వికారాబాద్, అక్టోబర్ 10, (నమస్తే తెలంగాణ): జిల్లా ఏర్పాటై నేటితో ఏడేండ్లు పూర్తి చేసుకొని ఎనిమిదో వసంతంలోకి అడుగుపడింది. ముఖ్యమంత్రి కేసీఆర్ చిన్న జిల్లాలతోనే సత్వర అభివృద్ధి సాధ్యమని 2016 అక్టోబర్ 11న కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. జిల్లా ఏర్పాటు చేయాలనే వికారాబాద్ జిల్లా ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన సీఎం కేసీఆర్.., ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే జిల్లాలో గడిచిన ఏడేండ్ల కాలంలో కనీవినీ ఎరుగని అభివృద్ధికిగాను తోడ్పాటునందించారు. పూర్తిగా గ్రామీణ ప్రాంతంతో కూడిన వెనుకబడిన జిల్లాను సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో ప్రగతిపథంలో పయనించేలా చేశారు. ఉమ్మడి జిల్లాలో కలెక్టర్తోపాటు ఇతర జిల్లా అధికారులకు ప్రజలు తమ సమస్యలను విన్నవించుకునేందుకు వెళ్లి రావాలంటే ఒకరోజు సమయం పట్టేది, జిల్లా ఏర్పాటు అనంతరం ప్రభుత్వం అమలుచేస్తున్న పలు కార్యక్రమాలతో జిల్లా కలెక్టర్తోపాటు ఇతర జిల్లా అధికారులందరూ నిత్యం క్షేత్రస్థాయిలోనే అందుబాటులో ఉంటూ ప్రజాసమస్యలకు పరిష్కారం చూపుతున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఏమాత్రం అభివృద్ధికి నోచుకోని వికారాబాద్ ప్రాంతం జిల్లాగా ఏర్పాటైన అనంతరం జిల్లా అంతటా ఎంతో ప్రగతి జరిగింది. జిల్లాకు వివిధ అభివృద్ధి పనులకుగాను ప్రభుత్వం దాదాపు రూ.5వేల కోట్ల వరకు నిధులను విడుదల చేసింది. మెజార్టీ గ్రామ పంచాయతీలకు రోడ్లులేని పరిస్థితి నుంచి ప్రతి గ్రామానికి రోడ్లను నిర్మించడంతోపాటు పంచాయతీ నుంచి మండల కేంద్రాలకు, మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రానికి లింక్ రోడ్ల ఏర్పాటు చేశారు. మోమిన్పేట్ మండలంలో ఏర్పాటు చేస్తున్న ఎలక్ట్రానిక్ వాహనాల విడిభాగాల తయారీ యూనిట్ అయిన మొబిలిటీ వ్యాలీ జిల్లాకు మణిహారంగా మారనున్నది. మరోవైపు పేద ప్రజలకు సత్వర వైద్య సేవలందించాలనే ఉద్దేశంతో జిల్లాకు ప్రభుత్వ వైద్య కాలేజీని మంజూరు చేసి అందుబాటులోకి తీసుకురావడంతోపాటు ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ, ఆయుష్ ఆసుపత్రిని, క్యాన్సర్ బాధితులకు చికిత్స అందించేందుకుగాను పాలియేటివ్ కేర్ కేంద్రాన్ని మంజూరు చేసింది. మాతాశిశు సంరక్షణ దవాఖానతోపాటు మున్సిపాలిటీల్లో బస్తీ దవాఖానలు, గ్రామ పంచాయతీల్లో పల్లె దవాఖానలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చి పేదలకు వైద్య సేవలందిస్తున్నారు.
ప్రజలకు చేరువైన పాలన..
కొత్త జిల్లాల ఏర్పాటుతో పాలనను ప్రజలకు మరింత చేరువ చేసేందుకుగాను ప్రతి జిల్లాకు ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లను నిర్మించి అందుబాటులోకి తీసుకువచ్చారు. రూ.60 కోట్లతో 33 ఎకరాల్లో నూతన కలెక్టరేట్ను నిర్మించింది. ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ నిర్మాణం, చిన్న జిల్లాల ఏర్పాటుతో పాలన ప్రజల ముంగిటకు చేరింది. ఉమ్మడి జిల్లాలో కలెక్టర్కు తమ సమస్యలు విన్నవించాలంటే కేవలం సోమవారం ప్రజావాణి వేదికగానే ప్రజలు సమస్యలను విన్నవించుకునేవారు, అయితే చిన్న జిల్లాలను ఏర్పాటు చేసిన అనంతరం అధికారులు క్షేత్రస్థాయిలో అధిక సమయం కేటాయించే విధంగా ప్రభుత్వం సరికొత్త అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపడుతుంది. కలెక్టర్తోపాటు మరో ఇద్దరు అదనపు కలెక్టర్లను నియమించడంతో ప్రజలు నేరుగా వెళ్లి జిల్లా ఉన్నతాధికారులకు తమ సమస్యలను తెలుపుతున్నారు. దీంతో త్వరితగతిన సమస్యలు పరిష్కారమవుతున్నాయి. ప్రస్తుతం కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఇతర శాఖల అధికారులు, ఆర్డీవోలు, తహసీల్దార్లు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటుండడంతో ప్రజలకు సత్వర న్యాయం జరుగుతుంది.
జిల్లాకు మొబిలిటీ వ్యాలీ..
రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో అతిపెద్ద ప్రాజెక్టు జిల్లాలో ఏర్పాటు కానుంది. మోమిన్పేట్ మండలం ఎన్కతలలో ఏర్పాటు చేసే మొబిలిటీ వ్యాలీ జిల్లాకు మణిహారంగా మారనుంది. మొబిలిటీ వ్యాలీ ఏర్పాటుతో వెనుకబడిన వికారాబాద్ జిల్లాలో అభివృద్ధి పరుగులు పెట్టనుంది. ఎలక్ట్రిక్ వాహనాలతోపాటు వాహనాల విడి భాగాల తయారీ యూనిట్లతో కూడిన మొబిలిటీ వ్యాలీ ప్రాజెక్టుతో జిల్లా రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి. రానున్న ఐదేండ్లలో 50 వేల కోట్ల పెట్టుబడులతోపాటు 4 లక్షల మందికి ఉద్యోగాలను కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది. జిల్లా కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేయనున్న మొబిలిటీ వ్యాలీ ప్రాజెక్టుతో మోమిన్పేట, నవాబుపేట మండలాలతోపాటు వికారాబాద్ జిల్లా కేంద్రం వరకు అభివృద్ధి విస్తరించనున్నది.
జిల్లాకు ప్రభుత్వ మెడికల్ కాలేజీ..
జిల్లాకు ప్రభుత్వ వైద్య కళాశాల మంజూరు చేయగా, గతనెల 100 సీట్లతో జిల్లాకు ప్రభుత్వ మెడికల్ కాలేజీ తరగతులు ప్రారంభమయ్యాయి. శాశ్వత మెడికల్ కాలేజీ నిర్మాణం, దవాఖాన అప్గ్రేడింగ్, పరికరాలు, ఫర్నీచర్ కొనుగోలుకుగాను రూ.235 కోట్లను ప్రభుత్వం నిధులిచ్చింది. అదేవిధంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలంటే 380 పడకల అనుబంధ దవాఖాన ముందుగా అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంటుంది కాబట్టి వికారాబాద్లో 100 పడకల సివిల్ దవాఖానను 380 పడకలతో మెడికల్ కాలేజీ రూ.30 కోట్ల నిధులతో నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. అదేవిధంగా జిల్లాకు ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ, ఆయుష్ దవాఖాన మంజూరు చేయగా, తాండూరులో కాలేజీ భవన నిర్మాణానికి, వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఆయుష్ దవాఖాన భవన నిర్మా ణ పనులు కొనసాగుతున్నాయి.
రోడ్ల అభివృద్ధికి భారీగా నిధులు..
జిల్లాలోని ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ రోడ్ల అభివృద్ధికిగాను రూ.1500 కోట్లపైగా ప్రభుత్వం నిధులిచ్చింది. నాలుగు లేన్ల రోడ్లతోపాటు రహదారుల మరమ్మత్తులు, రెండు లేన్ల రోడ్డును నాలుగు లేన్లకు పెంచడం, మండలాల నుంచి జిల్లా కేంద్రాలకు రోడ్లు, సింగిల్ లేన్-రెండు లేన్ల రోడ్లకు, బ్రిడ్జిల నిర్మాణానికి, రోడ్డు ఓవర్ బ్రిడ్జి, రోడ్డు అండర్ బ్రిడ్జి నిర్మాణాలకుగాను ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులను విడుదల చేసింది. ఇప్పటివరకు ఆర్అండ్బీ రహదారుల నిర్మాణాలు, మరమ్మతులకుగాను ప్రభుత్వం రూ.800 కోట్లపైనే నిధులను మంజూరు చేయడం గమనార్హం. పంచాయతీరాజ్ రోడ్ల నిర్మాణానికిగాను మరో రూ.600 కోట్లకుపైగా ప్రభుత్వం నిధులిచ్చింది. రోడ్ల మరమ్మత్తులకుగాను ఇప్పటివరకు జిల్లాకు రూ.250 కోట్లపైనే నిధులను మంజూరు చేసింది.
కొత్త మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు…
పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా జిల్లాలో కొత్తగా గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జిల్లాలో రెండు మున్సిపాలిటీలుండగా, ప్రస్తుతం వికారాబాద్, తాండూరుతోపాటు పరిగి, కొడంగల్ను కొత్త మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేశారు. అదేవిధంగా పెద్ద మండలంగా ఉన్న బంట్వారం మండలాన్ని విభజించి కోట్పల్లి మండలాన్ని ఏర్పాటు చేశారు. జిల్లాలో 367 పంచాయతీలుండగా తండాలతో పాటు మరికొన్ని అనుబంధ గ్రామాలను పంచాయతీలుగా ఏర్పాటు చేయడంతో పంచాయతీల సంఖ్య 566కు పెరిగింది.
రూ.1530 కోట్ల పెట్టుబడులు..
జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుతో రూ.1530 కోట్ల పెట్టుబడులు పరిశ్రమల ఏర్పాటు నిమిత్తం పెట్టుబడులు పెట్టారు. ఇందులో సోలార్, పవన విద్యుత్ పరిశ్రమల ఏర్పాటుతో రూ.1000 కోట్ల పెట్టుబడులు పెట్టగా, మిగతా చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటుతో రూ.500 కోట్లకుపైగా పెట్టుబడులు వచ్చాయి. అయితే జిల్లాలో ప్రధానంగా పవర్, ఫార్మా రిసైక్లింగ్, ఐరన్, ప్లాస్టిక్, గ్లాస్, మైనింగ్, పర్యాటక రంగం, విత్తనోత్పత్తి పరిశ్రమలను ఏర్పాటు చేశారు. జిల్లాలోని నవాబుపేట్ మండలం అర్కతల, తాండూర్ మండలం జిన్గుర్తిలో ఫుడ్ ఇండస్ట్రీయల్ పార్కులను మంజూరు చేయగా, టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి.
ప్రత్యేక జిల్లా ప్రగతిలో మేటి
1990 నుంచి వికారాబాద్ కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయాలన్నది ప్రజల ఆకాంక్ష. మూడు దశాబ్దాల కిందే జిల్లా కేంద్రం ఏర్పాటు చేయాలని పెద్ద ఎత్తున ఉద్యమం కొనసాగింది. అప్పటి పాలకులు ప్రత్యేక జిల్లా ఏర్పాటును పట్టించుకోలేదు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కొత్త జిల్లా ఏర్పాటుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ చూపడంతో 11 అక్టోబర్ 2016లో వికారాబాద్ ప్రత్యేక జిల్లా ఏర్పడింది. దీంతో అన్నిరంగాల్లో వికారాబాద్ జిల్లా అభివృద్ధి చెందుతూ ప్రగతిలో మేటిగా మారింది. ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్న కలెక్టరెట్ వికారాబాద్కు రావడంతో పాటు పరిపాలన వ్యవస్థ అంత ఒకే చోట ఉండడంతో ప్రజలకు ఇబ్బందులు తొలిగాయి. ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారుల పర్యవేక్షణ సౌలభ్యంగా మారింది. పాలన సజావుగా సాగి గ్రామాలు, పట్టణాలు బాగుపడుతున్నాయి. తెలంగాణ వచ్చాక కేసీఆర్ సారథ్యంలో నూతన వికారాబాద్ జిల్లా ఏర్పాటు చేయడం చాల సంతోషంగా ఉన్నది.
– జొన్నల బస్వరాజ్, విశ్రాంత ఉపాధ్యాయుడు, తాండూరు.
ఇబ్బందులు తొలిగాయి
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో తాండూరు నియోజకవర్గం వెనుక బడినదిగా ఉండేది. నిధులు అంతంతమాత్రంగానే వచ్చేవి. కొత్త జిల్లా ఏర్పాటుతో తాండూరు నియోజకవర్గానికి వికారాబాద్ జిల్లా కేంద్రం దగ్గరైంది. వివిధ శాఖల పరంగా పరిపాలన సులభమైంది. ప్రజలు ఉన్నతాధికారులను కలిసి సమస్యలను చెప్పుకునేందుకు వీలుగా మారింది. ఎన్నో ఏండ్ల ఆకాంక్షను నెరవేర్చిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు. జిల్లా ఏర్పాటు తర్వాత యువత, ప్రజల డిమాండ్ మేరకు జోగులాంబ జోన్లో ఉన్న వికారాబాద్ను చార్మినార్ జోన్లో చేర్చడంతో జిల్లా ప్రజలకు, నిరుద్యోగులకు ఎంతో మేలు జరిగింది.
– కందుకూరి రాజ్కుమార్, బీసీ సంఘం నాయకుడు, తాండూరు