట్టారా అంటే అదీ లేదు. నగరంలోని మెజారిటీ జీహెచ్ఎంసీ ప్లే గ్రౌండ్లలో కనీస మరుగుదొడ్ల సౌకర్యం లేదు. తాగడానికి చల్లటి నీరు దొరకదు. కోచ్ల కొరత సరేసరి! చాలాచోట్ల శిథిలావస్థకు చేరిన నెట్లు, గుంతలమయమైన మైదానాల్లోనే పిల్లలు ఆడాల్సి వస్తోంది. డబ్బులు తీసుకోవడంలో ఉన్న ఉత్సాహం.. మైదానాలను బాగు చేయడంలో ఎందుకు లేదని క్రీడాకారుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. క్రీడలను ప్రోత్సహించాల్సిందిపోయి, ఇలా వ్యాపార కేంద్రాలుగా మార్చడంపై క్రీడా సంఘాలు, నగరవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే పెంచిన ఫీజులను తగ్గించి, మైదానాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.