రంగారెడ్డి, మార్చి 27(నమస్తే తెలంగాణ) : లోక్ సభ ఎన్నికల ప్రచారానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిద్ధమవుతున్నారు. షెడ్యూల్ విడుదల కాకముందే కరీంనగర్లో బహిరంగ సభ నిర్వహించి ఎన్నికల శంఖారావాన్ని పూరించిన ఆయన.. ఏప్రిల్ 13న చేవెళ్ల నుంచి ఎన్నికల కదన భేరిని మోగించబోతున్నారు. ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ ముందుకు సాగుతున్నది. ఇందులో భాగంగా ఇప్పటికే పలు దఫాలుగా కేసీఆర్తోపాటు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్రావులు చేవెళ్ల లోక్ సభ పరిధిలోని ముఖ్య నేతలతో సమావేశాలు నిర్వహించారు.
ప్రస్తుతం జిల్లా మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి నేతృత్వంలో నియోజకవర్గ స్థాయిల్లో సన్నాహక సమావేశాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బుధవారం తెలంగాణ భవన్లో కేటీఆర్ చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మాజీ ఎమ్మెల్యేలతో సమావేశాన్ని నిర్వహించారు. వచ్చే నెల 13న చేవెళ్ల నియోజకవర్గంలో కేసీఆర్తో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు కేటీఆర్ ప్రకటించడం పార్టీ శ్రేణుల్లో సమరోత్సాహాన్ని నింపుతున్నది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతూ.. గులాబీ దళాన్ని ఎన్నికలకు సన్నద్ధం చేసేలా.. బీఆర్ఎస్ పార్టీ షెడ్యూల్కు ముందు నుంచే లోక్సభ ఎన్నికల కసరత్తును ప్రారంభించింది. పార్టీ క్యాడర్లో జోష్ నింపి..రానున్న లోక్ సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ అగ్ర నేతలు ప్రణాళికను సిద్ధ్దం చేసి అమలు చేస్తూ వస్తున్నారు. ఈ ఏడాది జనవరిలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్రావులు చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహించారు. పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో చేవెళ్ల పార్లమెంటు పరిధిలోని ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించి ఎన్నికల్లో అనుసరించాల్సిన గెలుపు వ్యూహాలపై సమాలోచనలు చేశారు. అందరి నేతల ఏకాభిప్రాయం మేరకు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన కాసాని జ్ఞానేశ్వర్ పేరును ప్రకటించారు.
అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన మరుసటి రోజు నుంచే నియోజకవర్గాలవారీగా నిర్వహిస్తున్న సమావేశాల్లో కాసాని పాల్గొనడమేకాకుండా ముఖ్య నేతలు, కార్యకర్తలను కలుస్తున్నారు. మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఈ సమావేశాల్లో అన్నీతానై వ్యవహరిస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్లపై విమర్శనాస్ర్తాలు సంధించి పొలిటికల్ హీట్ను పెంచుతూ.. మరోవైపు కార్యకర్తలో సమరోత్సాహాన్ని నింపుతున్నారు. కాసాని గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని పిలుపునిస్తున్నారు. నేతలంతా ఒక్కతాటిపై నిలబడి సమన్వయంతో ముందుకు సాగుతుండడం పార్టీ శ్రేణుల్లోనూ ఉత్సాహాన్ని నింపుతున్నది.
అధికారం, ఆస్తుల కోసమే రంజిత్రెడ్డి కాంగ్రెస్లో చేరి బీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేశారని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. బుధవారం తెలంగాణ భవన్లో చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. బీఆర్ఎస్ను వీడి ఇటీవల కాంగ్రెస్లో చేరిన ఎంపీ రంజిత్రెడ్డిపై కేటీఆర్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ఎంపీగా రంజిత్రెడ్డిని గెలిపించుకున్న తర్వాతనే ఆయన ఎవరో ప్రపంచానికి తెలిసిందన్నారు. 2019 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీలోని ప్రతి కార్యకర్త కష్టపడి రంజిత్రెడ్డిని గెలిపించారని గుర్తు చేశారు. పార్టీలో అత్యధిక ప్రాధాన్యతనిచ్చి, నియోజకవర్గంలో పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని.. అయినప్పటికీ కాంగ్రెస్లో చేరి ద్రోహం చేశారని విమర్శించారు.
తన సోదరి అని చెప్పుకునే కవితను ఈడీ అరెస్టు చేసిన రోజే.. నవ్వుకుంటూ వెళ్లి కాంగ్రెస్లో చేరిన స్వార్థపరుడని రంజిత్రెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రంజిత్రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ ఏం తక్కువ చేసిందని పార్టీని వీడారంటూ తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారన్నారు. గతంలో బీఆర్ఎస్ నుంచి గెలుపొంది పార్టీ మారిన మాజీ ఎంపీ విశ్వేశ్వర్రెడ్డి పరిస్థితి ఏమైందో అందరికీ తెలుసునన్నారు. పార్టీ కన్నా తానే పెద్ద అనే అహంకారం ఉన్న వ్యక్తులు రాజకీయాల్లో గెలవరన్నారు. సీఎం రేవంత్రెడ్డి, రంజిత్రెడ్డి మిలాఖత్ అయినంత మాత్రాన.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో కలిసి పోతారనుకోవడం వారి అజ్ఞానానిని నిదర్శనమన్నారు.
కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్లతోపాటు బీసీల కోసం దశాబ్దాలుగా అండగా నిలబడిన గొప్ప వ్యక్తి అని కేటీఆర్ పొగిడారు. ఓవైపు బీసీల కోసం పాటుపడుతూనే మరోవైపు అన్ని సామాజిక వర్గాలను, మైనార్టీలను కలుపుకొనిపోయిన మంచి వ్యక్తి కాసాని అని పేర్కొన్నారు. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో తీవ్రమైన అయోమయం నెలకొన్నదని, చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీకి కనీసం అభ్యరి కూడా దొరకలేదన్నారు. సొంతంగా అభ్యర్థులు కరువైన కాంగ్రెస్ పారీక్టి చేవెళ్ల, మల్కాజిగిరి, సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో గెలవడం అసాధ్యమన్నారు. చేవెళ్లలో కాసానిని అత్యధిక మెజార్టీతో గెలిపించి హ్యాట్రిక్ కొట్టాలని పిలుపునిచ్చారు.
సామాజిక సమీకరణాల రీత్యా కాసాని గెలుపు సులభం అవుతుందన్న విశ్వాసాన్ని సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు కేటీఆర్ వద్ద ప్రస్తావించినట్లు తెలిసింది. సమావేశంలో మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి, చేవెళ్ల పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, ఎమ్మెల్యేలు ప్రకాశ్గౌడ్, అరికపూడి గాంధీ, ఎమ్మెల్సీలు వాణీదేవి, ఎగ్గే మల్లేశం, బొగ్గారపు దయానంద్, మాజీ ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, పైలెట్ రోహిత్ రెడ్డి, కొప్పుల మహేశ్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ కృష్ణారెడ్డి, రాష్ట్ర నాయకులు కార్తీక్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.