కడ్తాల్ : మండల కేంద్రంలో కొలువైన లక్ష్మీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయాన్ని అందంగా ముస్తాబు చేశారు. ఉత్సవాల్లో భాగంగా ఉదయం స్వామి వారికి ప్రత్యేక పూజలతో పాటు స్వస్తి పుణ్యాహవాచనము, విష్వక్సేన పూజ, అఖండ దీపారాధన, ధ్వజారోహణం, అంకురార్పణ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి వారిని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి దర్శించుకుని, స్థానిక నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్సీని ఆలయ నిర్వాహకులు, నాయకులు శాలువ, పూలమాలతో సన్మానించారు.
ఆలయ అభివృద్ధికి సహకరిస్తానని ఎమ్మెల్సీ పేర్కొన్నారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ఆనంద్, సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి, ఎంపీటీసీ శ్రీనివాస్రెడ్డి, ఉప సర్పంచ్ రామకృష్ణ, ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ ఆంజనేయులు, నాయకులు చెన్నకిషన్రెడ్డి, సురేందర్రెడ్డి, భాస్కర్రెడ్డి, హన్మానాయక్, చందోజీ, శ్రీకాంత్రెడ్డి, ఆలయ అర్చకులు మెళ్లూరి వెంకటేశ్వరశర్మ, తిరునగరి రఘురాం, వేణుగోపాల్, శ్రీధర్, శ్రీమన్నారయణ, భక్తులు పాల్గొన్నారు.