kalyana lakshmi scheme | పేదింటి ఆడబిడ్డ పెండ్లికి తల్లిదండ్రులు రంది పడొద్దనే ఉద్దేశంతో తెలంగాణ సర్కార్ ‘కల్యాణలక్ష్మి, షాదీముబారక్’ అమలు చేస్తున్నది. దీనిలో భాగంగా ఆడబిడ్డ వివాహానికి రూ.1,00,116 లను ఆర్థిక సాయంగా అందజేస్తూ అండగా నిలుస్తున్నది. అదే దివ్యాంగ అమ్మాయిల వివాహానికైతే రూ.1,25,016ల చొప్పున అందజేస్తున్నది. 2014 అక్టోబర్ 2న ప్రవేశపెట్టిన ఈ పథకంతో ఎంతోమంది పేదలకు మేలు చేకూరింది. రంగారెడ్డి జిల్లాలో ఇప్పటివరకు 11,043 మంది లబ్ధిపొందారు. జిల్లాలో ఏడాదికి సుమారుగా రూ.110.55 కోట్లను ప్రభుత్వం వెచ్చిస్తున్నది. ఆయా సామాజిక వర్గాలకు సంబంధించి కులాంతర వివాహాలు చేసుకుంటే రూ.10 వేల నుంచి రూ.2,50,000 వరకు ప్రోత్సాహకాలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నది.
రంగారెడ్డి, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని పేద (దళిత, గిరిజన, బీసీ, ఓబీసీ కులాలకు చెందిన) యువతుల వివాహాల కోసం రూ.1,00,116 చొప్పున ఆర్థిక సాయం అందించే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టింది. దీని ద్వారా నిరుపేద, మధ్య తరగతి, వెనకబడిన తరగతుల వారి కుటుంబంలో ఆర్థిక దుస్థితిని తగ్గించేందుకు కృషి చేస్తున్నది. జిల్లాలో మొత్తం 11,043 మంది ఈ యేడాదికి గాను లబ్ధిపొందారు. వెనకబడిన తరగతులకు సంబంధించి రూ. 1, 00,116 చొప్పున 3,757 మంది లబ్ధిపొందారు. గిరిజనులు 991 మంది, మైనార్టీస్ 3,212 మంది, కాగా, ఎస్సీలకు సంబంధించి 3,083 మంది లబ్ధిపొందినట్టు తెలుస్తున్నది. దివ్యాంగ ఆడబిడ్డలకు రూ.1,25,016లను ఈ పథకంలో భాగంగా ప్రభుత్వం అందజేస్తున్నది. కులాంతర వివాహాలకు రూ.10వేల నుంచి రూ.2,50,000 వరకు ప్రోత్సాహకాలను ప్రభుత్వం అందిస్తున్నది.
పథకాలతో పెండ్లిపై పెరిగిన అవగాహన
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలతో సమాజానికి పలు రకాలుగా ప్రయోజనాలు కలుగుతున్నాయి. ప్రధానంగా వివాహ వయస్సు, బాల్య వివాహాలు మొదలైన వాటిపై సామాజికంగా అవగాహన పెరుగుతున్నది. ఇంట్లో ఎదుగుతున్న ఆడపిల్ల ఉన్నదంటే.. గుండెల మీద కుంపటిగానే భావించేటోళ్లు. ఇలాంటి పరిస్థితులను రూపుమాపేందుకు సీఎం కేసీఆర్ పేద కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరేలా చర్యలు చేపట్టారు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందేందుకు ఆడపిల్లల తల్లిదండ్రులు వారి పిల్లలకు పెండ్లి చేసేందుకు 18 ఏండ్లు నిండే వరకు ఆగుతున్నారు. అయితే, ఇట్లా చేస్తున్న పెండ్లీలకు చట్ట బద్ధత కూడా లభిస్తున్నది.
ఆడబిడ్డల వివాహాలకు భరోసా..
ఆడబిడ్డల పెండ్లీలు చేసేందుకు ఇబ్బంది పడే ఈ రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వమే లక్ష రూపాయలు సాయం అందించి ఎంతో భరోసానిచ్చింది. ఈ పథకం ద్వారా వచ్చిన డబ్బులతో మా బిడ్డ వివాహానికి చేసిన అప్పు తీర్చాం. ఈ రోజుల్లో పెండ్లి చేయడం అంటే మాటలతో అయ్యే పని కాదు. ఎన్నో వ్యయప్రయాసాలకు ఓర్చి చేయాల్సిన తతంగం.
– కుతాడి జయమ్మ, జాపాల్
సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటం
కల్యాణలక్ష్మి పథకం ద్వారా లక్షా నూట పదహారు రూపాయలు అందించి కొన్ని లక్షల మంది జీవితాల్లో వెలుగులు నింపుతున్న సీఎం కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటా. సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న ఈ పథకం వేరే ఏ రాష్ట్రంలో అమలు చేయడం లేదు. సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం పేదోళ్ల కోసమే పని చేస్తున్నది.
– పులికంటి సంధ్య, ఆమనగల్లు
కష్ట కాలంలో కల్యాణక్ష్మి అందింది
పేద, మధ్య తరగతి కుటుంబాల్లో పెండ్లి అంటేనే చానా కష్టంతో కూడుకున్న కార్యం. సీఎం కేసీఆర్ సారు మా అసువంటోళ్ల గురించి ఆలోచించి ఈ కల్యాణ పథకం తీసుకొచ్చిండు. నా బిడ్డ పెండ్లి చేసేందుకు కల్యాణలక్ష్మి పథకం ద్వారా సాయం అందింది. మా కుటుంబానికి రూ.లక్షా 116ల సాయం చేసి మమ్మల్ని ఆదుకున్నరు. కేసీఆర్ సారు మేలు మరవలేనిది.
– మొగిలి స్వరూప, మంచాల
సీఎం కేసీఆర్ మేనమామై ఆదుకున్నడు..
ఆడబిడ్దల పెండ్లి తల్లిదండ్రులకు భారం కాకూడదనే సీఎం కేసీఆర్ మేనమామలా ఆర్థిక సాయం అందిస్తూ ఆదుకుంటున్నారు. కేసీఆర్ సారు దేశానికి ప్రధానమంత్రి కావాలె. అప్పుడే దేశవ్యాప్తంగా నా లాంటి పేదోళ్లకు మేలు జరుగుతది. నా పెండ్లికి కల్యాణలక్ష్మి సాయం అందడంతో ఆర్థికంగా ఎంతో ఊరటనిచ్చింది. కేసీఆర్ సార్ అందించిన సాయం ఎప్పటికీ మరువలేం.
– వొగ్గు మమత, ఆమనగల్లు