తాండూరు, నవంబర్ 29 : కల్తీ అల్లం పేస్ట్ వ్యాపారం గుట్టును తాండూరు పోలీసులు రట్టు చేశారు. పక్కా సమాచారంతో టాస్క్ఫోర్స్ టీంతో దాడులు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేపట్టి ప్రాణాలకు హాని కలిగించే కల్తీ పేస్ట్ వ్యాపారం వివరాలను రాబట్టారు. మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో తాండూరు డీఎస్పీ శేఖర్గౌడ్, సీఐ రాజేందర్రెడ్డి వివరాలను వెల్లడించారు. హైదరాబాద్ హుమాయున్ నగర్లోని ఆసిఫ్నగర్కు చెందిన ఇమ్రాన్ అలీం తాండూరులోని కూరగాయల మార్కెట్లో సయ్యద్ కలీం గోదాంను అద్దెకు తీసుకొని అందులో అల్లం పేస్ట్ వ్యాపారం చేస్తున్నాడు.
తాండూరులో నెల రోజులుగా వ్యాపారం సాగిస్తున్న విషయాన్ని పసిగట్టిన టాస్క్ఫోర్స్ సిబ్బంది ఇటీవల అల్లం పేస్ట్ డబ్బాలను దిగుమతి చేసుకుంటున్న విషయం తెలుసుకొని దాడులు చేశారు. రూ.లక్ష విలువగల 20 క్వింటాళ్ల కల్తీ అల్లం పేస్ట్ డబ్బాలను స్వాధీనం చేసుకొని పోలీస్స్టేషన్కు తరలించారు. కేంద్ర సంస్థ బ్రాండ్తో కల్తీ అల్లం పేస్ట్ను అమ్ముతున్నట్లు గుర్తించారు. కెమికల్తో పాటు మక్కజొన్న పిండితో కల్తీ అల్లం తయారు చేసి అమ్ముతున్నట్లు పోలీసుల విచారణలో నిందితుడు తెలిపినట్లు పోలీసులు తెలిపారు. దీని వెనుక ఉన్న అసలు గుట్టును తెలుసుకునేందుకు ముమ్మరంగా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ప్రజలు కూడా తక్కువ రేట్లకు వస్తున్నాయని ఏవిపడితే అవి కొనరాదని సూచించారు. కొనుగోళ్ల విషయంలో ఎలాంటి అనుమానాలు ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని డీఎస్పీ సూచించారు.