వికారాబాద్, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ) : నేటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగనున్నాయి. సంబంధిత అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. పరీక్షల దృష్ట్యా జిల్లా యంత్రాంగం పకడ్బందీ చర్యలు చేపట్టింది. నేటి నుంచి వచ్చేనెల 14 వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్ పరీక్షలు జరుగనున్నాయి. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీలకు చెందిన 16,823 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. మరోవైపు మాస్ కాపీయింగ్కు తావు లేకుండా నిఘా నీడలో పరీక్షలను నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. జిల్లాలోని అన్ని పరీక్షా కేంద్రాల్లోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. జిల్లాలో 29 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా ఆత్మైస్థెర్యంతో పరీక్షలు రాయాలని సూచిస్తూ, మరోవైపు నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేశారు. ఉదయం 8.30 గంటల నుంచి పరీక్షా కేంద్రాలకు విద్యార్థులను అనుమతించడం జరుగుతున్నదని, ఉదయం 8.45 గంటల్లోపు పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు చేరుకోవాలని సంబంధిత అధికారులు సూచిస్తున్నారు.
పరీక్షలు రాయనున్న 16,823 మంది విద్యార్థులు..
నేటి నుంచి జరిగే ఇంటర్ పరీక్షలకు జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలకు చెందిన 16,823 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. జనరల్ విద్యార్థులు 14,136 మందికాగా, ఓకేషనల్కు సంబంధించి 2687 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం 7799 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానుండగా, వీరిలో జనరల్-6447 మంది విద్యార్థులు, ఓకేషనల్-1352 మంది విద్యార్థులు ఉన్నారు. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు మొత్తం 9024 మంది హాజరుకానుండగా, వీరిలో జనరల్-7689 మంది విద్యార్థులు, ఓకేషనల్-1335 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇంటర్ పరీక్షల నిమిత్తం జిల్లావ్యాప్తంగా 29 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో 10 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, వికారాబాద్లోని సంఘం లక్ష్మీబాయి గురుకుల పాఠశాల, ఒక మోడల్ స్కూల్, పరిగి, కొత్తగడిలోని రెసిడెన్షియల్ కాలేజీలు, మిగతా 14 పరీక్షా కేంద్రాలు ప్రైవేట్ జూనియర్ కాలేజీల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ఇప్పటికే ప్రశ్నాపత్రాలను జిల్లాలో ఏర్పాటు చేసిన స్టోర్ పాయింట్లకు చేర్చారు. జిల్లాలో ప్రశ్నాపత్రాలను నిల్వ చేయడంతోపాటు ఆయా పరీక్షా కేంద్రాలకు తరలించేందుకుగాను 10 స్టోర్ పాయింట్లను ఏర్పాటు చేశారు. వీటిలో తాండూరు, వికారాబాద్, పరిగి, మర్పల్లి, కులకచర్ల, దోమ, నవాబుపేట, మోమిన్పేట, కొడంగల్, పెద్దేముల్లో ప్రశ్నాపత్రాలను భద్రపరిచారు. ప్రతి 20 మంది విద్యార్థులకు ఒక ఇన్విజిలెటర్ చొప్పున ఇన్విజిలేటర్లను, లెక్చరర్, రెవెన్యూ, పోలీస్ శాఖతోపాటు ముగ్గురు సభ్యులతో కూడిన ఫ్లైయింగ్ స్కాడ్ బృందం, నలుగురు సభ్యులతో కూడిన రెండు సిట్టింగ్ బృందాలను నియమించారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మెరుగైన ఫలితాలు రాబట్టేందుకుగాను జిల్లా ఇంటర్బోర్డు అధికారులు కృషి చేశారు. కాలేజీ ప్రారంభం నుంచి ప్రత్యేక తరగతులు నిర్వహించి విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేశారు. జిల్లాలో వికారాబాద్, పరిగి, నవాబుపేట, మోమిన్పేట, మర్పల్లి, పెద్దేముల్, తాండూరు, కొడంగల్, దోమ మండలాల్లో ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, వికారాబాద్లో రెండు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఇంటర్ కాలేజీలు, కులకచర్లలో గిరిజన సంక్షేమ జూనియర్ కాలేజీతోపాటు సోషల్ వెల్ఫేర్ జూనియర్ కాలేజీలు ఉన్నాయి. ఈ విద్యా సంవత్సరం ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మెరుగైన ఉత్తీర్ణత శాతం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.