సబ్బండ వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న రాష్ట్ర సర్కారు ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఇంటింటా కాంతిని నింపుతున్నది. పలు ప్రతిష్టాత్మకమైన సంక్షేమ పథకాలు అమలు చేస్తూ అండగా నిలుస్తున్నది. చెరువులను పునరుద్ధరించి పంటల సాగుకు పుష్కలంగా నీరు అందించి.. రైతుబంధు సాయం అందిస్తున్నది. బీమా చేయించి రైతుల కుటుంబాలకు ఆపద్బాంధువుగా నిలుస్తున్నది. కల్యాణలక్ష్మితో ఆర్థికసాయం అందించి పేదింటి ఆడబిడ్డ పెండ్లి రంది తీర్చింది. దవాఖానల్లో అధునాతన వసతులు కల్పించి.. పైసా ఖర్చు లేకుండా పురుడు పోయించి.. ఆర్థిక చేయూత కూడా అందిస్తూ అన్నీ తానై ఆదుకుంటున్నది ప్రభుత్వం. వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, దివ్యాంగుల జీవనానికి కొండంత ‘ఆసరా’ అవుతున్నది. వనరులు, వసతులు సమకూర్చి కులవృత్తులకు పూర్వవైభవం తెస్తున్నది. ప్రభుత్వ బడులను బలపర్చి.. గురుకులాలు నెలకొల్పి కార్పొరేట్ కు దీటుగా విద్యనందిస్తూ విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్నది. ‘దళితబంధు’తో దళితుల బతుకులను మార్చుతున్నది.
రంగారెడ్డి, మార్చి 17 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ పాలనలో గడపగడపకూ సంక్షేమ పథకాలు అందుతున్నాయి. అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తున్నది. చేతి, కులవృత్తులకు చేయూతనందిస్తున్నది. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలతో ఆడబిడ్డల కండ్లల్లో ఆనందం నిం పుతున్నది. మన ఊరు-మన బడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ బడులను బలోపేతం చేస్తున్నది. గురుకులాలను ఏర్పాటు చేసి కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తూ విద్యార్థుల భవిష్యత్తుకు బం గారు బాటలు వేసింది. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు ఆసరా పథకంతో భరోసా కల్పించింది. రైతుబంధు పథకం అన్నదాతకు ఆత్మబంధువై నిలిచింది. బీమా కర్షకుల్లో ధీమా పెం చింది. దళితబంధుతో ఎస్సీల జీవితాలను మార్చేసింది. సీఎం కేసీఆర్ పాలనలో అభివృద్ధి, సంక్షే మం జోడెడ్లలా పరుగులు తీస్తున్నాయి. ఇంటింటా సంక్షేమం.. ఊరూరా సౌభాగ్యం పరిఢవిల్లుతున్నది. సకల జనులు సంబురపడుతున్నారు. జిల్లా లో వివిధ పథకాలకు మంజూరైన నిధులు ఇలా..
అట్టడుగు వర్గాల అభ్యున్నతికి ‘దళితబంధు’
అట్టడుగు వర్గాల అభ్యున్నతికోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళితబంధు పథకంతో జిల్లాలోని దళితుల కుటుంబాల్లో వెలుగులు నిండుతున్నాయి. ప్రభుత్వం అర్హులకు రూ.పది లక్షల చొప్పున ఆర్థి క సాయాన్ని అందిస్తుండటంతో వారు తమకు నైపుణ్యం ఉన్న రంగాన్ని ఎంచుకుని ఉపాధి పొందుతున్నారు. అయితే జిల్లాలో లబ్ధిదారులు దాదాపుగా మినీ డెయిరీ, పౌల్ట్రీపాంలతోపాటు కార్లు, ట్రాక్టర్ యూనిట్లను ఎంపిక చేసుకున్నారు. అయితే లబ్ధిదారులు ఎంచుకున్న యూనిట్లకు సం బంధించి ఇప్పటికే ఆయా రంగాల్లోని నిపుణుల తో అధికారులు ప్రత్యేక అవగాహన కల్పించడంతోపాటు శిక్షణ కూడా ఇప్పించారు. లబ్ధిదారులు వారు ఎంచుకున్న వ్యాపారాల్లో ఏ విధంగానైనా నష్టపోతే వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు ఏర్పా టు చేసిన రక్షణ నిధి కింద ఇప్ప టివరకు రూ. 35.80 లక్షల నిధులను అధికారులు జమ చేశా రు. మరోవైపు మొదటి విడుతలో జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో 358 మంది లబ్ధిదారులను ఎం పిక చేయగా, జిల్లాకు రూ.35.80 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. 358 యూనిట్లకు అధికారులు ఇప్పటికే గ్రౌండింగ్ ప్రక్రియను పూర్తి చేశారు.
రూ.1000 కోట్లకుపైనే ‘ఆసరా’..
సొంతవారు దూరమై వృద్ధాప్యంలో ఆదరణ కరువైన ఎంతోమంది పం డుటాకులకు సీఎం కేసీఆర్ ఇచ్చే పింఛన్ డబ్బులే ఆధారం అవుతున్నాయి. ఇలాంటి ఎంతోమందికి ప్రభుత్వం ప్రతినెలా రూ.2016 వృద్ధాప్య పిం ఛన్ చెల్లిస్తూ ఆదుకుంటున్నది. అదేవిధంగా దివ్యాంగులకు రూ.3016 అందిస్తూ అండగా నిలుస్తున్నది. గత ఉమ్మడి ప్రభుత్వాలు పింఛన్ల నిమిత్తం ప్రతినెలా కేవలం రూ.2 కోట్లు ఖర్చు చేయగా.. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం మొదట నెలకు రూ.12 కోట్ల మేర పింఛన్ల నిమి త్తం ఖర్చు చేసింది. తదనంతరం పింఛన్ డబ్బులు రెట్టింపు కావడంతోపాటు వయోపరిమితిని తగ్గించిన నేపథ్యంలో పిం ఛన్ల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెలా రూ.26 కోట్ల మేర ఖర్చు చేస్తున్నది. గత ఎనిమిదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఆసరా పింఛన్ల నిమిత్తం ప్రభుత్వం రూ.1000 కోట్లకుపైనే ఖర్చు చేయడం గమనార్హం.
కుల వృత్తులకు పూర్వ వైభవం..
కుల వృత్తులకు ప్రభుత్వం పూర్వ వైభవం తీసుకొచ్చింది. గొల్ల, కురుమలకు గొర్రెలు, మత్స్యకారులకు చేపలను సబ్సిడీపై పంపిణీ చేస్తూ ఆదుకుంటున్నది. దీంతో వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సబ్సిడీ గొర్రెల పంపిణీతో గొల్ల, కురుమలు ప్రతిఏటా రూ.2 లక్షల వరకు ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. నాలుగేండ్లలో దాదాపు రూ.250 కోట్లకుపైగా గొల్ల, కురుమలకు ఆదాయం వచ్చింది. అయితే జిల్లాలో మొద టి విడుతలో 11,333 మంది లబ్ధిదారులకు రూ.125 కోట్ల విలువ చేసే 2.76 లక్షల గొర్రెలను పంపిణీ చేయగా, నాలుగేండ్లలో వారి ఆదాయం రూ.250 కోట్లకుపైగా పెరిగినట్లు జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారులు పేర్కొన్నా రు. అదేవిధంగా జిల్లాలో గత నాలుగేండ్లలో 3.50 కోట్ల చేప పిల్లలను జిల్లాలోని పలు చెరువుల్లో వదిలారు. చేపలను విక్ర యించి జిల్లాలోని మత్స్యకారులు ఆర్థికంగా వృద్ధి చెందుతున్నారు.
రైతు సంక్షేమానికి పెద్దపీట..
సీఎం కేసీఆర్ రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రైతు ప్రభుత్వంగా పేరు తెచ్చుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వం.. ఈ ఎనిమిదేండ్ల పాలనలో రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నది.అధికారంలోకి వచ్చిన వెంటనే వ్యవసాయానికి 9 గం టల విద్యుత్తును సరఫరా చేసిన ప్రభుత్వం, తర్వాత వ్యవసాయానికి ఉచితంగా 24 గంటలపాటు నాణ్యమైన విద్యుత్తును అందిస్తున్నది. అదేవిధంగా రూ.లక్ష రుణమాఫీని పూర్తి చేసిన ప్రభుత్వం, మరోసారి రూ.లక్ష రుణమాఫీలో భాగంగా ఇప్పటికే రూ.50 వేల వరకు పంట రుణాలను మాఫీ చేసింది. త్వరలోనే మిగతా పంట రుణాలనూ మాఫీ చేయాలని నిర్ణయించింది. మరోవైపు రైతులు అప్పుల ఉబిలో చిక్కుకోకుండా పంటలను సాగు చేసుకునేందుకు రైతుబంధు పథకాన్ని అమలు చేస్తున్నది. జిల్లాలో ఈ పథకంలో భాగం గా గత ఐదేండ్లలో దాదాపు రూ.2,500 కోట్ల మేర జిల్లాలోని రైతులకు ప్రభుత్వం పెట్టుబడి నిమిత్తం సహాయాన్ని అందజేసింది. అదేవిధంగా ప్రమాదవశాత్తు రైతు మరణిస్తే సంబంధిత రైతు కుటుంబాన్ని ఆదుకునేందుకు రూ.5 లక్షల బీమాను ప్రభుత్వం అందజేస్తుంది. జిల్లాలో ఇప్పటివరకు 831 మంది రైతులు మరణించగా సంబంధిత రైతు కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున రూ.41.55 కోట్లను అందజేసింది.
పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు రూ.300 కోట్లు..
పేదలకు ఆడబిడ్డల పెళ్లిళ్లు భారం కావొద్దనే ఉద్దేశంతో వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను అమలు చేస్తూ అండగా నిలుస్తున్నది. నిరుపేద దళిత, గిరిజన, బీసీ, ఓబీసీ, మైనార్టీ కులాలకు చెందిన యువతుల వివాహాలకు రూ.లక్షా116లను అందిస్తున్నది. తొలుత పేద కుటుంబాలకు చెం దిన ఆడపిల్లల వివాహాలకు రూ.51 వేల ఆర్థిక సాయాన్ని అందించిన ప్రభుత్వం… తదనంతరం రూ.75,116లకు పెంచింది. అన్ని ధరలు పెరిగిన దృష్ట్యా ప్రస్తుతం రూ.లక్షా116 అందిస్తున్నది. గత ఎనిమిదేండ్లకాలంలో జిల్లాలోని పేద, నిరుపేద కుటుంబాల ఆడబిడ్డల పెళ్లిళ్లకు రాష్ట్ర ప్రభుత్వం రూ.300 కోట్ల వరకు ఆర్థిక సాయాన్ని అందించింది.
ఉచిత డయాలసిస్, డయాగ్నోస్టిక్ సేవలు…
బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు కూడా నాణ్యమైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే పల్లె, బస్తీ దవాఖానలను ఏర్పాటు చేసి వైద్యుల పోస్టులను భర్తీ చేయడంతోపాటు సరిపడా మందులను సమకూర్చుతున్నది. దీంతో ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో మెరుగైన వైద్యం అందుతున్నది. సాధారణ జ్వరం మొదలు ప్రసవాలు, డయాలసిస్, డయాగ్నోస్టిక్ పరీక్షల వరకు ప్రభుత్వ దవాఖానల్లోనే ప్రజలు సేవలు పొందుతుండడం గమనార్హం. అయితే కిడ్నీ రోగులు రోజురోజుకూ పెరుగుతుంట డం, ప్రైవేట్ దవాఖానల్లో డయాలసిస్ ప్రక్రియకు రూ.లక్షల్లో ఖర్చు అవుతున్న దృష్ట్యా ప్రభుత్వం ఉచితంగా డయాలసిస్ సేవలందించేందుకు ప్రభుత్వ దవాఖానల్లోనే కేంద్రాలను అందుబాటులోకి తెచ్చింది. వికారాబాద్ ఏరియా దవాఖాన, తాండూరులోని జిల్లా దవాఖానల్లోని డయాలసిస్ కేంద్రాల్లో ప్రజలకు డయాలసిస్ సేవలందిస్తున్నారు. అదేవిధంగా తెలంగాణ డయాగ్నోస్టిక్ కేంద్రాలు కూడా సత్ఫలితాలను ఇస్తున్నాయి. వికారాబాద్ ఏరియా దవాఖానలోని భవనంలో ఏర్పా టు చేసిన డయాగ్నోస్టిక్ కేంద్రం ద్వారా ఇప్పటివరకు 13.80 లక్షల వైద్య నిర్ధారణ పరీక్షలను నిర్వహించారు. అయితే ఏడాదిన్నరగా జిల్లావ్యాప్తంగా 73,478 మంది నిరుపేదలు లబ్ధి పొందారు. సుమారు రూ.5 కోట్లతో అత్యాధునిక పరికరాలతో 57 రకాల వైద్య నిర్ధ్దారణ పరీక్షలు చేసేలా ఈ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
అంగన్వాడీ టీచర్ల వేతనాలు పెంపు..
అంగన్వాడీ కార్యకర్తల కష్టాలను బీఆర్ఎస్ ప్రభుత్వం తీర్చింది. వారి జీతాలను పెంచింది. జిల్లాలో 2,524 కేంద్రాలుండగా 2,447 అంగన్వాడీ టీచర్లు, సహా కార్యకర్తలు పనిచేస్తున్నారు. అంగన్వాడీ టీచర్లకు గతంలో ఉన్న రూ.4,500 వేతనాన్ని రూ.7 వేలుగా.. అంగన్వాడీ సహా కార్యకర్తల వేతనాన్ని రూ.2,200 నుంచి రూ. 4,500 పెంచింది. తదనంతరం అంగన్వాడీ టీచర్ల వేతనాలను రూ.13,650, కార్యకర్తల వేతనాలను రూ.7,800 పెంచింది. అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణులు, పిల్లలకు ప్రతిరోజూ పాలు, గుడ్లు పంపిణీ చేస్తున్నారు.
37,176 కేసీఆర్ కిట్ల పంపిణీ…
జిల్లాలో ఇప్పటివరకు 37,176 మందికి ప్రభుత్వం కేసీఆర్ కిట్లను అందజేసింది. ఈ పథకంతో జిల్లాలోని ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య పెరిగింది. గతం లో జిల్లాలోని అన్ని ప్రభుత్వ దవాఖానల్లో నెలకు 150 ప్రసవాలు జరుగగా.. ఈ పథకాన్ని అమలు చేస్తున్నప్పటి నుంచి 450 వరకు పెరిగినట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. గత ఐదేండ్లుగా జిల్లాలో పంపిణీ చేసిన కేసీఆర్ కిట్లకు సంబంధించి…2017-18 ఆర్థిక సంవత్సరంలో 5370 కిట్లు.. 2018-19లో 6382, 2019-20లో 6165, 2020-21లో 6920, 2021-22లో 7721, ఈ ఏడాది ఇప్పటివరకు 4618 కేసీఆర్ కిట్లను పంపిణీ చేశా రు. అదేవిధంగా జిల్లాలో ప్రసవాల సంఖ్య కూడా పెరిగింది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో 6003 ప్రసవాలు, 2018-19లో 6943, 2019-20లో 7881, 2020-21లో 8626, 2021-22లో 9957 ప్రసవాలు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 9853 ప్రసవాలు జరిగాయి.
వ్యవసాయం సంతోషంగా సాగుతున్నది
గతంలో వ్యవసాయం అంటే దుఃఖం, కష్టం, నష్టం, ఇబ్బందులతో కూడుకొని ఉండేది. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఏడాది ఎకరానికి రూ.పది వేల చొప్పున పెట్టు బడి సాయాన్ని పంపిణీ చేస్తుండటంతో సంతోషంగా వ్యవసాయం చేస్తున్నా. – హరి మోహన్రెడ్డి, రైతు, రాంపూర్
కేసీఆర్ సార్కు రుణపడి ఉంటాం..
తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెరువుల్లో సబ్సిడీ చేపలను పంపిణీ చేస్తూ మత్స్యకారులను ఆర్థికంగా ఆదు కుంటున్నది. ప్రతి ఏడాది చెరువుల్లో చేప పిల్లలను వద లడంతోపాటు వలలు, యంత్రాలు, వాహనాలను ఉచితం గా పంపిణీ చేస్తున్నది. ఇంత మంచి పథకాలను తీసుకొచ్చిన కేసీఆర్ సారుకు రుణపడి ఉంటాం.
– జయమ్మ, అప్పారెడ్డి గూడ, నందిగామ మండలం
గొర్రెల మందకు యజమానిని అయ్యా..
నేను గతంలో మా గ్రామ శివారులోని పరిశ్రమలో పని చేస్తూ జీవించేవాడ్ని. ప్రభుత్వం మొదటి విడుత గొర్రెలను పంపిణీ చేయడంతో నాకు కూడా ప్రభుత్వం 20 గొర్రెలు ఒక పొట్టేలును ఇచ్చింది. అప్పటి నుంచి గొర్రెలను మేపుకొంటూ జీవిస్తున్నా. గొర్రెల మందకు యజమానిని కావడం ఆనందంగా ఉన్నది.
– కేశమోని రమేశ్, నందిగామ, రంగారెడ్డి జిల్లా
గతంలో ఏ ప్రభుత్వమూ చేయలేదు..
సీఎం కేసీఆర్ ప్రభుత్వం రైతులందరికీ రైతుబంధుతోపాటు పంట రుణాలను మాఫీ చేస్తున్నది. ప్రభుత్వం ఏడాదికి ఎకరం భూమి ఉన్న రైతులకు రూ.పది వేల చొప్పున ఆర్థిక సాయం అందించడం చాలా సంతోషకరం. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత మంచి పనిని చేయలేదు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు
– శేఖర్, రైతు, కౌకుంట్ల గ్రామం
పేదలకు అండగా ప్రభుత్వం
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టి ప్రభుత్వం పేదలను ఆదుకుంటు న్నది. ఈ పథకం పేదలకు వారి ఆడబిడ్డల వివాహాలు భారం కాకుండా ఆదుకుంటు న్నది. ఈ పథకాలతో రాష్ట్రంలో బాల్య వివాహాలు చాలా వరకు తగ్గాయి. నిరుపేదల ఆడబిడ్డలకు ఆర్థిక సాయాన్ని అందించి వారి దీవెనలు పొందుతున్నారు.
– దబ్బాని వెంకట్, బీఆర్ఎస్ పార్టీ మోమిన్పేట మండల అధ్యక్షుడు
ఇప్పుడు సొంత కారుతోనే ఉపాధి పొందుతున్నా..
గతంలో నేను హైదరాబాద్లో అద్దె కారు నడిపుతూ జీవించేది. రెంట్ పోను పెద్దగా మిగిలేది కాదు. ఒక్కోసారి కుటుంబ ఖర్చులకు కూడా ఇబ్బందిగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం దళితబంధు పథకం క్రింద ఉచితంగా కారును ఇచ్చి ఆదుకున్నది. ఈఎంఐ టెన్షన్ కూడా లేదు. ప్రతిరోజూ అన్ని ఖర్చులు పోను కనీసం రూ. వెయ్యి మిగులుతున్నాయి. సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటా. – వెంకటేశ్, దళితబంధు లబ్ధిదారుడు, రేగడి చిల్కమర్రి, కొందుర్గు
‘దళితబంధు’తోనే.. మా కుటుంబానికి ఉపాధి
సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ సహకారంతో నాకు దళితబంధు పథ కం ద్వారా కారు వచ్చింది. దానితోనే నా నేను హైదరాబాద్లో కారు నడుపుతూ జీవించేవాడ్ని. రెండేండ్ల క్రితం వచ్చిన వరదల్లో ఆ కారు కొట్టుకుపోయింది. దీంతో నాకు ఉపాధి కరువైంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ నన్ను ఆదరించి ఆదుకున్నది. తెలంగాణ ప్రభుత్వానికి రుణపడి ఉంటా..
– వెంకటేశ్, రేగడి చిల్కమర్రి, కొందుర్గ్ మండలం
ప్రతినెలా రూ.ఐదు వందల వరకు మిగులుతున్నాయి..
నాయీ బ్రాహ్మణుల షాపులకు 250 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్తును అం దించి సీఎం కేసీఆర్ ఆదుకుంటున్నారు. గతంలో మా దుకాణాలకు నెలకు రూ.400 నుంచి రూ.500 వరకు కరెంటు బిల్లు వచ్చేది. మాకు ఉచితంగా కరెంట్ను సరఫరా చేస్తుండటంతో ప్రతినెలా రూ.ఐదు వందల వరకు మిగులుతున్నాయి. ఆ డబ్బుల ను ఇతర ఇంటి ఖర్చులకు వినియోగిస్తున్నా.
– అశ్వల వెంకటేశ్, జాపాల గ్రామం, మంచాల
ప్రభుత్వ దవాఖానలే ఎంతో మేలు
నేను మొదటి కాన్పు కోసం ఆలూరు పీహెచ్సీలో చేరగా సాధారణ ప్రసవం జరిగింది. మగబిడ్డ జన్మించాడు. ఇక్కడ అన్ని రకాల వసతులున్నాయి. ప్రైవేట్ దవాఖా నల కంటే ప్రభుత్వ ఆసుపత్రులే ఎంతో మేలు. నాకు కేసీఆర్ కిట్ను కూడా ఇచ్చా రు. అందులో చాలా వస్తువులున్నాయి. ఆ దవాఖానలో వైద్య సేవలు ఎంతో బాగున్నాయి. డాక్టర్లు, నర్సులు మంచిగా చూశారు.
– కె.కొండమ్మ, ఆలూరు
రుణమాఫీ రెండు సార్లు పొందా..
బీఆర్ఎస్ ప్రభుత్వంలో నేను రెండుసార్లు పంట రుణ మాఫీని పొందా. గతంలో ఏ ప్రభుత్వం కూడా పంట రుణాలను మాఫీ చేయలేదు. రుణమాఫీతో బ్యాంకు అధి కారుల నుంచి బాధలు తప్పాయి.కేసీఆర్ ప్రభుత్వం రుణమాఫీ చేయడంతో చిన్న, సన్న కారు రైతులకు ఆర్థి కంగా ఎంతో మేలు జరుగుతున్నది.
– మల్గ చంద్రయ్య, అంగడి చిట్టంపల్లి గ్రామం, పూడూరు
కొనుగోలు కేంద్రాలతో రైతులకు ఎంతో మేలు
ప్రభుత్వం గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న ధాన్యం కొనుగో లు కేంద్రాలతో రైతులకు ఎంతో మేలు జరుగుతున్నది. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర లభించడంతోపాటు విక్రయించిన వారం రోజుల్లోనే బ్యాంకు ఖాతాలో డబ్బులు జమవుతున్నాయి.
– దూవు వెంకటేశ్, రైతు వడిచెర్ల, బొంరాస్పేట
కేసీఆర్ కిట్ చాలా బాగుంది
సీఎం కేసీఆర్ మాలాంటి నిరుపేదలకు ప్రసవం అనం తరం కేసీఆర్ కిట్లను పంపిణీ చేయడం చాలా సంతోషం గా ఉన్నది. ఈ కిట్లో చిన్నారికి కావాల్సిన అన్ని వస్తువు లు ఉన్నాయి. బయట తీసుకోవాల్సిన అవసరంలేదు. కిట్ చాలా బాగుంది. – కులకచర్లలోని దవాఖానలో కేసీఆర్ కిట్ను తీసుకున్న సావిత్రి
పేదల పాలిట వరం.. ఆరోగ్యశ్రీ
ఆరోగ్యశ్రీ పథకం పేదల పాలిట వరంలా మారింది. ఈ పథకం క్రింద మెరుగైన వైద్యసేవలు అందుతున్నాయి. నేను ఏడాది క్రితం గుండెకు శస్త్ర చికిత్స చేయించుకున్నా. ఇప్పుడు ఆరోగ్యం చాలా బాగున్నది. అన్ని పనులను చేసుకుంటున్నా. సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు.
– హునీబాయి, కుప్పన్కోట్తండా, బషీరాబాద్,
గొర్రెలు నాలుగింతలయ్యాయి
ప్రభుత్వం మొదటి విడుతలో మా గ్రామంలో 26 మందికి (ఒక్కొక్కరికీ 20 గొర్రెలు, ఒక పొట్టేలు) గొర్రెలు పంపిణీ చేయగా అందులో నేను కూడా లబ్ధిదారుడ్ని. ప్రస్తుతం అవి నాలుగింతలై ఆర్థికంగా లాభాలు తెచ్చి పె డుతున్నాయి. గొర్రెల పంపిణీ చాలా సంతోషంగా ఉంది.
– కాశప్ప మల్కన్గిరి గ్రామం, బషీరాబాద్
‘రైతుబంధు’తో వ్యవసాయాభివృద్ధి
రైతుబంధు పథకంతో రైతులకు అప్పుల బాధలు తొల గాయి. రైతులు పంటలను సాగు చేసే ముందే ప్రభుత్వం అందించే పెట్టుబడి సాయంతో అవసరమైన ఎరువులు, విత్తనాలను కొనుగోలు చేసి.. సకాలంలో పంటలను సాగు చేస్తూ ఆర్థికంగా ఎదుగుతున్నారు.
– కిరణ్, ఎన్కతల, మోమిన్పేట
రైతు కుటుంబాలకు అండగా రైతు బీమా
రైతు బీమా పథకం రైతు కుటుంబాలకు అండగా నిలుస్తున్నది. ప్రమాదవశాత్తు రైతు మృతి చెందింతే ఆ కుటుంబానికి రూ.ఐదు లక్షల ఆర్థిక సాయాన్ని అందించి ఆదుకుంటున్నది. సీఎం కేసీఆర్ ప్రభుత్వం రైతన్నల అభ్యున్నతికి ఎంతో కృషి చేస్తున్నది.
– శ్రీకాంత్గౌడ్, ఏఎంసీ చైర్మన్, మోమిన్పేట
కొండంత అండగా ఆసరా పింఛన్
సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రతినెలా అందిస్తున్న ఆసరా పింఛన్ నా కుటుంబానికి కొండంత అండగా నిలుస్తున్న ది. ప్రతినెలా వస్తున్న డబ్బులతో నా పోషణకు ఎలాంటి ఇబ్బందుల్లేవు. ఇంత మంచి పథకాన్ని ప్రవేశపెట్టిన ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు.
– లక్ష్మి, ఎన్కతల, మోమిన్పేట