పరిగి, మార్చి 11: గర్భిణులు, బాలింతల్లో రక్తహీనత సమస్య నివారణకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలో రక్తహీనత సమస్యతో బాధపడుతున్న గర్భిణులు, బాలింతలు ఉన్న జిల్లాల్లో మొదటగా ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. తెలంగాణలోని తొమ్మిది జిల్లాల్లో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేయాలని ప్రభు త్వం నిర్ణయించగా అందులో వికారాబాద్ జిల్లా కూడా ఉన్నది. జాతీయ కుటుంబ సర్వే ఆధారం గా రక్తహీనత సమస్యతో బాధపడుతున్న ప్రాం తాల మహిళలకు ఈ కిట్లను అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టి బడ్జెట్లో ఈ పథకం అమలుకు శ్రీకారం చుట్టింది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమలు కానున్నది. జాతీయ కుటుంబ సర్వే ప్రకారం జిల్లా పరిధిలో గర్భిణు లు, బాలింతలకు రక్తహీనత స్థాయి 61.00 ఉన్న ట్లు గుర్తించారు. రక్తహీనత నివారణే లక్ష్యంగా ఈ కిట్లను అందిస్తారు. మాతాశిశు సంరక్షణకూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా ప్రభుత్వం తాండూరులో మాతాశిశు సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి తల్లీబిడ్డల సంరక్షణకు విశేషంగా కృషి చేస్తున్నది.
జిల్లా పరిధిలో 15,116 మంది మహిళలు న్యూట్రిషన్ కిట్ల ద్వారా లబ్ధి పొందనున్నారు. జిల్లాలోని ఐసీడీఎస్ కొడంగల్ ప్రాజెక్టు పరిధిలో గర్భిణులు 1,272 మంది, బాలింతలు 1,353 మంది, మర్పల్లి ప్రాజెక్టు పరిధిలో గర్భిణులు 1,095 మంది, బాలింతలు 1,102 మంది, పరి గి ప్రాజెక్టు పరిధిలో గర్భిణులు 1,316 మంది, బాలింతలు 1,355 మంది, తాండూరు ప్రాజెక్టు పరిధిలో గర్భిణులు 2,147 మంది, బాలింతలు 2,163 మంది, వికారాబాద్ ప్రాజెక్టు పరిధిలో గర్భిణులు 1,651 మంది, బాలింతలు 1,662 మంది, జిల్లాలో మొత్తం గర్భిణులు 7,481 మంది, బాలింతలు 7,635 మంది ఉన్నారు.
జిల్లాలోని పలు ప్రాంతాల్లో గర్భిణులు, బాలింతల్లో రక్తహీనత సమస్యగా మారింది. జాతీయ కుటుంబ సర్వే సందర్భంగా ఈ అంశాలు వెల్లడయ్యాయి.దీంతో మహిళల్లో రక్తహీనతను పూర్తిగా నివారించేందుకు ప్రభుత్వం కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లను అందించాలని నిర్ణయించింది. అంతేకాకుండా మాతాశిశు సంరక్షణ, ఆరోగ్యంపై ప్రభు త్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నది. న్యూట్రిషన్ కిట్లో ప్రొటీన్ పౌడర్, ఖర్జూరం, నెయ్యి, బెల్లం, రాగి, నట్స్, ఐరన్ మాత్రలతోపాటు మరిన్ని బలవర్ధకమైన పదార్థాలు ఉంటాయని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గర్భిణులకు ఆరోగ్యలక్ష్మి పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తున్నది. దీని ద్వారా గర్భిణులకు పాలు, గుడ్లతోపాటు మరికొన్ని పోషక పదార్థాలను అందజేస్తున్నది. ఆరోగ్యలక్ష్మిని కొనసాగిస్తూనే కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లను అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. బడ్జెట్లో కేటాయించినట్లుగా త్వరలోనే ఈ కిట్ల పంపిణీకి సర్కారు చర్యలు చేపట్టింది.
కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకానికి జిల్లాను ఎంపిక చేసినందుకు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు. గర్భిణులు, బాలింతల్లో ఉన్న రక్తహీనత సమస్య నివారణకు ఈ పథకం ఎంతగానో దోహదపడుతుంది. అంతేకాకుండా మాతాశిశు సంరక్షణ, ఆరోగ్యంపై ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నది. -చౌహాన్ అరుణాదేశు
కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకం పేద మహిళలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. పేదరికంతో బాలికలు, మహిళలు పోషకాహారం తీసుకోక రోగాలబారిన పడుతున్నారు. ఈ పథకం ద్వారా మహిళలు, బాలికలకు పౌష్టికాహారం అంది రక్తహీనత వంటి సమస్యల నుంచి బయటపడి ఆరోగ్యంగా జీవిస్తారు.
-గూని స్వరూప, తుంకిమెట్ల సర్పంచ్