ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘కంటి వెలుగు’ జోరుగా సాగుతున్నది. రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా సేవలందిస్తుండటంతో నిరుపేదలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. ఉదయం నుంచే శిబిరాల వద్ద బారులు తీరుతున్నారు. వైద్యారోగ్య సిబ్బంది వారికి కంటి పరీక్షలు చేసి అవసరమైనవారికి మందులతోపాటు కండ్లద్దాలు అందజేస్తున్నారు. ఐదోరోజు బుధవారం రంగారెడ్డి జిల్లాలో మొత్తం 10,163 మందికి కంటి పరీక్షలు చేయగా, 1,888 మందికి కండ్లద్దాలు పంపిణీ చేశారు. 1,913 ప్రిస్క్రిప్షన్ అద్దాలను ఆర్డర్ చేశారు. అలాగే వికారాబాద్ జిల్లాలో 6,822 మందికి కంటి పరీక్షలు చేయగా, 1174 మందికి రీడింగ్ గ్లాసులను అందజేశారు. మరో 731 మంది కోసం ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్ను ఆర్డరిచ్చారు.
-షాబాద్, జనవరి 25
షాబాద్, జనవరి 25: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కంటి వెలుగు కార్యక్రమం జిల్లాలో జోరుగా కొనసాగుతున్నది. ఆయా గ్రామాల్లో నిర్వహిస్తున్న కంటి వెలుగు క్యాంపులకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుంది. రంగారెడ్డిజిల్లా వ్యాప్తంగా మొత్తం 80 బృందాలతో కంటి వెలుగు శిబిరాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఆయా కేంద్రాల్లో మొత్తం 10,163 మందికి కంటి పరీక్షలు నిర్వహించినట్లు వైద్యరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. జిల్లాలో కంటి పరీక్షలు నిర్వహిస్తూ, ఉచితంగా కంటి అద్దాలతో పాటు, మందులు అందజేస్తున్నారు.
రంగారెడ్డిజిల్లాలో 10,163 మంది పరీక్షలు
రంగారెడ్డిజిల్లా వ్యాప్తంగా చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల పరిధిలో 80 బృందాల ద్వారా ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాల్లో 10,163 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 1,888 మందికి కంటి అద్దాలు పంపిణీ చేశారు. 1,913 మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాల కోసం ఆర్డర్ చేశారు.
వికారాబాద్ జిల్లాలో 6822 మందికి..
వికారాబాద్, జనవరి 25 (నమస్తే తెలంగాణ) : వికారాబాద్ జిల్లాలోని 42 కంటి వెలుగు కేంద్రాల్లో వైద్య బృందాలు ప్రజలకు పరీక్షలు నిర్వహిస్తున్నాయి. ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకునే విధంగా ప్రజలను చైతన్యం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు, మండలాల నోడల్ అధికారులు కంటి వెలుగు శిబిరాలను సందర్శించి పర్యవేక్షిస్తున్నారు. బుధవారం దుద్యాల మండలంలోని సత్తుర్కుంటతండాలో కంటి వెలుగు వైద్య శిబిరాన్ని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి, జిల్లా టీబీ ప్రోగ్రాం అధికారి రవీంద్రయాదవ్ సందర్శించారు. బుధవారం జిల్లాలో 6822 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వీరిలో 1174 మందికి రీడింగ్ గ్లాసులు పంపిణీ చేయగా, 731 మందికి అద్దాలకు ఆర్డరిచ్చారు.
పేదలకు లబ్ధి చేకూరింది..
కండ్లు బాగుంటేనే అన్ని విధాలుగా ఏ పనినైనా చేసుకోవచ్చని సీఎం కేసీఆర్ గుర్తించి గ్రామీణ ప్రాంతాల్లో కంటి పరీక్షలు చేసేలా చర్యలు చేపట్టారు. వృద్ధులు, కంటి చూపు తగ్గిన వారికి పట్టణాలకు వెళ్లి కంటి పరీక్షలు చేయించుకునే బాధ తప్పడంతో పాటు డబ్బులు కూడా ఖర్చు కాలేదు. గ్రామాల్లోనే క్యాంపులు నిర్వహించి ఉచితంగా పరీక్షలు నిర్వహించడంతో పాటు కంటి అద్దాలను అందజేయడం సంతోషంగా ఉంది.
-బైనగారి పద్మాకర్, పట్లూర్, మర్పల్లి మండలం
అందరికీ ఉపయోగం..
అందరికీ ఉపయోగపడే విధంగా కంటి వెలుగు కార్యక్రమంతో కంటి సమస్యలు పూర్తిగా తొలగనున్నాయి. వైద్యులు చక్కని వైద్యం అందిస్తున్నారు. కంటి అద్దాలతో పాటు మందులను ఇచ్చారు. మెరుగైన వైద్యం అందించేందుకు గ్రామగ్రామానికి ఈ కార్యక్రమాన్ని తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దే. ప్రతి ఒక్కరూ ఈ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి.
– చౌవాన్ లలితాబాయి, సర్పంచ్, సంఘాయిగుట్ట తండా, యాలాల మండలం
పైసా ఖర్చు లేకుండా కంటి పరీక్షలు
కంటి వెలుగు వైద్య శిబిరంలో నయా పైసా ఖర్చు లేకుండా కంటి పరీక్షలు చేశారు. కండ్లద్దాలు కొన్ని రోజుల తరువాత ఇస్తామని చెప్పారు. ప్రైవేటు దవాఖానలకు వెళితే వేల రూపాయలు ఖర్చయ్యేవి. కంటి వెలుగు కార్యక్రమం ద్వారా వైద్యులు గ్రామాలకు వచ్చి ఉచితంగా కంటి పరీక్షలు చేయడం, కండ్లద్దాలు ఇవ్వడం హర్షణీయం. సీఎం కేసీఆర్ సార్ పేదలు రుణపడి ఉంటారు.
-సండ్రవోని చంద్రయ్య, బొంరాస్పేట
కంటి వెలుగు పేదలకు ఎంతో ఉపయోగం
ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన కంటి వెలుగు ద్వారా పేదలకు ఎంతో ఉపయోగం చేకూరుతున్నది. కంటి సమస్యలతో బాధ పడకూడదనే ఉద్దేశంతో గ్రామాల్లోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం గొప్ప విషయం. ప్రైవేట్ దవాఖానకు వెళ్లి పరీక్షలు చేయించుకోవాలంటే చాలా డబ్బులు ఖర్చు అవుతాయి. కానీ సీఎం కేసీఆర్ పైసా ఖర్చు లేకుండా కంటి పరీక్షలు చేసి అద్దాలను ఇస్తుండు.
కంటి సమస్య నివారణ..
కంటి వెలుగు ప్రతి ఇంటా ఆనందాల వెలుగు నింపుతున్నది. బీదలకు కంటి వెలుగు కార్యక్రమం ద్వారా కార్పొరేటు స్థాయి వైద్యాన్ని మన ఇంటి ముందుకే తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్దే. కంటి సమస్య నివారణ మార్గాలను తెలియజేయడమే కాకుండా వారికి అవసరమైన మందులు, అద్దాలను అందిస్తున్నది ప్రభుత్వం. మా గ్రామం తరఫున ముఖ్యమంత్రి కేసీఆర్కు ధన్యవాదాలు.
– బోయిని శేఖర్ సర్పంచ్, అడాల్పూర్, యాలాల మండలం
నాకు కంటి సమస్య ఉండేది..
నాకు కండ్ల సమస్య ఉండేది.. ప్రైవేట్ దవాఖానకు వెళ్లి చూపెట్టుకుందామనుకున్న, కానీ మా ఇంటికి ఆశ కార్యకర్త వచ్చి ఈ రోజు నీకు కండ్ల పరీక్షలు చేస్తారని కాగితం ఇచ్చింది. అందుకే నేను ఇక్కడికి వచ్చి కండ్ల పరీక్షలు చేయించుకున్న, వైద్యులు నాకు అద్దాలు అవసరమని చెప్పి పైసలు తీసుకోకుండా అద్దాలు ఇచ్చారు.. ఊర్లోనే కంటి పరీక్షలు చేయడంతో కంటి ఇబ్బందులు తప్పాయి. పేదోళ్ల కంటి సమస్యలను తీరుస్తున్న సీఎం కేసీఆర్ సారుకు కృతజ్ఞతలు.
– చాకలి జయమ్మ, పట్లూర్, మర్పల్లి మండలం
కంటి అద్దాలు ఇవ్వడం మొదటి సారి..
70 సంవత్సరాలు పైబడిన నాకు కంటి పరీక్షలు చేసి అద్దాలు ఇచ్చారు. ఇప్పటి వరకు గ్రామాల్లో కంటి పరీక్షలు చేసి ఇక్కడే కంటి అద్దాలు ఇవ్వడం మొదటి సారి. గతంలో పట్టణాలకు పేద ప్రజలు వెళ్లలేక మసకబారిన కండ్లతో కాలం గడిపేవాళ్లం. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో కంటి దవాఖానలు లేని లోటును తీర్చి పేదలకు మంచి చూపును అందించేలా కంటి వెలుగును ప్రవేశపెట్టింది.
– అబ్దుల్ సత్తార్, బొంపల్లి గ్రామం, దోమ మండలం
పరీక్షలు చేసి అద్దాలు ఇచ్చిండ్రు..
మాలాంటి పేద మహిళలకు చూపు సరిగ్గా లేక, ప్రైవేటు దవాఖానలకు వెళ్లి చూపించుకునే పరిస్థితి లేదు. ఊరిలోనే కంటి శిబిరం ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించి అద్దాలు, మందులు ఇవ్వడం బాగుంది. నాకు పరీక్షలు చేసి అద్దాలు ఇచ్చిండ్రు. కండ్లు మంచిగా కనిపిస్తున్నయ్. ఇకమీదట ఒకరి సహాయం అవసరం లేకుండా మా పనులు మేమే చేసుకుంటాం.
– బేగరి జంగమ్మ, ఆలూరు, చేవెళ్ల మండలం