శంకర్పల్లి, నవంబర్ 23 : క్షేత్ర స్థాయిలో ప్రజల సమస్యలను తెలుసుకుని, వాటిని పరిష్కరించడానికే శుభోదయం కార్యక్రమాన్ని ప్రారంభించామని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. బుధవారం మండలంలోని కొత్తపల్లి, హుస్సేన్పూర్ గ్రామాల్లో శుభోదయం కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం శంకర్పల్లి మండల పరిషత్ కార్యాలయంలో 37 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు, 12 మందికి కల్యాణలక్ష్మి చెక్కులను పంపీణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని అన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాలకు కొత్త కళ వచ్చిందన్నారు. రైతుల సంక్షేమానికి రైతు బందు, రైతు బీమా వంటి పథకాలను ప్రవేశపెట్టి రైతన్నకు అండగా నిలుస్తున్నారని అన్నారు. అన్ని వర్గాల వారికి సీఎం కేసీఆర్ అండగా నిలుస్తున్నారని అన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రులు అమలు చేయని సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని వివరించారు.
గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలు, స్మశానవాటికలు, డంపింగ్ యార్డులు, రైతు వేదికలతో గ్రామాలు కళ కళ లాడుతున్నాయని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ గోవర్ధన్రెడ్డి, జడ్పీటీసీ గోవిందమ్మ, పీఏసీఎస్ చైర్మన్ శశిధర్రెడ్డి, సర్పంచ్లు శాంతచెన్నయ్య, నర్సింహారెడ్డి, ఇందిరాలక్ష్మణ్, ఎంపీటీసీ శోభ, మున్సిపల్ అధ్యక్షులు గోపాల్, వాసుదేవ్ కన్నా తదితరులు పాల్గొన్నారు.