తాండూరు, సెప్టెంబర్ 12 : గ్రామీణ స్థాయి విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన విద్యను అందించే ప్రక్రియలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తాండూరు నియోజకవర్గంలోని బషీరాబాద్ మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలను మంజూరు చేస్తూ మంగళవారం జీవోను జారీ చేసింది. ప్రస్తుతం బషీరాబాద్ మండల పరిధిలోని విద్యార్థులు తాండూరుకు ఇంటర్ చదివేందుకు వెళ్తున్నారు. ఇది గమనించిన ఎమ్మెల్యే రోహిత్రెడ్డి ప్రత్యేక చొరవతో మంత్రి సబితారెడ్డి సహకారంతో సీఎం కేసీఆర్కు విన్నవించగా బషీరాబాద్కు ప్రభుత్వ జూనియర్ కళాశాలను మంజూరు చేశారు. కళాశాల నిర్మాణానికి రూ.7 కోట్ల 13 లక్షల 52 వేల నిధులను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవోను జారీ చేసింది. దీంతో బషీరాబాద్ మండల పరిధిలోని గ్రామాల ప్రజలు, విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీతో పాటు పలు కోర్సులను వచ్చే విద్యా సంవత్సరం నుంచే ప్రారంభించేందుకు కళాశాల భవన నిర్మాణ పనులకు వెంటనే ప్రారంభించి పూర్తి చేయనున్నట్లు ఎమ్మెల్యే రోహిత్రెడ్డి తెలిపారు. వెనుకబడిన మారుమూల బషీరాబాద్ మండలానికి జూనియర్ కళాశాలను మంజూరు చేసినందుకు
సీఎం కేసీఆర్, మంత్రి సబితారెడ్డికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.