సీఎం కేసీఆర్ సుపరిపాలనలో ఇంటింటికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, భూగర్భ గనులు, సమాచార శాఖల మంత్రి పట్నం మహేందర్రెడ్డి అన్నారు. సోమవారం వారు జడ్పీ చైర్ పర్సన్ అనితారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి చేవెళ్ల మండలంలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ మహనీయుల ఆశయ సాధనకు అనుగుణంగా సీఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నారన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో జిల్లాకు సాగునీరందించనున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమన్నారు. చేవెళ్ల నియోజకవర్గం ప్రగతికి మారుపేరుగా నిలుస్తున్నదన్నారు. పల్లెలు, పట్టణాలు పచ్చదనం, పరిశుభ్రత, మౌలిక వసతులతో కళకళలాడుతున్నాయన్నారు. కాలె యాదయ్యను మరోసారి చేవెళ్ల ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.
-చేవెళ్ల రూరల్/ చేవెళ్ల టౌన్, ఆగస్టు 28
చేవెళ్ల రూరల్/చేవెళ్ల టౌన్, ఆగస్టు 28 : మహనీయుల ఆశయ సాధనకు కృషి చేయాలని, మహనీయుల స్ఫూర్తి గొప్పదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల పరిధిలోని రావులపల్లి గ్రామంలో సోమవారం మహనీయులు అంబేద్కర్, ఛత్రపతి శివాజీ, మహాత్మాగాంధీ, స్వామి వివేకానంద, సుభాష్ చంద్రబోస్ విగ్రహాల ఆవిష్కరణ, రూ.10 లక్షలతో ఓపెన్ డ్రైన్, రూ.45 లక్షలతో సీసీ రోడ్లు నిర్మాణం, రూ.12.60 లక్షలతో వైకుంఠధామం, మల్లారెడ్డిగూడ గ్రామంలో నూతన అంగన్వాడీ భవనం, నూతన గ్రామ పంచాయతీ భవన ప్రారంభోత్సవాలను మంత్రులు సబితారెడ్డి, మహేందర్రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై జడ్పీ చైర్ పర్సన్ అనితారెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి పారంభించారు. అనంతరం మంత్రి మహేందర్రెడ్డి ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి చేవెళ్లలో రూ.కోటీ80 లక్షలతో గ్రంథాలయ భవన నిర్మాణం, సింగప్పగూడ గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ.. మహనీయుల యాదిలో రావులపల్లి గ్రామం నిర్మితమవుతుండడం ఎంతో గొప్ప విషయమని పేర్కొన్నారు. చేవెళ్ల నియోజకవర్గ అభివృద్ధిలో స్వర్గీయ ఇంద్రారెడ్డి చెరగని ముద్ర వేసారని, నియోజకవర్గంలోని షాబాద్, శంకర్పల్లిలో ఏర్పాటవుతున్న కంపెనీల్లో స్థానికులకు పెద్దఎత్తున ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. కాళేశ్వరంలాగే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ను ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తి చేసి నీరు అందిస్తారని తెలిపారు. తెలంగాణలో సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేని విధంగా పేదలకు అందుతున్నాయని అన్నారు. చేవెళ్ల అభివృద్ధికి మారుపేరుగా నిలిచిన ఎమ్మెల్యే కాలె యాదయ్యను మరోమారు ప్రజలు ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు.
కార్యక్రమాల్లో డీసీఎంఎస్ చైర్మన్ కృష్ణారెడ్డి, ఎంపీపీ విజయలక్ష్మి, జడ్పీటీసీ మాలతి, వైస్ ఎంపీపీ శివప్రసాద్, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, డైరెక్టర్ నక్షత్రం, కార్యదర్శి మనోజ్, సర్పంచ్లు శ్రీనివాస్, మోహన్రెడ్డి, శైలజ, రహీమా బేగం, చేవెళ్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకట రంగారెడ్డి, ఈఈ కుమార్ గౌడ్, డీఈ జగన్రెడ్డి, తహసీల్దార్ కృష్ణ, ఎంపీవో విఠలేశ్వర్జీ, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ప్రభాకర్, బీసీ సెల్ మండల అధ్యక్షుడు రాములు, ముడిమ్యాల్ పీఏసీఎస్ చైర్మన్ ప్రతాప్రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కృష్ణారెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచ్లు మాణిక్యారెడ్డి, నరహరిరెడ్డి, మల్లారెడ్డి, ఎంపీడీవో హి మబిందు, బీఆర్ఎస్ నాయకులు నర్సింహులు, రమేశ్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని మంత్రి మహేందర్రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ హయాంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నదని, ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని తెలిపారు. అందుకు రావులపల్లి గ్రామమే నిదర్శనమని పేర్కొన్నారు. గతంలో లేనివిధంగా పల్లెల్లో అభివృద్ధి కనువిందు చేస్తున్నదన్నారు. చిన్న గ్రామ పంచాయతీలు కూడా అభివృద్ధి చెందాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేశారన్నారు. పార్టీలకు అతీతంగా స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. సింగప్పగూడ గ్రామంలో ఉన్న విద్యుత్ సమస్య పరిష్కారానికి తాను స్వయంగా సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తానన్నారు. సీసీ రోడ్ల నిర్మాణానికి సహకారమందించి ప్రజలకు సౌకర్యాలు కల్పించే దిశగా ముందుకు సాగుతామన్నారు.
అన్ని వర్గాల సంక్షేమానికి కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని జడ్పీ చైర్ పర్సన్ తీగల అనితారెడ్డి అన్నారు. ప్రజా సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉండి గ్రామాలను అభివృద్ధి బాటలో నడిపించేందుకు అధిక నిధులు మంజూరు చేస్తున్నదని పేర్కొన్నారు. గత ప్రభుత్వాల హయాంలో ఎన్నో సమస్యలు ఉండేవని.. ప్రస్తుతం సమస్యలు లేకుండా ప్రజలకు అన్ని విధాలుగా సదుపాయాలు కల్పిస్తున్న ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమన్నారు. మహిళలకు రుణాలు, డ్వాక్రా భవనాల నిర్మాణాలు చేపట్టి మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం ముందుకు సాగుతున్నదన్నారు.
అన్ని వర్గాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. నియోజకవర్గవ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు ఇబ్బందులను తొలగిస్తున్నామని పేర్కొన్నారు. రావులపల్లి గ్రామ ప్రధాన రోడ్డు నిర్మాణంపై ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి నిధుల మంజూరుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేదలను ఆదుకుంటున్నారన్నారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రతి ఒక్కరూ అండగా నిలువాలన్నారు. గ్రామాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేసి ప్రజల ఇబ్బందులను తొలగిస్తానన్నారు.