కడ్తాల్ : ఆరోగ్యవంతమైన జీవితానికి మనిషి ప్రతినిత్యం ధ్యానం చేయాల్సిన అవసరమున్నదని ది పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్మెంట్ వ్యవస్థాపకుడు బ్రహ్మర్షి సుభాశ్ పత్రీజీ అన్నారు. మండల కేంద్ర సమీపంలోని కైలాసపురిలో గల మహేశ్వర మహా పిరమిడ్లో జరుగుతున్న మహిళా ధ్యాన మహా సభలు-3 సోమవారం ఏడో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ధ్యానులద్ధేశించి సుభాశ్ పత్రీజీ మాట్లాడుతూ నిత్యం ధ్యాన సాధనతో జ్ఞానం, మానసిక ప్రశాంతా లభిస్తాయని తెలిపారు. ధ్యానమనేది అద్భుతశక్తి అని, స్వార్థచింతన లేకుండా నేర్చుకోవాలనే తపనతో ఎవరైతే జీవిస్తారో ప్రకృతి వారికి అన్ని విధాల సహకరిస్తుందని చెప్పారు.
సమాజంలో ప్రతి ఒక్కరితో ప్రేమ, అప్యాయతతో మెలగాలని, సుగుణాలు కలిగి వారందరూ సమాజంలో మంచి పేరు గడిస్తారని చెప్పారు. ప్రపంచానికి గౌతమ బుద్ధుడు అందించిన సందేశాలను మనమందరం ఆచరించాలన్నారు. అంనతరం సీనియర్ పిరమిడ్ మాస్టర్లు రచించిన పలు అధ్యాత్మిక పుస్తకాలను పత్రీజీ ఆవిష్కరించారు. కార్యక్రమంలో పిరమిడ్ ట్రస్ట్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి, జడ్పీటీసీ దశరథ్నాయక్, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్గుప్తా, ట్రస్ట్ సభ్యులు స్వర్ణమాల, సాంబశివరావు, హనుమంతురాజు పాల్గొన్నారు.