బొంరాస్పేట/షాద్నగర్ టౌన్, అక్టోబర్ 25: శివకేశవులకు ప్రీతికరమైనది కార్తికమాసం. ఏటా దీపావళి మరుసటి రోజు నుంచి ప్రారంభమయ్యే ఈ మాసంలో నెల రోజులపాటు ప్రజ లు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు. ఈ మా సం ఈశ్వరారాధనకు చాలా ముఖ్యమైనది. శివాలయాలు రుద్రాభిషేకాలు, శివనామ స్మరణతో మార్మోగుతాయి. స్నాన, దాన, జపాలు, పూజ లు, ఉపవాసవ్రతాలు, దీపాలు వెలిగించడం, వనభోజనాలు వంటి వాటిని ఈ నెలలో చేయ డం ద్వారా జన్మజన్మల పాపాలు తొలుగుతాయని పురోహితులు పేర్కొంటున్నారు.
ఈ మా సంలో వచ్చే పౌర్ణమి నాడు చంద్రుడు కృతిక నక్షత్ర సమీపంలో సంచరించడంవల్ల కార్తిక మా సం అని పేరు వచ్చింది. అదేవిధంగా ఈ మా సంలో విష్ణువును దామోదర నామంతో పిలుస్తారు. ఈ మాసంలో పాడ్యమి, చవితి, పౌర్ణమి, చతుర్దశి, ఏకాదశి, ద్వాదశి తిథుల్లో శివపార్వతు ల అనుగ్రహం కోసం మహిళలు పూజలు చేస్తుంటారు. వీటిలో సోమవారాలు, చవితి, ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి అత్యంత పుణ్యప్రదమైనవి. భక్తులు పుణ్య నదుల్లో స్నానాలు ఆచరించి ఉపవాస దీక్షలు చేస్తూ తులసి చెంత హరిపూజ, మహారుద్రాభిషేకం, లక్ష కుంకుమార్చన, లలితావిష్ణుసహస్రనామ పారాయణలు చేస్తే విశేష పు ణ్యఫలం లభిస్తుంది. అంతేకాకుండా ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం సమయాల్లో దీపారాధన చేసే వారికి మంచి జరుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. హిందువులు ఈ మాసాన్ని అత్యంత పవిత్ర మాసంగా భావిస్తారు. రాత్రు ల్లో ఆలయాల్లోని తులసి చెట్ల వద్ద దీపాలను వెలిగిస్తారు. ఈ మాసంలో ఆలయాలు విశేష పూజలతో కార్త్తిక శోభను సంతరించుకుంటాయి. అయ్యప్ప దీక్ష తీసుకోవడం కూడా ఈ మాసంలోనే ఆరంభమవుతుంది.
సోమవారాలకు ప్రత్యేకత..
ఈ మాసంలో సోమవారాలకు ప్రత్యేకత ఉంది. సోమవారానికి చంద్రుడు అధిపతి. దేవతల్లో ప్రథముడైన అగ్ని నక్షత్రాల్లో మొదటివాడైన కృతికకు అధిపతిగా ఉండటం, చంద్రుడు పూర్ణుడై ఈ నక్షత్రంపై ఉండటం వల్ల సోమవారాలకు విశిష్టత ఉంటుంది. సోమవారం శివునికి ఎంతో ప్రీతికరం. శైవభక్తులు ఈ మాసంలోని సోమవారాల్లో నియమ నిష్టలతో ఉపవాసం ఉండి ఆరాధిస్తారు. సూర్యోదయానికి ముందే నదుల్లో స్నానాలు ఆచరించి శివుడిని ప్రార్థిస్తారు.
ఆలయాల ముస్తాబు
నేటి నుంచి ప్రారంభం కానున్న కార్తిక మాస పూజలకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని శివాలయాలు ముస్తాబయ్యాయి. తాండూరు సమీపంలోని భూకైలాస్ ఆలయంతోపాటు పరిగి, కొడంగల్, వికారాబాద్ నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాల్లోని శివాలయాల్లో కార్త్తిక మాస పూజలకు ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. బొంరాస్పేట మండలంలోని బొంరాస్పేట సంగమేశ్వరాల యం, నాగిరెడ్డిపల్లిలోని పరమేశ్వరాలయంలో నెల రోజులపాటు కార్త్తిక మాస పూజలను నిర్వహించనున్నారు. అదేవిధంగా షాద్నగర్ పట్టణంలోని శ్రీశివమారుతిగీతా అయ్యప్ప మందిరంలోని శ్రీగిరిజామృత లింగేశ్వరాలయం తోపాటు పలు ఆలయాల్లో ప్రతిరోజూ విశేష పూజలు నిర్వహించనున్నారు.
కార్తిక దీపాలతో..
ఈ మాసంలో ఆలయాలు దీపారాధనతో కళకళలాడుతుంటాయి. దీపారాధనకు ఆవునెయ్యి ఉత్తమం. స్త్రీలు నదులు, కోనేరుల్లో దీపాలను వదులుతారు. దీపాన్ని దానంగా
కూడా ఇస్తుంటారు. దీనివల్ల వారికి ఎనలేని కీర్తి సౌభాగ్యాలు కలుగుతాయని భావిస్తారు. కార్తిక మాసంలో వచ్చే పౌర్ణమిని కూడా ప్రజలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకొంటారు. ఆ రోజు దేవాలయాల్లో మహిళలు దీపాలను వెలిగించి ప్రత్యేక పూజలు చేస్తారు. వన భోజనాలు ఈ మాసానికి మరో విశిష్టత. ఉసిరి చెట్టు లక్ష్మీదేవికి నివాసం. అందువల్ల ఉసిరి వృక్షం మొదట్లో లక్ష్మీదామోదరులను ప్రతిష్ఠించి పూజించాలి. ఈ నెలలో మహిళలు, భక్తులు ఉసిరి చెట్టు ఉన్న వనంలో కు టుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి సామూహికంగా వన భోజనాలు చేస్తే మంచి జరుగుతుందని నమ్మకం. ఈ మాసంలో ప్రతిరోజూ విశిష్టమైనదే.
విశిష్టమైనది కార్తిక మాసం
తెలుగు మాసాల్లో విశిష్టమైనది కార్తిక మాసం. పరమశివుడికి ఎంతో ప్రీతికరమైనది. ఈ మాసంలో సోమవారం రోజున ఉపవాసం, రాత్రివేళ నక్షత్ర దర్శనం చేసి భోజనం చేస్తే మంచి జరుగుతుందని ధర్మసింధువు గ్రంథం చెబుతున్నది. ఈ మాసంలో ప్రతిరోజూ పర్వదినమే అయినప్పటికీ కొన్ని ముఖ్యమైన పర్వదినాలు మరింత ఫలప్రదమైనవి. అవి ఏకాదశి, ద్వాదశి, కార్త్తిక పౌర్ణమి. -సంతోష్ శాస్త్రి,
అర్చకుడు షాద్నగర్