రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలకు ఉమ్మడి జిల్లా ముస్తాబైంది. బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు పార్టీ అధినేత జన్మదినాన్ని ఘనంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు. ఆయా నియోజకవర్గాల్లో సార్ బర్త్డే సంబురాలను అదిరిపోయేలా నిర్వహించేందుకు ఎమ్మెల్యేలు పార్టీ శ్రేణులను సిద్ధం చేశారు. వేడుకల్లో భాగంగా రక్తదాన శిబిరాలు, పండ్ల పంపిణీ, మొక్కలు నాటడం, బైక్ ర్యాలీలు, దేవాలయాల్లో పూజలు, చర్చిలు, దర్గాల్లో ప్రార్థనలు వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
వికారాబాద్, తాండూరు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, పైలట్ రోహిత్రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేయనున్నారు. చేవెళ్ల నియోజకవర్గంలోని షాబాద్ మండల కేంద్రంలో స్థానిక జడ్పీటీసీ పట్నం అవినాశ్రెడ్డి ఆధ్వర్యంలో జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, ఎంపీ గడ్డం రంజిత్రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్యలు వికలాంగులకు స్కూటీలు పంపిణీ చేయనున్నారు.
షాద్నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేస్తున్న రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ప్రారంభించనున్నారు. ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు నియోజకవర్గాల పరిధిలోని ఆయా మండలాల్లో ఎమ్మెల్యేలు కిషన్రెడ్డి, జైపాల్యాదవ్ ఆధ్వర్యంలో సీఎం జన్మదిన వేడుకలు నిర్వహించనున్నారు.