ఆదర్శ పాఠశాలల్లో విద్యార్థులకు చదువుతోపాటు
వృత్తి విద్యాకోర్సుల్లో శిక్షణ
కులకచర్ల, జూలై 14: సీఎం కేసీఆర్ ప్రభుత్వం విద్యారంగాభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నది. అందులో భాగంగానే కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యనందించేందుకు చర్యలు చేపట్టింది. ప్రత్యేకంగా గురుకులాలు, ఆదర్శ పాఠశాలలను ఏర్పా టు చేసి విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్నది. దీనికితోడు ప్రభుత్వ బడుల రూపురేఖలను పూర్తిగా మార్చేందుకు మన ఊరు-మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిం ది. ఇందుకోసం కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తూ అన్ని రకాల మౌలిక వసతులను కల్పిస్తున్నది. తద్వారా సర్కారు పాఠశాలల్లో చదివే విద్యార్థులు కూడా కార్పొరేట్ బడులకు దీటుగా రాణించేలా చర్యలు చేపట్టింది.
కాగా ప్రభుత్వం ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశపెట్టిన వృత్తివిద్యాకోర్సుల ద్వారా విద్యార్థులకు భవిష్యత్తులో ఎంతో మేలు జరుగనున్నది. ప్రస్తు త పోటీ ప్రపంచంలో చదువుతోపాటు వృత్తివిద్యా కోర్సులను కింది స్థాయి తరగతుల నుంచి నేర్చుకోవడం ద్వారా విద్యార్థుల భవిష్యత్ బంగారు బాట కానున్నది. ఆదర్శ పాఠశాలల్లో బ్యాంకింగ్, బీమా, సౌందర్యం(బ్యుటీషియన్), ఐటీ, వ్యవసాయం, యానిమేషన్, మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్, రిటైల్, అగ్రికల్చర్, హెల్త్కేర్ తదితర వృత్తివిద్యా కోర్సులు ఉండగా.. అన్ని ఆదర్శ పాఠశాలల్లో అన్ని కోర్సులకు శిక్షణ ఇవ్వడంలేదు. కొన్ని స్కూళ్లలో కొన్ని కోర్సులను మాత్రమే నిర్వహిస్తున్నారు. గతంలో ఈ కోర్సులను ఇంటర్ విద్యార్థులకు మాత్రమే నేర్పించగా.. ప్రస్తుతం 9, 10, ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. ఈ కోర్సుల్లో శిక్షణ ను తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్ వరకు నాలుగు దశల్లో నేర్పిస్తారు. ఇంటర్ పూర్తయిన తర్వాత విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం నుంచి సర్టిఫికెట్లను అందజేస్తారు.
ఆదర్శ పాఠశాలల్లో ఇలా..
ఆదర్శ పాఠశాలల్లో 9, 10, ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన ఆంగ్ల మాధ్యమంలో బోధనతోపాటు వృత్తి విద్యాకోర్సుల్లోనూ విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. ఇందుకోసం సర్వశిక్షా అభియాన్ నుంచి ఉపాధ్యాయులను నియమించారు. వారు విద్యార్థులకు బ్యాంకింగ్, బీమా, సౌం ద ర్యం, ఐటీ, వ్యవసాయం, యానిమేషన్ తదితర వృత్తివిద్యా కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు. ప్రస్తుతం రిటైల్, యానిమేషన్ పూర్తి చేసిన వారికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. వారికి పేరొందిన కంపెనీల్లో ఉద్యోగాలు లభిస్తున్నాయి. డిజిటల్ పిక్చర్స్, సంచార ప్రసా ర మాధ్యమాల్లో యానిమేషన్కు ఎంతో డిమాండ్ ఉన్నది. ప్రతిరోజూ విద్యార్థులకు ఉపాధ్యాయులు కోర్సును బట్టి శిక్షణ ఇస్తున్నారు.
ముజాహిద్పూర్ మోడల్స్కూల్లో…
మండలంలోని ముజాహిద్పూర్ ఆదర్శ పాఠశాలలోని తొమ్మి ది, పది, ఇంటర్ చదివే విద్యార్థులకు బ్యూటీపార్లర్, బ్యాంకిం గ్ రంగంపై శిక్షణ ఇస్తున్నారు. ఈ శిక్షణను విద్యార్థులు చదువుతూనే పూర్తి చేయొచ్చు. ఆసక్తి ఉన్న విద్యార్థులకు ఉపాధ్యాయులు ప్రతిరోజూ శిక్షణ ఇస్తున్నారు. దీని ద్వారా వారు భవి ష్యత్తులో సొంతంగా ఉపాధి మార్గాన్ని ఏర్పాటు చేసు కోవచ్చు. ఇతరులకు కూడా ఉపాధిని చూపించొచ్చు.
బ్యుటీషియన్ కోర్సు నేర్చుకుంటున్నా..
వృత్తి విద్యాకోర్సుల్లో భాగంగా మా పాఠశాలలో బ్యుటీషియన్ కోర్సును నేర్చుకుంటున్నా. తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్ చదివే విద్యార్థులకు మా బడిలో బ్యుటీషియన్, బ్యాంకింగ్ రంగంలోని మెళకువలపై ఉపాధ్యాయులు శిక్షణ ఇస్తున్నారు. ఈ కోర్సును బాగా నేర్చుకుంటా.
–మాధవి, టెన్త్ విద్యార్థిని, మోడల్ స్కూల్ ముజాహిద్పూర్
శిక్షణతో మంచి భవిష్యత్తు..
ప్రభుత్వం విద్యార్థులకు విద్యతోపాటు వృత్తివిద్యా కోర్సుల్లో శిక్షణ ఇవ్వడం ద్వారా భవిష్యత్తులో వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. మా స్కూల్లో తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్ చదివే విద్యార్థులకు బ్యూటీపార్లర్, బ్యాంకింగ్ రంగంలో తీసుకోవాల్సిన మెళకువలపై ఉపాధ్యాయులు ప్రతిరోజూ శిక్షణ ఇస్తున్నారు.
–భాగ్యలక్ష్మి, ప్రిన్సిపాల్, ముజాహిద్పూర్ మోడల్ స్కూల్