కొడంగల్, నవంబర్ 14: మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వం.. కేసీఆర్ హైట్రిక్ సీఎం అవడం ఖాయమని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాలు, గనులు, భూగర్భ వనరుల శాఖల మంత్రి మహేందర్రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలో మండల పరిధిలోని బూత్ల వారీగా బీఆర్ఎస్ నాయకులు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి పట్నం నరేందర్రెడ్డి ప్రజల మధ్య ఉంటూ, ప్రజా సంక్షేమానికి ఎంతో కృషి చేసినట్లు తెలిపారు. ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించుకునేందుకు కలిసికట్టుగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. పట్నం నరేందర్రెడ్డి ఆధ్వర్యంలోనే నియోజకవర్గం అభివృద్ధి చెందినట్లు పేర్కొన్నారు. గడిచిన 5 సంవత్సరాల్లో రెండు సంవత్సరాలు పూర్తిగా కరోనా మహ్మరితో అభివృద్ధి నిలిచిపోయిందని, మిగిలిన 3 సంవత్సరాల్లోనే ఇంత పెద్దస్థాయిలో అభివృద్ధి చేసిన ఘనత ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డికే దక్కుతుందన్నారు. కాంగ్రెస్ 50 సంవత్సరాల పాలనలో అభివృద్ధి ఏవిధంగా ఉండేదో.. నేడు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు. రేవంత్రెడ్డి అధికారాన్ని దక్కించుకోవాలనే ఉద్దేశంతో అడ్డదారులు తొక్కుతూ.. ప్రజలను మరోమారు మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు 6 గ్యారెంటీలు అమలు చేస్తామంటే ప్రజలకు నమ్మకం లేదన్నారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలతో ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి చేరువైయ్యారని, వారిని మభ్యపెట్టి కాంగ్రెస్ వైపు తిప్పుకోవాలనే దురుద్దేశంతో 6 గ్యారెంటీలను ప్రకటించినట్లు పేర్కొన్నారు. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ పార్టీ.. సీఎం కేసీఆర్రే ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. కొడంగల్ నియోజకవర్గం ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డితోనే అభివృద్ధి అవుతుందన్నారు. ప్రతి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు వారి వారి గ్రామాల్లోనే ఉంటూ, బూత్ల వారీగా ప్రచారాన్ని నిర్వహించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కొడంగల్ ఎన్నికల ఇన్చార్జి నర్సింగ్రావుతో పాటు బీఆర్ఎస్ నాయకులు మధుసూదన్రావు యాదవ్, కృష్ణ, సిద్దిలింగప్ప, రమేశ్బాబు, ముక్తార్లతో పాటు ఆయా గ్రామాల సర్పంచ్లు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దామోదర్రెడ్డి పాల్గొన్నారు.