షాబాద్ : ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ రాష్ట్ర అవార్డుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రంగారెడ్డి జిల్లా చేనేత, జౌళిశాఖ సహాయ సంచాలకులు ఇందిర శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 07-08-2022న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేనేత కళాకారులకు కొండా లక్ష్మణ్ బాపూజీ రాష్ట్ర అవార్డులను ఔత్సాహికుల నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ అవార్డు చేనేత కళాకారులకు, చేనేత డిజైనర్లకు, ప్రత్యేకతల ఆధారంగా ఇవ్వడం జరుగుతుందన్నారు. చేనేత కళాకారులకి 31-12-2021 నాటికి 30 సంవత్సరాలు వయస్సు నిండిన వారు, చేనేత రంగంలో 10 సంవత్సరాలకు తగ్గకుండా అనుభవం కలిగి ఉండాలన్నారు.
చేనేత డిజైనర్స్ 31-12-2021 నాటికి 25 సంవత్సరాలు వయస్సు నిండిన వారు, చేనేత డిజైన్ల రంగంలో 5 సంవత్సరాలు తగ్గకుండా అనుభవం కలిగి ఉండాలని చెప్పారు. అర్హత కలిగిన ఔత్సాహికులు నిర్ణీత దరఖాస్తును నింపి 15-03-2022లోపు తమ కార్యాలయంలో అందజేస్తే, మీరు మగ్గంపై తయారు చేసే ఉత్పత్తి తేది 11-04-2022 నాటికి తనిఖీ చేయడం జరుగుతుందన్నారు. అదే విధంగా వారి నైపుణ్యతను చాటే నమూనాలను, శాంపిల్స్ను సహాయ సంచాలకులు చేనేత, జౌళిశాఖ రంగారెడ్డి జిల్లా కార్యాలయం నందు సమర్పించాలన్నారు.
మీ నమూనాలను/శాంపిల్స్ సంచాలకులు చేనేత, జౌళిశాఖ, హైదరాబాద్ వారి కార్యాలయం నుంచి తిరిగి వచ్చిన తర్వాత మీకు అందజేయబడుతాయన్నారు. దరఖాస్తు ఫారం, ఇతర వివరాల కోసం సహాయ సంచాలకులు చేనేత, జౌళిశాఖ రంగారెడ్డి జిల్లా కార్యాలయం నందు సంప్రదించాలని తెలిపారు.