కల్వకుర్తి కాంగ్రెస్లో వర్గపోరు తారాస్థాయికి చేరింది. కొత్తవారికి టికెట్ ఇస్తే సీటుపై ఆశలు వదులుకోవాల్సిందేనని అధిష్టానానికి కడ్తాల్ మండల కాంగ్రెస్ కమిటీ అల్టిమేటం జారీ చేసింది. రాత్రికి రాత్రే కాంగ్రెస్ కండువా కప్పుకున్న కసిరెడ్డి నారాయణరెడ్డికి టికెట్ ఇస్తున్నారనే సమాచారంపై కొంతకాలంగా సుంకిరెడ్డి రాఘవేందర్రెడ్డి వర్గం అగ్గిమీద గుగ్గిలమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కసిరెడ్డికి అనుకూలంగా ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్రెడ్డి, మాజీ ఎంపీ మల్లు రవి మంగళవారం నియోజకవర్గస్థాయి సమావేశాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయగా, ఆ సమావేశానికి తాను రావడం లేదని సుంకిరెడ్డి తేల్చి చెప్పడంతో నేటి సమావేశంపై ఆసక్తి నెలకొన్నది.
సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ)/అమనగల్లు : కల్వకుర్తి కాంగ్రెస్లో వర్గపోరు తారాస్థాయికి చేరుకుంది. కొత్తవారికి టికెట్ ఇవ్వొద్దంటూ నిన్నటివరకు అధిష్ఠానానికి సూచించిన సుంకిరెడ్డి వర్గం.. తాజాగా ఇస్తే కల్వకుర్తి సీటుపై ఆశలు వదులుకోండి! అని అల్టిమేటం జారీ చేశారు. రాత్రికి రాత్రి కాంగ్రెస్ కండువా కప్పుకున్న కసిరెడ్డి నారాయణరెడ్డికి టికెట్ ఇస్తున్నారనే సమాచారంపై కొంతకాలంగా సుంకిరెడ్డి రాఘవేందర్రెడ్డి వర్గం అగ్గిమీద గుగ్గిలం అవుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పలు మండలాల్లో సమావేశాలు నిర్వహిస్తున్న సుంకిరెడ్డి సోమవారం కడ్తాల్లో పార్టీ శ్రేణులతో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో కసిరెడ్డికి అనుకూలంగా ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్రెడ్డి, మాజీ ఎంపీ మల్లు రవి మంగళవారం నియోజకవర్గస్థాయి సమావేశాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. దీంతో తాను ఆ సమావేశానికి రావడం లేదని సుంకిరెడ్డి తేల్చి చెప్పడంతో నేటి సమావేశం ఎలా జరుగుతుందనే దానిపై ఆసక్తి నెలకొంది.
సుంకిరెడ్డిని కాదని..
కల్వకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ టికెట్ ఎన్నారై సుంకిరెడ్డి రాఘవేందర్రెడ్డి ఆశిస్తున్నారు. రేవంత్రెడ్డి వర్గమైన సుంకిరెడ్డి ఏడాదిన్నరగా పార్టీకి పెద్ద దిక్కుగా వస్తున్నారు. ఈ క్రమంలో రేవంత్కు చెక్ పెట్టేందుకు ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్రెడ్డి పావులు కదిపారు. బీఆర్ఎస్లో టికెట్ దక్కని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డిని కాంగ్రెస్లోకి తీసుకువచ్చి టికెట్ రేసులో ఉంచారు. ఈ పరిణామంపై నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు, శ్రేణులు భగ్గుమంటున్నారు. ఏడాదిన్నరగా పార్టీకి సేవ చేసిన సుంకిరెడ్డిని కాదని.. రాత్రికి రాత్రి కండువా కప్పుకున్న కసిరెడ్డికి ఎలా ఇస్తారంటూ ధ్వజమెత్తుతున్నారు. పార్టీ ప్రజాప్రతినిధులు, వివిధ స్థాయిల్లోని నేతలు సహా పెద్ద ఎత్తున కార్యకర్తలు నియోజకవర్గంలో అనేక చోట్ల ఇప్పటికే సమావేశాలు నిర్వహించి, కొత్త వారికి టికెట్ ఇవ్వొద్దంటూ డిమాండ్ చేస్తున్నారు. తాజాగా సోమవారం కడ్తాల్లో మండల కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సమావేశమై, తమ స్వరాన్ని పెంచారు. కొత్తవారికి టికెట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ కల్వకుర్తి స్థానాన్ని కోల్పోవాల్సిందేనని హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా స్వలాభం కోసం రాత్రికి రాత్రి పార్టీ కండువా కప్పుకునే వారికి అధిష్టానం టికెట్ ఎలా ఇస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధిష్టానం కాదు… పార్టీ శ్రేణులు ఎలా నిర్ణయిస్తే అలాగే నడుచుకుంటానంటూ సమావేశానికి హాజరైన సుంకిరెడ్డి కూడా స్పష్టం చేశారు.
నేటి సమావేశంపై ఉత్కంఠ
గత కొన్ని రోజులుగా కసిరెడ్డికి వ్యతిరేకంగా సుంకిరెడ్డి ఆధ్వర్యంలో పలు మండలాల్లో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో తొలిసారిగా మంగళవారం కసిరెడ్డికి మద్దతుగా సమావేశాన్ని నిర్వహించేందుకు వంశీచంద్రెడ్డి ఏర్పాట్లు చేశారు. అయ్యసాగర్ గేటు దగ్గర ఉన్న డీఎంకే ఫంక్షన్ హాల్లో ఉదయం 10.30 గంటలకు నియోజకవర్గస్థాయి సమావేశం ఏర్పాటు చేశామని టీపీసీసీ సభ్యుడు శ్రీనివాస్గౌడ్ పేరిట పార్టీ నేతలకు సమాచారం వచ్చింది. ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్రెడ్డి, మాజీ ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డితో పాటు సుంకిరెడ్డి రాఘవేందర్రెడ్డి కూడా హాజరు కానున్నారని అందులో పేర్కొన్నారు. దీనిపై వెంటనే స్పందించిన సుంకిరెడ్డి హాజరు కావొద్దని నిర్ణయించారు. ఈ మేరకు ఆయన వ్యక్తిగత కార్యదర్శి వెంటనే వాట్సాప్లోనే సమావేశానికి సుంకిరెడ్డి హాజరు కావడం లేదని సమాచారం ఇచ్చారు. దీంతో మంగళవారం నాటి సమావేశం జరిగే తీరుపై ఉత్కంఠ నెలకొంది. సమావేశానికి సుంకిరెడ్డి వర్గం నేతలు, కార్యకర్తలు వస్తారా? ఒకవేళ వస్తే ఏం చేస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది.